Share News

Harish Rao: బనకచర్లపై సుప్రీంకు వెళతాం

ABN , Publish Date - Jun 15 , 2025 | 05:08 AM

గోదావరి-బనకచర్ల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ జల దోపిడీ చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు. గోదావరి పరీవాహక ప్రజలతో కలిసి బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు వెళతామని తెలిపారు.

Harish Rao: బనకచర్లపై సుప్రీంకు వెళతాం

  • ఏపీ జల దోపిడీపై సర్కారులో స్పందన లేదు.. ఇద్దరు కేంద్ర మంత్రులూ మౌనంగా ఉన్నారు: హరీశ్‌

హైదరాబాద్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): గోదావరి-బనకచర్ల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ జల దోపిడీ చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌ రావు మండిపడ్డారు. గోదావరి పరీవాహక ప్రజలతో కలిసి బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు వెళతామని తెలిపారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును హరీశ్‌రావు వివరించారు. కృష్ణా జలాల్లో దోపిడీ జరిగినప్పుడు కూడా ఈ ప్రభుత్వం స్పందించలేదని, ఇప్పుడు గోదావరి జలాలపై ఏపీ అక్రమంగా టెండర్లు పిలుస్తుంటే మౌనంగా ఉందని మండిపడ్డారు. సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిలకు ప్రతిపక్షాల మీద ఇరిటేషన్‌ తప్ప, ఇరిగేషన్‌ మీద దృష్టి లేదని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. నాడు మహారాష్ట్రతో 2 టీఎంసీల నీటి కోసం బాబ్లీ ప్రాజెక్టుపై చంద్రబాబు పోరాటం చేశారని, నేడు 200 టీఎంసీల బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ అంతకు ఎన్ని రెట్లు పోరాటం చేయాలని ప్రశ్నించారు. ఇది 200 టీఎంసీలతో ఆగిపోదని, భవిష్యత్తులో 400 టీఎంసీలకు పెంచుకునేందుకు ఏపీ సర్కార్‌ కుట్ర పన్నుతోందని హరీశ్‌ పేర్కొన్నారు.


కేంద్రంపై నోరు మెదపరెందుకు..?

తెలంగాణకు 8 మంది కాంగ్రెస్‌ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి జలాల విషయంలో జరుగుతున్నఅన్యాయంపై ఎవరూ మాట్లాడటం లేదని హరీశ్‌ ధ్వజమెత్తారు. ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా నోరు మెదపకపోవడం విడ్డూరమన్నారు. ‘‘మీ దోస్తానా కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతారా..? కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆంధ్రాకు పది రెట్లు నిధులు ఇచ్చామని చెప్పినప్పుడు కూడా మీరు ఎందుకు స్పందించరు..?’’ అని రేవంత్‌ను ప్రశ్నించారు. గతంలో ఎఫ్‌ఆర్‌బీఎం పేరు చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు రాకుండా కేంద్రం అడ్డంకులు సృష్టించిందని తెలిపారు. నేడు చంద్రబాబుకు బనకచర్ల ప్రాజెక్టు కోసం 50 శాతం నిధులు కేటాయించి, మిగతా 50 శాతం నిధుల కోసం రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని మినహాయించి రుణాలు పొందేలా వెసులుబాటు కల్పించిందని ధ్వజమెత్తారు. నిధుల్లో, నీటి కేటాయింపుల్లో కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుంటే, రేవంత్‌ సర్కారు మౌనంగా ఉంటోందని విమర్శించారు. ఏపీ జల దోపిడీకి వ్యతిరేకంగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, ఈ ప్రాజెక్టులు నిర్మించడానికి వీల్లేదని ఏకగ్రీవంగా తీర్మానించి కేంద్రానికి పంపాలని డిమాండ్‌ చేశారు. దోస్తానా కోసం రేవంత్‌ సర్కారు మౌనంగా ఉంటే ప్రజా పోరాటానికి, న్యాయ పోరాటానికి బీఆర్‌ఎస్‌ సిద్ధమవుతుందని హెచ్చరించారు.


ముందు రోజు తేదీ వేసి ఉత్తమ్‌ లేఖలు..

బనకచర్లపై తాను ప్రజెంటేషన్‌ ఇచ్చిన అరగంటలోపే మంత్రి ఉత్తమ్‌ జలశక్తి మంత్రికి నిన్ననే రాసినట్లు ఓ లేఖ విడుదల చేశారని హరీశ్‌ అన్నారు. గతంలో కూడా ఇదే తరహాలో తాను ప్రెస్‌ మీట్‌ పెట్టిన తర్వాతే.. ముందు రోజు తేదీ వేసి మీడియాకు లేఖ విడుదల చేశారని పేర్కొన్నారు. లేఖలు రాసి మీడియాకివ్వడం కాదని, చిత్తశుద్ధి ఉంటే జల దోపిడీ విషయంలో అపెక్స్‌ మీటింగ్‌కు డిమాండ్‌ చేయాలని రేవంత్‌కు సూచించారు. ప్రజెంటేషన్‌ తర్వాత హరీశ్‌ మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. త్వరలో కాళేశ్వరంలో ఉన్న అన్ని విభాగాల వద్దకు వెళ్లి, ప్రజలకు అన్ని విషయాలను వివరిస్తామని వెల్లడించారు. కాళేశ్వరానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు బయటపెడతానని సీఎం అంటున్నారని, అయితే అవి బయటికొచ్చిన నిమిషాల వ్యవధిలో తాను కూడా కొన్ని డాక్యుమెంట్లు బయటపెడతానని చెప్పారు. గురుదక్షిణగా చంద్రబాబుకు, బనకచర్లకు వ్యతిరేకంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడటం లేదని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబుపై ఆధారపడటంతో బనకచర్లపై బీజేపీ మాట్లాడే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పులపై త్వరలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తానని హరీశ్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. 27 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..


మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

For National News And Telugu News

Updated Date - Jun 15 , 2025 | 05:08 AM