Phone Tapping Case: దారులన్నీ క్లోజ్.. ప్రభాకర్ రావు ఇండియాకు రావాల్సిందే
ABN , Publish Date - May 26 , 2025 | 01:03 PM
Phone Tapping Case: ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు ఊహించని ఎదురుదెబ్బ తగలింది. రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ ప్రభాకర్ వేసిన పిటిషన్పై అమెరికా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

హైదరాబాద్, మే 26: తెలంగాణలో (Telangana) సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) కీలక సూత్రధారిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు (SIB Former Chief Prabhakar Rao) అమెరికాలో (America) చుక్కెదురైంది. రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ అమెరికాలో ప్రభాకర్ రావు పిటిషన్ వేశారు. రాజకీయ కక్షలో భాగంగా తనపై కేసులు పెట్టారంటూ ఎస్ఐబీ చీఫ్ పిటిషన్ వేయగా.. అమెరికా ప్రభుత్వం తోసిపుచ్చింది. కాగా.. ఈ కేసులో ఇప్పటికే జూన్ 20లోగా కోర్టులో హాజరుకావాలంటూ ప్రభాకర్ రావుకు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభాకర్రావు పోలీసు విచారణకు హాజరుకానందున ఆయనను ప్రకటిత నేరస్థుడిగా ప్రకటించాలని సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయగా.. అందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
జూన్ 20 లోగా దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన ఇంటి గోడకు పోలీసులు నోటీసులు అంటించారు. 20వ తేదీలోగా హాజరు కాకపోతే అప్రకటిత నేరస్తుడిగా ప్రకటిస్తామని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. అలా ప్రకటిస్తే ప్రభాకర్ ఆస్తులను జప్తు చేసే అధికారం దర్యాప్తు సంస్థకు ఉంటుంది. ఇక ఆయనను అమెరికా నుంచి ఇండియాకు డిపోర్ట్ చేసేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేపట్టారు. హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ద్వారా ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాకర్ రావును విచారిస్తే మరికొన్ని కీలక అంశాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు.
అయితే ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చేందుకు నిరాకరిస్తూ అమెరికాలో రాజకీయ శరణార్థిగా తనను గుర్తించాలంటూ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. అతని వాదనలు కూడా వినిపించారు. అయితే రాజకీయ శరణార్థిగా గుర్తించేందుకు అమెరికా ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఈ క్రమంలో ప్రభాకర్ రావుకు దారులన్నీ మూసుకుపోయాయనే చెప్పుకోవాలి. ఆయన కచ్చితంగా హైదరాబాద్కు వచ్చి.. విచారణకు సహకరించాల్సి ఉంది. అలాగే ప్రభాకర్ రావు పాస్పోర్ట్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. మరోవైపు ప్రభాకర్ రావుపై ఇంటర్పోల్.. రెడ్ కార్నర్ నోటీసును జారీ చేశారు. అలాగే ప్రభాకర్ రావు ఏ ప్రాంతంలో ఉన్నారనే విషయాన్ని అమెరికా ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావును ఎందుకు డిపోర్ట్ చేయాలనే అంశాలకు సంబంధించి అమెరికా ప్రభుత్వానికి పోలీసులు ఒక నివేదికను ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
మళ్లీ అనారోగ్యం.. జీజీహెచ్కు వల్లభనేని వంశీ
పారపట్టి మట్టి పనులు చేసిన మంత్రి
Read Latest AP News And Telugu News