Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి ఏమన్నారంటే
ABN , Publish Date - Jun 13 , 2025 | 12:36 PM
Ahmedabad Plane Crash: దేశంలో ఇప్పటి వరకు రెండు ఇంజన్లు ఫెయిల్ అయ్యి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అని తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి అన్నారు. టేకాఫ్ అయిన క్షణాల్లోనే విమానానికి సిగ్నల్ వ్యవస్థ కట్ అయిందని తెలిపారు.

హైదరాబాద్, జూన్ 13: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి (Ahmedabad Plane Crash) 242 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి (Telangana Aviation Academy CEO Captain SN Reddy) స్పందించారు. శుక్రవారం ఏబీఎన్ - ఆంధ్రజ్యోతితో (ABN - Andhrajyothy) మాట్లాడుతూ.. సాంకేతిక సమస్య వల్లే అహ్మదాబాద్లో విమాన ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చారు. విమానానికి ఉన్న రెండు ఇంజన్లు ఫెయిల్ కావడం వల్ల ప్రమాదం జరిగినట్లు నిర్ధారణకు వచ్చామని తెలిపారు. ఒక ఇంజన్ ఎర్రర్ వస్తే మరో ఇంజన్తో విమానం నడుస్తుందని.. కానీ ఈ సంఘటనలో రెండు ఇంజన్లు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగిందని అన్నారు.
రెండు ఇంజన్లకు ఇంధనం అందకపోవడం వల్ల ఒక్కసారిగా కుప్పుకూలి పోయిందన్నారు. టేకాఫ్ అయిన క్షణాల్లోనే విమానానికి సిగ్నల్ వ్యవస్థ కట్ అయిందని... ఇంధనం కూడా అందలేదని అన్నారు. విమాన ప్రమాదాలను మూడు రకాలుగా చూస్తామన్నారు. పక్షులు ఢీ కొట్టినా , వాతావరణం ప్రతికూలంగా ఉన్నా, టెక్నికల్ ఎర్రర్ వచ్చినా ప్రమాదాలు జరుగుతాయని చెప్పారు. దేశంలో ఇప్పటి వరకు రెండు ఇంజన్లు ఫెయిల్ అయ్యి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. బ్లాక్ బాక్స్ను డీకోడ్ చేస్తే కెప్టెన్, ఫైలెట్ ఏం అలర్ట్ ఇచ్చారో తెలుస్తుందన్నారు. కెప్టెన్ మే డే అని అలర్ట్ అయితే ఏటీసీకి అందజేసినట్లు తెలిపారు.
రెండు ఇంజన్లు ఫెయిల్ అయినప్పుడు ఏటీసీ కూడా ఏమీ చేయలేదన్నారు. ఏటీసీ కేవలం సిగ్నల్ వ్యవస్థతో పాటు అబ్జర్వేషన్ను మాత్రమే చేయగలదని చెప్పుకొచ్చారు. 787 డ్రీం లైనర్ విమానం అత్యంత పటిష్టమైనదన్నారు. టెక్నికల్ సమస్యలు తక్కువగా వస్తాయన్నారు. కానీ నిన్న జరిగిన ప్రమాదంలో మాత్రం 787 డ్రీమ్ లైనర్ కూడా ఫెయిల్ అయిందన్నారు. గతంలో నేను కెప్టెన్గా ఉన్న సమయంలో ఎన్నో ప్రమాదాల నుంచి చాకచక్యంగా తప్పించినట్లు తెలిపారు. పైలట్కు శిక్షణ ఇస్తున్న సమయంలో ఒక పక్షి అడ్డుగా వచ్చినప్పుడు ఎలా తప్పించాలో నేర్పించినట్లు చెప్పారు.
‘నేను కెప్టెన్గా ఉన్నప్పుడు తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చిన సమయంలో ఒక ఇంజన్లో మంటలు వచ్చాయి. ఆ సమయంలో కూడా చాకచక్యంగా విమానాన్ని హైదరాబాద్కు తీసుకువచ్చాను. గతంలో జరిగిన ప్రమాదాలపైన నేను ఇన్వెస్టిగేషన్ చేశాను. నా దర్యాప్తులో చాలా వరకు సాంకేతిక లోపం వల్ల ప్రమాదాలు జరిగినట్లు ప్రభుత్వాలకు రిపోర్ట్ ఇచ్చాను’ అని తెలిపారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై బ్లాక్ బాక్స్ డీకోడ్ చేస్తే అసలు విషయం తెలుస్తుందన్నారు. బ్లాక్ బాక్స్లో కేవలం పైలట్, కో పైలట్ మాత్రమే వాయిస్ రికార్డు అవుతాయి తప్ప.. ప్రయాణికుల వాయిస్లు రికార్డ్ అవ్వవని అన్నారు. పైలెట్, కో పైలట్ ప్రయాణికులకు ఏదైనా అలర్ట్ చేసినా, సూచనలు చేసినా అవి రికార్డు అయ్యే ఛాన్స్ ఉంటుందన్నారు. బ్లాక్ బాక్స్ అనేది మంటల్లో కాలిపోకుండా ఉండే విధంగా దాన్ని రూపొందిస్తారన్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలు చూస్తే టేక్ ఆఫ్ అయ్యే సమయంలో మాత్రమే ఎక్కువగా టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందన్నారు. ఈ ప్రమాదంలో బ్లాక్ బాక్స్ కీలకం కాబోతోందన్నారు. రెండు రోజులు విచారణ తరువాత అసలు ప్రమాదానికి కారణాలు తెలుస్తాయని కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
తల్లుల ఖాతాల్లోకి నిధులు.. ఆనందంలో కుటుంబాలు
విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మోదీ..
Read Latest Telangana News And Telugu News