Share News

Chamala Kiran Kumar Reddy: ‘మిస్‌ ఇంగ్లండ్‌’తో బీఆర్‌ఎస్‌ వాళ్లే మాట్లాడించారేమో: చామల

ABN , Publish Date - Jun 03 , 2025 | 04:14 AM

తెలంగాణ ప్రభుత్వాన్ని బద్‌నాం చేయడం కోసం.. మిస్‌ ఇంగ్లండ్‌ మిల్లా మాగీతో బీఆర్‌ఎస్‌ వాళ్లే అలా మాట్లాడించారేమో..’ అంటూ కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

Chamala Kiran Kumar Reddy: ‘మిస్‌ ఇంగ్లండ్‌’తో బీఆర్‌ఎస్‌ వాళ్లే మాట్లాడించారేమో: చామల

  • బీఆర్‌ఎస్‌ బలహీనపడితే.. బలపడేది బీజేపీనే: యాష్కీ

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణ ప్రభుత్వాన్ని బద్‌నాం చేయడం కోసం.. మిస్‌ ఇంగ్లండ్‌ మిల్లా మాగీతో బీఆర్‌ఎస్‌ వాళ్లే అలా మాట్లాడించారేమో..’ అంటూ కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఆమెను ఇబ్బంది పెట్టినట్లుగా వీడియో ఫుటేజీలు ఉంటే బయటపెట్టాలంటూ హరీశ్‌రావుకు సవాల్‌ విసిరారు. సీఎం సన్నిహిత ఎంపీ, కార్పొరేషన్‌ చైర్మన్‌లు మిల్లీ మాగీని ఇబ్బంది పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయంటూ హరీశ్‌ చేసిన వ్యాఖ్యలపై చామల ఈ మేరకు స్పందించారు. మూడేళ్లకే కేసీఆర్‌ సీఎం అవుతాడని కేటీఆర్‌ అంటున్నాడని, ఆయన సీఎం అయ్యేది స్వర్గానికా.. లేక నరకానికా అని ప్రశ్నించారు. కేటీఆర్‌కు ఉన్న నల్లధనాన్ని మొత్తం ఖర్చు పెట్టినా.. కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి రాడన్నారు.


తెలంగాణలో కన్ఫ్యూజన్‌ పొలిటీషియన్‌ ఎవరైనా ఉన్నారంటే ఆయన ఈటల రాజేందరేనని ఎద్దేవా చేశారు. ఆయన ఇంటిలోపల ఈటల రాజేందర్‌రెడ్డి అని, ఆ ఇంటి గేటు దాటగానే బీసీ నాయకుడైపోతాడని విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత చర్యలతో బీఆర్‌ఎస్‌ బలహీన పడితే.. ఆ స్థానంలో బీజేపీనే బలపడుతుందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ వ్యాఖ్యానించారు. కవిత.. బీజేపీ వదిలిన బాణమేనన్నారు. ఆమె ఓ లేడీ మాఫీయా డాన్‌, ఆమె చేయని దందాలు లేవని ఆరోపించారు. ఆ కేసుల నుంచి బయటపడాలంటే ఆమెకు బీజేపీ సహకారం అవసరమన్నారు. జాగృతి.. ఓ అవినీతి సంస్థ అని, దానిపై విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jun 03 , 2025 | 04:14 AM