Hyderabad: ఆ కేసులో కేటీఆర్కు బిగ్ రిలీఫ్..
ABN , Publish Date - Apr 21 , 2025 | 04:38 PM
మేడిగడ్డ బ్యారేజీపై డ్రోన్ ఎగురవేశారనే కారణంతో కేటీఆర్ సహా మరికొంతమందిపై మహదేవ్పూర్ పోలీస్టేషన్లో కేసు నమోదైంది. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

హైదరాబాద్, ఏప్రిల్ 21: సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది న్యాయస్థానం. మరి ఇంతకీ ఆయనపై ఏం కేసు పెట్టారు.. హైకోర్టు ఏ కేసును కొట్టేసింది.. పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. మేడిగడ్డ బ్యారేజీపై డ్రోన్ ఎగురవేశారనే కారణంతో కేటీఆర్ సహా మరికొంతమందిపై మహదేవ్పూర్ పోలీస్టేషన్లో కేసు నమోదైంది. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే, ఈ కేసును సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. గత కొంతకాలంగా ఈ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. సోమవారం కూడా కోర్టులో విచారణ జరిగింది. మేడిగడ్డ బ్యారేజీ నిషిద్ధ ప్రాంతమేమీ కాదని కేటీఆర్ తరఫు న్యాయవాది టీవీ రమణారావు వాదించారు. రాజకీయ కక్షతనే కేసు నమోదు చేశారని న్యాయవాది టీవీ రమణ కోర్టుకు తెలిపారు. దీనికి రియాక్ట్ అయిన పబ్లిక్ ప్రాసిక్యూటర్.. డ్రోన్ ఎగురవేయడం డ్యామ్ భద్రతకే ప్రమాదమన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. కేటీఆర్పై మహదేవ్పూర్ పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టేసింది. ఈ మేరకు తీర్పు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ధర్మాసనం.
మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయిందంటూ, బీఆర్ఎస్ అవినీతికి ఇదే నిదర్శనం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్.. తమ పార్టీ నేతలతో కలిసి జూన్లో భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. ఆ టైమ్ లో బీఆర్ఎస్ కార్యకర్తలు కొందరు డ్రోన్ ఎగురవేసి మేడిగడ్డ బ్యారేజీ వీడియోలు తీశారు. ఆ వీడియోలను యూట్యూబ్, ఫేస్ బుక్, ఎక్స్ తదితర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్లో అప్ లోడ్ చేశారు. దాంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. ఈ వీడియోలను పోస్ట్ చూస్తే.. మేడిగడ్డ బ్యారేజీకి ఏం కాలేదని, పెద్ద ఎత్తున వరద వచ్చినా తట్టుకున్నదని, ప్రభుత్వం కావాలనే మేడిగడ్డపై రాజకీయం చేస్తుందని ప్రచారం చేశారు. అయితే, డ్రోన్ కెమెరాతో వీడియో చిత్రీకరణకు బీఆర్ఎస్ ముందస్తు అనుమతి తీసుకోలేదంటూ ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేటీఆర్, బాల్క సుమన్, గండ్ర వెంకటరమణా రెడ్డి సహా పలువురిపై మహదేవ్పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కేటీఆర్ క్వాష్ పిటీషన్..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజీయ కక్షతనే తనపై కేసు నమోదు చేశారని, తక్షణమే ఆ కేసును కొట్టివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో పలు దఫాలుగా వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. సోమవారం నాడు కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
Also Read:
నేడు బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైం హై రికార్డ్
రూ. 500 నోట్లపై కేంద్రం కీలక నిర్ణయం
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక
For More Telangana News and Telugu News..