Share News

Gaddar Film Awards: మరికాసేపట్లో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం

ABN , Publish Date - Jun 14 , 2025 | 04:31 PM

రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక గద్దర్ తెలంగాణ అవార్డుల ప్రదానోత్సవం మరికాసేపట్లో హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హైటెక్స్‌ వేదికగా జరగనుంది.

Gaddar Film Awards: మరికాసేపట్లో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం
First Gaddar film Awards 2024 Ceremony

హైదరాబాద్, జూన్ 14: ప్రతిష్టాత్మక గద్దర్ తెలంగాణ అవార్డుల ప్రదానోత్సవం మరికాసేపట్లో హైదరాబాద్ మాదాపూర్‌లోని హైటెక్స్‌ వేదికగా జరగనుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఈ ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతోంది. అలాంటి తరుణంలో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌ హీరోహీరోయిన్లతోపాటు ప్రముఖులు భారీ ఎత్తున వస్తున్నారు. ఈ ప్రదానోత్సవంలో విజేతలకు భారీ ఎత్తున నగదు పురస్కారాన్ని అందజేయనున్నారు. ఈ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున కసరత్తు చేసిన సంగతి తెలిసిందే.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టాలీవుడ్ చిత్రాల్లో ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి.. నంది అవార్డుల పురస్కారాన్ని అందజేసేవారు. అయితే 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయింది. అదే సమయంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయింది. అనంతరం 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీ గెలిచింది. ఈ దాదాపు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో టాలీవుడ్‌లో విడుదలైన ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి పురస్కారాలు అందించే కార్యక్రమం ఒక్కటి జరగలేదు.


ఇక 2023లో ఎన్నికల వేళ.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. గద్దర్ పేరిట సినిమా పురస్కారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కొలువు తీరింది. ఇచ్చిన హామీ మేరకు గద్దర్ పేరిట సినిమా పురస్కారాలు అందజేసేందుకు చర్యలు చేపట్టింది.


అందులోభాగంగా సహాజ నటి జయసుధ అధ్యక్షతన 2024 ఏడాది ఉత్తమ చిత్రాల ఎంపిక కోసం జ్యూరీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అన్ని క్రాఫ్ట్‌లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి గద్దర్ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఇక రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి అంటే.. 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలను మూడు కేటగిరిగా ఎంపిక చేశారు. ఈ కమిటీకి ప్రముఖ నటుడు మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్ చైర్మన్‌గా వ్యవహరించారు.

Updated Date - Jun 14 , 2025 | 04:41 PM