Degree Exams: ఫీజు బకాయిలిస్తేనే డిగ్రీ పరీక్షలు
ABN , Publish Date - May 01 , 2025 | 03:59 AM
పరీక్షలంటేనే సాధారణంగా విద్యార్థులు భయపడతారు. ఇంకొన్ని రోజులు తర్వాత పరీక్షలు మొదలైతే బాగుండు అనుకుంటారు. కానీ, రాష్ట్రంలోని కాకతీయ, తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాల పరిధిలో డిగ్రీ అభ్యసిస్తున్న విద్యార్థుల పరిస్థితి మరోలా ఉంది.

రాష్ట్రంలోని 5 విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ పరీక్షలు బంద్
4.80 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం
రూ. 600 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు
నాలుగేళ్లుగా చెల్లింపులు లేవని యాజమాన్యాల ఆందోళన
హైదరాబాద్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): పరీక్షలంటేనే సాధారణంగా విద్యార్థులు భయపడతారు. ఇంకొన్ని రోజులు తర్వాత పరీక్షలు మొదలైతే బాగుండు అనుకుంటారు. కానీ, రాష్ట్రంలోని కాకతీయ, తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాల పరిధిలో డిగ్రీ అభ్యసిస్తున్న విద్యార్థుల పరిస్థితి మరోలా ఉంది. సాధారణంగా ఏప్రిల్ నెలలో ప్రారంభం కావాల్సిన పరీక్షలు ఇప్పటికీ మొదలవ్వలేదు. పైగా, పరీక్షలు ఎప్పుడు జరుగుతాయి ? అసలు నిర్వహిస్తారా ? లేదా? తెలియక గందరగోళంలో ఉన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల వ్యవహారమే ఇందుకు కారణం. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు నాలుగేళ్లుగా విడుదల కాకపోవడంతో ఆయా వర్సిటీల పరిధిలోని కాలేజీలు పరీక్షలను బంద్ చేశాయి. కళాశాలలకు తాళాలు వేసి విద్యార్థులకు సెలవులు ఇచ్చాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తేనే పరీక్షలు నిర్వహిస్తామని తేల్చిచెబుతున్నాయి.
4.80 లక్షల మందిపై ప్రభావం
రాష్ట్ర వ్యాప్తంగా 816 ప్రైవేటు కళాశాలలు సహా 1,086 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 6 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న కళాశాలల్లో 1.20 లక్షల మంది ఉండగా.. మిగిలిన 4.80 లక్షల మంది విద్యార్థులు కాకతీయ, తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్నారు. ఓయూ పరిధిలోనే షెడ్యూల్ ప్రకారం డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. మిగిలిన ఐదు విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో పరీక్షలు నిర్వహించడం లేదు. గురువారం నుంచి ప్రిపరేషన్ హాలిడేస్ ఇచ్చారు. నిర్ణీత షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 22 నుంచి పరీక్షలు మొదలవ్వాలి. కానీ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఆ తేదీకి పరీక్షలు పట్టకపోవటంతో 28 తేదీకి వాయిదా వేశారు. ఆ రోజున కూడా పరీక్షలు ప్రారంభించకపోవటంతో మే 6వ తేదీ నుంచైనా పరీక్షలు నిర్వహించాలని యూనివర్సిటీల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దానికి కూడా అంగీకరించని యాజమాన్యాలు కళాశాలలకు తాళాలు వేసి పరీక్షలు ప్రారంభించే వరకు ఇంటి దగ్గరే చదువుకోవాలని విద్యార్థులు చెప్పాయి. సకాలంలో పరీక్షలు నిర్వహించపోవటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షలు కాస్త ఆలస్యంగా జరిగితే మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు పెద్దగా సమస్య లేదు కానీ.. మూడో సంవత్సరం విద్యార్థులు మాత్రం నష్టపోయే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు రాయటానికి, పీజీ సెట్ రాయడానికి ఆయా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి.
రూ. 600 కోట్లు బకాయిలు
గత ప్రభుత్వం రెండున్నరేళ్లు, ఈ ప్రభుత్వం ఏడాదిన్నర కలిపి నాలుగేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలకు రూ.600 కోట్ల మేర ప్రభుత్వం బకాయి పడింది. సగటున ఒక్కో సైన్సు గ్రూపు విద్యార్థి పేరు మీద ప్రభుత్వం ఏడాదికి రూ.15 వేలు చెల్లించాల్సి ఉంటుంది. బీఏ, బీకాం ఇతర గ్రూపులకైతే రూ.7,500 నుంచి రూ. 10 వేల చొప్పున చెల్లించాలి.నాలుగేళ్లుగా ఈ బకాయులు మంజూరు చేయకపోవటంతో కళాశాలల యాజమాన్యాలు రకరకాలు ఆందోళనలు చేపట్టాయి. చివరకు పరీక్షలు బహిష్కరించి నిరసన తెలుపుతున్నాయి.
అప్పుల ఊబిలో యాజమాన్యాలు
రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. పరీక్షలు బంద్ చేసిన 5 విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో 80 నుంచి 90 శాతం విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంటుపై ఆధారపడి చదువుకునేవాళ్లే! దీంతో ఆయా కళాశాలు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపైనే ఆధారపడి నడుస్తున్నాయి. ప్రభుత్వం రీయింబర్స్మెంట్ డబ్బు ఇవ్వకపోవడంతో ఆ కాలేజీల నిర్వహణ కూడా కష్టంగా మారింది. కళాశాలల యాజమాన్యాలు అప్పులు తెచ్చి బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలు చెల్లిస్తున్నాయి. నిజానికి, విద్యార్థుల పేరు మీద విశ్వవిద్యాలయాలకు యాజమాన్యాలు పరీక్ష ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. చాలా యాజమాన్యాలు అవి కూడా చెల్లించలేదు. దాంతో విద్యార్థులకు హాల్టికెట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. విద్యార్థుల నుంచి వసూలు చేసిన పరీక్ష ఫీజులను కూడా కొన్ని కళాశాలు నిర్వహణ ఖర్చులకే వాడుకున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కాగా, ప్రభుత్వాన్ని బకాయిలు విడుదల చేయాలని కోరితే... ఆర్థిక ఇబ్బందులున్నాయని చెబుతున్నారని, అంతకంటే ఎక్కువ ఆర్థిక ఇబ్బందుల్లో తాము ఉన్నామని కాకతీయ యూనివర్సిటీ పరిధి డిగ్రీ కళాశాలల సంఘం అధ్యక్షుడు ఉపేందర్రెడ్డి వాపోయారు. కళాశాలల అద్దెలు, అప్పులు పెరిగిపోయాయని.. టీ తాగుదామన్నా ఇంటి నుంచి తెప్పించుకోవాల్సిన దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని ఓయూ పరిధి డిగ్రీ కాలేజీల సంఘం ప్రధాన కార్యదర్శి రమేష్ ఆవేధన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా రూ.4 కోట్ల బకాయిలు మంజూరు కాకపోవటంతో ఈ ఏడాది నుంచి మొదటి సంవత్సరం విద్యార్థుల అడ్మిషన్లు నిలిపివేశామని వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వీరమల్ల మాధవరెడ్డి తెలిపారు. ఈ ఏడాదిలో కాలేజీ నిర్వహణకు రూ.1.30 కోట్లు ఖర్చు అయ్యిందని, అప్పు తెచ్చి వేతనాలిచ్చామని, వీటిపై వడ్డీ రూ.40 లక్షలు అయ్యిందని ఆయన వాపోయారు.
Also Read:
BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ
Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..
Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..