ED Investigation: భూదాన్ భూములపై భారీ కుట్ర!
ABN , Publish Date - Jun 15 , 2025 | 04:23 AM
నాగారం భూదాన్ భూముల అన్యాక్రాంతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సంచలన విషయాలను వెల్లడించింది.

ఫోర్జరీతో రికార్డుల మార్పు.. సమగ్ర దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు బయటకు
హైకోర్టులో ఈడీ కౌంటర్ దాఖలు.. చట్టబద్ధంగా కొన్నామన్న ఐఏఎస్, ఐపీఎస్లు
హైదరాబాద్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): నాగారం భూదాన్ భూముల అన్యాక్రాంతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సంచలన విషయాలను వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని 181, 182, 194, 195 తదితర సర్వే నంబర్లలో ప్రభుత్వ భూదాన్ భూములపై జరిపిన ప్రాథమిక దర్యాప్తులో లోతైన కుట్ర ఉందని స్పష్టంగా తెలుస్తోందని చెప్పింది. ఫోర్జరీ, దొంగ డాక్యుమెంట్లు పెట్టి.. రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని, తహసీల్, జిల్లా, సీసీఎల్ఏ స్థాయిలో వాస్తవ రికార్డుల్లో ఉన్న విషయాలను పక్కనబెట్టి, రెవెన్యూ అధికారులు దొంగ పత్రాలను స్వీకరించారని తెలిపింది. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తే.. మరిన్ని విషయాలు బయటకు వస్తాయని అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ఏపీ, తెలంగాణకు చెందిన సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నాగారంలోని భూములకు సంబంధించి ఫోర్జరీ పత్రాలతో రెవెన్యూ రికార్డులను తారుమారు చేశారని ఆరోపిస్తూ.. మహేశ్వరం మండలం అమీర్పేట్ గ్రామానికి చెందిన బీర్ల మల్లేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు కుమ్మక్కయ్యారని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి ధర్మాసనం ఆ సర్వే నంబర్లలోని భూములను నిషేధిత జాబితాలో చేర్చాలంటూ ఏప్రిల్ 24న ఆదేశాలు జారీచేసింది.
అయితే.. సర్వే నంబర్లు 194, 195లో తాము చట్టబద్ధంగా భూములను కొనుగోలు చేశామని.. ఏకపక్షంగా తమ వాదన వినకుండా సదరు సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో పెట్టడం చెల్లదని.. ఈ మేరకు సింగిల్ జడ్జి ఆదేశాలను కొట్టేయాలని.. పలువురు ఐపీఎ్సలు, వారి కుటుంబ సభ్యులు-- మహేశ్ భగవత్, సౌమ్యామిశ్రా, స్వాతి లక్రా, రవిగుప్తా, తరుణ్జోషి, రేణుగోయల్, బీకే రాహుల్ హెగ్డే, రాహుల్ బుసిరెడ్డి, వీరన్నగారి గౌతమ్రెడ్డి, రేఖా షరాఫ్ తదితరులు డివిజన్ బెంచ్లో అప్పీల్ చేశారు. ఈ వ్యవహారాన్ని సింగిల్ జడ్జి వద్దే తేల్చుకోవాలని డివిజన్ బెంచ్ స్పష్టంచేసింది. దీంతో బీర్ల మల్లేశ్ దాఖలు చేసిన పిటిషన్ మళ్లీ సింగిల్ జడ్జి వద్దకు వచ్చింది. ఈ క్రమంలోనే సింగిల్ జడ్జి ధర్మాసనం ఎదుట ఈడీ దాఖలు చేసిన కౌంటర్ సంచలనంగా మారింది. ఇదే వ్యవహారానికి సంబంధించి అప్పటి కలెక్టర్ అమోయ్కుమార్ను సైతం ఈడీ విచారించింది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్లో.. సర్వే నంబర్ 181, 182లో ఉన్న ప్రభుత్వ భూములకు పట్టాదారు పాస్పుస్తకాలు ఇచ్చిన అప్పటి కలెక్టర్ ఆమోయ్కుమార్ వాగ్మూలాన్ని సైతం తీసుకున్నట్లు తెలిపింది. పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తే.. ప్రభుత్వ అధికారులు, ఇతరుల పాత్రపై మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. ‘‘సర్వే నంబర్లు 181, 182లో ఉన్న భూములను అసలు యజమాని అయిన నవాబ్ హాజీ అలీఖాన్ కుమారులైన అక్బర్ అలీఖాన్, ఫరూఖ్ అలీఖాన్ల నుంచి షేక్ దస్తగిరి షరీఫ్ అనే వ్యక్తి కొనుగోలు చేశారు. నవాబ్ హాజీ అలీఖాన్ కుమార్తె ఖాదరున్నీసా, ఆమె కుమారుడు మునావర్ఖాన్కు ఎలాంటి టైటిల్ హక్కులు లేకపోయినా.. అక్రమ పత్రాలతో తామే అసలు వారసులమంటూ పాస్పుస్తకాలను సంపాదించారు.
ఖాదరున్నీసా, ఆమె కుమారుడు మునార్ఖాన్ 2021లో మరో 11 సేల్ డీడ్స్ను సృష్టించారు. బొబ్బిలి దామోదర్రెడ్డి, బొబ్బిలి విశ్వనాథ్రెడ్డి, ఎన్.సంతో్షకుమార్, కొండపల్లి శ్రీధర్రెడ్డి అక్రమంగా సదరు భూములకు రిజిస్ట్రేషన్లు చేశారు. మొత్తం 40 ఎకరాలను రూ.13.57 కోట్లకు విక్రయించారు. ఈ భూముల కొన్న నలుగురు.. 40 ఎకరాలను ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్స్కు నాలుగు సేల్డీడ్ల ద్వారా రూ.17.50 కోట్లకు అమ్మేశారు. ఈ అక్రమాలపై షేక్ దస్తగిరి షరీఫ్ ఫిర్యాదుతో మహేశ్వరం పోలీ్సస్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దాని ఆధారంగా ఈడీ కేసు నమోదైంది. దాంతో అప్పటి కలెక్టర్ అమోయ్కుమార్ తదితరులను విచారించాం’’ అని ఈడీ తన కౌంటర్లో వివరించింది. ప్రభుత్వ భూములకు సంబంధించిన వ్యవహారం అని తెలిసి కూడా అప్పటి తహసీల్దార్-కం-జాయింట్ సబ్రిజిస్ట్రార్ ఆర్పీ జ్యోతి నేరపూరిత కుట్రలో భాగస్వామిగా తప్పుడు పత్రాలను స్వీకరించడం ద్వారా ప్రభుత్వ భూమిని ప్రైవేటు బిల్డర్స్ పరంచేశారని తెలిపింది. ఖాదరున్నీసా, ఆమె కుమారుడు మునార్ఖాన్, ఆర్పీ జ్యోతి, బొబ్బిలి దామోదర్రెడ్డి తదితరులు నోటిఫై చేసిన ప్రభుత్వ భూమిని విక్రయించి నేరానికి పాల్పడినట్లు వెల్లడించింది.
అదేవిధంగా సర్వే నంబర్లు 194, 195లలో ఐఏఎ్సలు, ఐపీఎ్సలు పాగావేశారని తెలిపింది. ‘‘ఆ సర్వే నంబర్ల గురించి ఎక్కడా ఎఫ్ఆర్ నమోదు కాలేదు. అందుకే మేం ఆ భూములపై దర్యాప్తు చేపట్టలేదు. అయితే సర్వే నంబర్లు 194, 195 గురించి పిటిషనర్ బీర్ల మల్లేశ్ వాంగ్మూలం ఆధారంగా వివరాలను తెలంగాణ డీజీపీకి పంపి.. ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధంగా పరిశీలించాలని కోరాం. అయితే డీజీపీ నుంచి ఎలాంటి సమాఽధానం రాలేదు. మా దర్యాప్తులో కీలక విషయం ఏంటంటే.. సర్వే నంబరు 194లోని భూములను నవాబ్ హాజీఅలీ ఖాన్ నుంచి 1992లో అబ్దుల్ షుకూర్ కుటుంబ సభ్యులు కొనుగోలు చేసినట్లు పత్రాలు ఉన్నప్పటికీ.. అబ్దుల్ షుకూర్ ల్యాండ్ గ్రాబింగ్ చేసినట్లు ఇప్పటికే రెండు ఎఫ్ఆర్లు ఉన్నాయి. దీనిప్రకారం 1992లో 194 సర్వే నంబర్లో కొనుగోళ్లు మోసపూరితమని గుర్తించాం’’ అని ఈడీ తన కౌంటర్లో తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపితే.. మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడింది.