Train Accident: మాసాయిపేట రైలు దుర్ఘటనపై నాలుగో తరగతిలో పాఠ్యాంశం
ABN , Publish Date - Jul 30 , 2025 | 04:57 AM
నాలుగో తరగతి పాఠ్యాంశంలో మాసాయిపేట మానని గాయాన్ని చేర్చారు ఉపాధ్యాయులు. 11 ఏళ్ల క్రితం జరిగిన రైలు ప్రమాదంలో రుచిత అనే చిన్నారి చేసిన సాహసాన్నీ ఈ పాఠ్యాంశంతో గుర్తు చేశారు.

తోటివారి ప్రాణాలు కాపాడిన సాహస బాలిక గాథ
రామయంపేట, జూలై 29 (ఆంధ్రజ్యోతి): నాలుగో తరగతి పాఠ్యాంశంలో మాసాయిపేట మానని గాయాన్ని చేర్చారు ఉపాధ్యాయులు. 11 ఏళ్ల క్రితం జరిగిన రైలు ప్రమాదంలో రుచిత అనే చిన్నారి చేసిన సాహసాన్నీ ఈ పాఠ్యాంశంతో గుర్తు చేశారు. 16 మంది చిన్నారుల ప్రాణాల్ని చిదిమేసిన ఈ దుర్ఘటనను తెలుగు పుస్తకంలో ‘తెలుగు సాహస బాల - రుచిత’ అన్న శీర్షికతో ముద్రించి విద్యార్థులకు బోధిస్తున్నారు. 2014 జూలై 24న మెదక్ జిల్లా మాసాయిపేట రైల్వే క్రాస్ వద్ద.. పట్టాలపై ఆగి ఉన్న స్కూల్ బస్సును, నాందేడ్ వెళ్తోన్న రైలు ఢీకొంది.
ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ సహా 16 మంది అభం శుభం తెలియని పిల్లలు మృత్యుశకటానికి బలయ్యారు. అప్పట్లో ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ప్రమాదం ఓ సాహస బాలికను వెలుగులోకి తీసుకు వచ్చింది. ఒకరినొకరు కాపాడుకోలేని అచేతన స్థితిలో కూడా.. ఇద్దరు తోటి వారి ప్రాణాలు కాపాడింది రుచిత అనే చిన్నారి. రైలు దగ్గరగా వ స్తోందని గమనించిన రుచిత, బస్సు ముందుకు కదలకపోవడంతో వెంటనే ఇద్దరు పిల్లల్ని కిటికీలోంచి తోసేసి, తాను దూకేసింది. రుచిత సాహసాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం సాహస బాలికగా గుర్తించి సత్కరించింది.