Congress: కేటీఆర్.. మహా డ్రామారావు!
ABN , Publish Date - Jan 17 , 2025 | 03:16 AM
అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాధనంతో దోస్తులను కాపాడుకున్న ఘనత మాజీ మంత్రి కేటీఆర్కే దక్కుతుందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి అన్నారు.

ప్రజాధనంతో దోస్తులను కాపాడుకున్నారు: చామల
కౌశిక్రెడ్డీ.. బట్టలూడదీసి కొడ్తాం జాగ్రత్త: మెట్టు సాయి
హైదరాబాద్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాధనంతో దోస్తులను కాపాడుకున్న ఘనత మాజీ మంత్రి కేటీఆర్కే దక్కుతుందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. కేటీ రామారావు కాదు.. ఆయన మహాడ్రామారావు అంటూ మండిపడ్డారు. ఒక యువరాజులాగా వ్యవహరిస్తూ ప్రజాధనాన్ని దోస్తులకు దోచిపెట్టడం కోసమే ఫార్ములా ఈ-రేస్ నిర్వహించినట్టుగా ప్రజలందరికీ తెలుసని ఓ ప్రకటన చేశారు. ఏస్ నెక్స్ట్ జనరేషన్స్ గ్రీన్కో కేటీఆర్కు అత్యంత దగ్గర మిత్రులదేనన్నారు. గాంధీభవన్లో టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీశ్ మాట్లాడుతూ.. కేటీఆర్ ఇప్పటికైనా తనపై వస్తున్న ఆరోపణలను వాస్తవం కాదని నిరూపించుకోవాలని సూచించారు. సీఎం రేవంత్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని మత్స్య కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ హెచ్చరించారు.
అవాకులు చెవాకులు పేలుతున్న కౌశిక్రెడ్డిని బట్టలూడదీసి కొడతామన్నారు. గల్లీలో టిక్ టాక్ చేసేవాళ్లు చిల్లర రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని, యువత సాగుపై దృష్టి సారించాలని రైతు కమిషన్ సభ్యురాలు భవానీరెడ్డి సూచించారు. కాగా, సభ్యత్వ నమోదులో తెలంగాణ మహిళా కాంగ్రెస్ రికార్డు సాధించిందని.. అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉందని ఆ శాఖ అధ్యక్షురాలు సునీతారావు తెలిపారు. పార్టీ పట్ల అంకిత భావం, కష్టించి పని చేసేవారికే పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పదవుల్లోనూ నియమించాలని సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్లకు వినతిపత్రం సమర్పించనున్నట్టు చెప్పారు. మహిళా నేతలకు నామినేటెడ్ పోస్టుల్లో సముచిత స్థానం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు.