Share News

Encounter: ఎన్‌కౌంటర్‌ మృతుల పార్థివదేహాలను వెంటనే బంధువులకు అప్పగించాలి

ABN , Publish Date - May 27 , 2025 | 05:30 AM

చత్తీస్‌గఢ్‌ అబూజ్‌మడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారి పార్థివదేహాలను వెంటనే బంధువులకు అప్పగించాలని కేంద్రం, చత్తీస్‌గఢ్‌ప్రభుత్వాలను మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది.

Encounter: ఎన్‌కౌంటర్‌ మృతుల పార్థివదేహాలను వెంటనే బంధువులకు అప్పగించాలి

  • మానవ హక్కుల వేదిక డిమాండ్‌

  • ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి

  • పౌరహక్కుల సంఘాల వినతులు

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, మే 26 (ఆంధ్రజ్యోతి): చత్తీస్‌గఢ్‌ అబూజ్‌మడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారి పార్థివదేహాలను వెంటనే బంధువులకు అప్పగించాలని కేంద్రం, చత్తీస్‌గఢ్‌ప్రభుత్వాలను మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. వేదిక ఉభయ రాషా్త్రల సమన్వయ కమిటీ సభ్యుడు ఎస్‌. జీవన్‌ కుమార్‌, రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భుజంగరావు, ప్రధాన కార్యదర్శి డా. ఎస్‌. తిరుపతయ్య సోమవారం ఒక ప్రకటన చేస్తూ ఎన్‌కౌంటర్‌లో మరణించిన అగ్రనేత నంబాల కేశవరావుతోపాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన సజ్జ వెంకట నాగేశ్వరరావు (రాజన్న), వన్నాడ విజయలక్ష్మి (భూమిక), గోనెగండ్ల లలిత (సంగీత), బుర్ర రాకేష్‌ (వివేక్‌) మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు చత్తీస్‌గఢ్‌వెళ్లి నారాయణపూర్‌ జిల్లా పోలీసులు, ఆస్పత్రి ముందు పడిగాపులు కాస్తున్నా అప్పగించడం లేదన్నారు. భౌతిక కాయాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించే బాధ్యతను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తీసుకోవాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక తరపున అన్ని ప్రజాసంఘాల ప్రతినిధులు కలసి సోమవారం పలు పార్టీలకు వినతి పత్రాలు సమర్పించారు. ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌, కార్యదర్శి నారాయణ రావు, చంద్రమౌళి, వెంకటయ్య, శ్రావణ్‌, బల్లరవి, భవాని బృందం.. హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌ గౌడ్‌లను కోరుతూ వారి కార్యాలయాల్లో వినతిపత్రం సమర్పించారు.


కేంద్రం తక్షణమే శాంతి చర్చలు జరపాలి: నారాయణ

చేవెళ్ల/హైదరాబాద్‌, మే 26( ఆంధ్రజ్యోతి): మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం తక్షణమే శాంతి చర్చలు జరపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పట్టణ కేంద్రంలో రాష్ట్రస్థాయి జన సేవాదల్‌ శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. అంతకు ముందు పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలతో కలిసి కర్రసాము చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ... మావోయిస్టులు లేని దేశంగా మార్చుతామని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుని వారిని చంపడం సరైన విధానం కాదన్నారు. పాక్‌తో శాంతి ఒప్పందం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం... దేశ పౌరులైన మావోయిస్టులతో ఎందుకు చర్చలు జరపదని ప్రశ్నించారు.


హక్కు ఉల్లంఘనే: శాంతి సమన్వయ కమిటీ

మృతదేహంతో గౌరవప్రదంగా వ్యవహరించాలనే హక్కును పోలీసులు ఉల్లంఘిస్తున్నారని శాంతి సమన్వయ కమిటీ పేర్కొంది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఏపీ, తెలంగాణకు చెందిన వారి మృతదేహాల్ని వారి బంధువులకు అప్పజెప్పకపోవడం పట్ల కమిటీ ప్రతినిధులు ప్రొ. హరగోపాల్‌, ప్రొ. జి.లక్ష్మణ్‌, డా.ఎం.ఎఫ్‌ గోపీనాథ్‌, కవితా శ్రీవాత్సవ, క్రాంతి చైతన్య, మీనా కందసామి సోమవారం ఓ ప్రకటనలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మృతదేహాలు కుళ్లిపోవడానికి ముందే వారి కుటుంబాలకు అందజేయాలని చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వానికి కమిటీ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.


కేశవరావుది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: గుమ్మడి నర్సయ్య

అరసవల్లి: అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో ఉన్న నంబాళ్ల కేశవరావును అడవుల్లోకి తీసుకెళ్లి కాల్చి చంపేశారని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని సీపీఐ(ఎంఎల్‌) నేత, మాజీ ఎమ్మెల్యే గుమ్మడినర్సయ్య ఆరోపించారు. సోమవారం ఏపీలోని శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడు తూ మృతదేహాన్నీ బంధువులకు అప్పగించకపోవడం దుర్మార్గమని, కనీస మానవత్వం లేకుండా ప్రభుత్వం ప్రవర్తించడం దారుణమన్నారు. కగార్‌ నిలిపేసి, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు.


Also Read:

సైంటిస్టులు అద్భుత ఆవిష్కరణ.. 'సూపర్-విజన్' లెన్స్‌తో చీకట్లోనూ చూసేయచ్చు..

సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఫిట్‌నెస్ మంత్ర ఇదే..

For More Health News and Telugu News..

Updated Date - May 27 , 2025 | 05:30 AM