CM Revanth KCR Family: కేసీఆర్ కుటుంబంపై రేవంత్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 11 , 2025 | 01:37 PM
CM Revanth KCR Family: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కేసీఆర్ కుటుంబ సభ్యులే శత్రువులన్నారు.

న్యూఢిల్లీ, జూన్ 11: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ పర్యటన ముగిసింది. కొత్త మంత్రులపై శాఖల కేటాయింపుపై సీఎం స్పష్టత ఇచ్చారు. తన దగ్గర ఉన్న శాఖలను కొత్త మంత్రులకు ఇస్తానని చెప్పారు. బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో సీఎం మాట్లాడుతూ.. కేసీఆర్ (Former CM KCR) హయాంలో కొన్ని నెలల వరకు మంత్రి పదవులు ఇవ్వలేదని, ఇచ్చినప్పటికీ శాఖలను కేటాయించలేదన్నారు. తాను మాత్రం రెండు మూడు రోజులకే శాఖలను కేటాయించినట్లు చెప్పారు.
కేసీఆర్ ఫ్యామిలీపై
అలాగే కేసీఆర్ కుటుంబంపై సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కేసీఆర్ కుటుంబ సభ్యులే శత్రువులని, తాను ఉన్నంత వరకు కేసీఆర్ ఫ్యామిలీకి కాంగ్రెస్లోకి ఎంట్రీ లేదని కామెంట్స్ చేశారు. కులగణన సమయంలో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కిషన్ రెడ్డి అందరి నివాసాలకు ప్రత్యేకంగా వెళ్లి వివరాలు స్వీకరించాలని హైదరాబాద్ కలెక్టర్కు ప్రత్యేకంగా సూచించినట్లు తెలిపారు. కేసీఆర్, కేటీఆర్, కిషన్ రెడ్డి, హరీష్ రావు సర్వేలో వివరాలు పంచుకోలేదన్నారు. కాళేశ్వరంలో ఏం జరిగింది, కాళేశ్వరంపై తనకు ఉన్న అభిప్రాయాలను రెండు మూడు రోజుల్లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి వివరిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు.
కిషన్ రెడ్డిపై ఫైర్
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కూడా ముఖ్యమంత్రి విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి అడ్డుపడుతుంది కిషన్ రెడ్డే అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డి ముందుకు వస్తే వారితో కలిసి వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులపై కిషన్ రెడ్డితో సమీక్ష చేసేందుకు రెఢీగా ఉన్నట్లు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి (PM Narendra Modi) ఏ రోజైనా తెలంగాణ ప్రాజెక్టులపై కిషన్ రెడ్డి నివేదిక ఇచ్చారా కనీసం తెలంగాణకు ప్రాజెక్టు ఇవ్వాలని డిమాండ్ చేశారా అని ప్రశ్నించారు. కేంద్ర కేబినెట్లో తెలంగాణ అంశాలను ఎప్పుడైనా కేంద్రమంత్రి ప్రస్తావించారా అంటూ నిలదీశారు.
నిర్మల సీతారామన్ చెన్నైకు మెట్రో తీసుకువెళ్లారని.. ప్రహ్లాద్ కర్ణాటకకు మెట్రో తీసుకెళ్లారని.. తెలంగాణ నుంచి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏమీ తీసుకురాలేదని మండిపడ్డారు. తెలంగాణలో ప్రతీ అభివృద్ధి కార్యక్రమానికి కిషన్ రెడ్డి అడ్డుగా ఉన్నారన్నారు. తెలంగాణ మంత్రివర్గం విస్తరణలో సామాజిక న్యాయం పాటించామని.. 55 శాతం మేరకు ఇప్పటికే పదవులు కేయించామన్నారు. నక్సలిజానికి అంతం ఉండదని.. సామాజిక అసమానతలు ఉన్నంత వరకు నక్సలిజం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
విచారణ ముగిసింది.. కేసీఆర్ ఏం చెప్పారో
గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టులో ఊరట
Read latest Telangana News And Telugu News