Maoist Cremation Outrage: మావోయిస్టుల మృతదేహాలంటే మోదీ, అమిత్ షాలకు అంత భయమా
ABN , Publish Date - May 28 , 2025 | 04:50 AM
మావోయిస్టులను ఎన్కౌంటర్లో చంపిన తర్వాత వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించకుండా పోలీసులు దహనం చేయడాన్ని సామాజికవేత్తలు, వామపక్షాలు తీవ్రంగా ఖండించాయి. మానవహక్కుల ఉల్లంఘనగా పేర్కొంటూ, విచారణ కోరుతూ జాతీయ మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించారు.

కుటుంబ సభ్యులకు అప్పగించకుండా
పోలీసులే దహనం చేయడం అమానుషం
మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించాం
సామాజిక వేత్త ఆచార్య హరగోపాల్
హైదరాబాద్ హైదరాబాద్ సిటీ, ఖమ్మం సంక్షేమ విభాగం, మే27 (ఆంధ్రజ్యోతి): ఎన్కౌంటర్ పేరుతో చంపడమేకాకుండా, మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించకుండా ఛత్తీస్గఢ్ ప్రభుత్వమే దహనం చేయడం అత్యంత అమానుషమైన చర్య అని ప్రజాసంఘాల ప్రతినిధులు, వామపక్ష వాదు లు, సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శక్తివంతమైన ప్రధాని, హోంమంత్రి అంటూ ప్రచారం చేసుకొంటున్న మోదీ, అమిత్షాలు మావోయిస్టుల భౌతికకాయాలకు కూడా భయపడుతున్నారా.?అని నిలదీశారు. మంగళవారం హైదరా బాద్లో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని, మృతదేహాలను దహనం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ‘ఏపీ ప్రభుత్వమైతే కేశవరావు, నవీన్, సంగీతల మృతదేహాలను స్వరాష్ట్రానికి తీసుకురావొద్దని బాధిత కుటుంబాలను బాహాటంగానే హెచ్చరించింది. ఆవిషయంలో సఫలీకృతమైంది’ అని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం సైతం ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ప్రముఖ సామాజిక వేత్త ఆచార్య హరగోపాల్ మాట్లాడుతూ ఇదే విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ తాము జాతీయ మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆదివాసీ హక్కు ల పోరాట సంఘీభావ వేదిక కన్వీనర్ ప్రొ. అన్వర్ఖాన్, కో-ఆర్డినేటర్ ప్రొ.గడ్డం లక్ష్మణ్, ఎన్ నారాయణరావు, సీపీఐ నాయకురాలు పశ్యపద్మ, సీపీఐ(ఎంఎల్)నేతలు గోవర్దన్, రమేశ్, షేక్షావలి, పీవోడబ్ల్యూ, చైతన్యమహిళా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎన్కౌంటర్పై విచారణ జరిపించాలి
మావోయిస్టుల మృతదేహాలను అప్పగించకుండా, కుటుంబసభ్యులను బెదిరించి పోలీసులే అంత్యక్రియలు నిర్వహించడం సరైన చర్య కాదని వామపక్ష పార్టీల నేతలు అన్నారు. శాంతి చర్చల సంఘం నేత లతో కలిసి సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మావో యిస్టులతో చర్చలకు ముందుకు రావాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. బూటకపు ఎన్కౌంటర్లో చంపినందుకే మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించేందుకు మోదీప్రభుత్వం భయపడిందన్నారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. శవాలను అడ్డు పెట్టుకుని రాజకీయాలకు పాల్పడడం తగదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి మనుషులను చంపేహక్కు ఎవరిచ్చారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ప్రశ్నించారు.
హోం మంత్రులపై కేసులు పెట్టాలి
నంబాల కేశవరావు ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలని, ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నేతలు కోరారు. ఖమ్మంలో వారు మీడియాతో మాట్లాడారు. మావోయిస్టుల మృతదేహాలను అమానవీయంగా కాల్చి వేశారని, ఇందుకు బాధ్యులైన కేంద్ర హోంమంత్రి, ఛత్తీస్గఢ్ హోంమంత్రిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.