Share News

Congress: అభ్యర్థిత్వం అనూహ్యం

ABN , Publish Date - Mar 10 , 2025 | 03:10 AM

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మిత్రధర్మంలో భాగంగా ఆ పార్టీకి ఇచ్చింది. మొత్తంగా ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయానికి కాంగ్రెస్‌ పెద్దపీట వేసింది. ఎస్సీ, ఎస్టీతోపాటు ఒక మహిళకు అవకాశం కల్పించింది.

Congress: అభ్యర్థిత్వం  అనూహ్యం

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి, శంకర్‌నాయక్‌

  • ఎమ్మెల్యే కోటా అభ్యర్థులను ప్రకటించిన అధిష్ఠానం

  • ఒక సీటు మిత్రపక్షం సీపీఐకి కేటాయింపు

  • అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌ సామాజిక న్యాయం

  • ఎస్సీ, ఎస్టీతోపాటు మహిళకు సీటు కేటాయింపు

  • అనూహ్యంగా తెరపైకి రాములమ్మ పేరు

  • ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకే అవకాశం!

  • అద్దంకి దయాకర్‌కు ఎట్టకేలకు దక్కిన చాన్స్‌

  • శంకర్‌నాయక్‌కు సీనియర్‌ నేతలందరి మద్దతు

  • అంతా సీఎం రేవంత్‌రెడ్డి సూచించిన వారే!

  • నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 పార్టీలూ అనూహ్యంగా అభ్యర్థిత్వాలను ప్రకటించాయి! కాంగ్రెస్‌ తన అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్‌, శంకర్‌నాయక్‌లను ప్రకటించింది! ఇక, ఎప్పటి నుంచో అధ్యక్షా.. అనాలని కోరుకుంటున్న దాసోజు శ్రవణ్‌ను బీఆర్‌ఎస్‌ ఎంపిక చేసింది! మిత్రపక్షం సీపీఐకి కాంగ్రెస్‌ ఇచ్చిన సీటులో నెల్లికంటి సత్యం పేరును ఖరారు చేసింది. ఈసారి విశేషం ఏమిటంటే.. నల్లగొండ జిల్లా జాక్‌పాట్‌ కొట్టడం! ఆ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్సీలు కాబోతుండడం..!

హైదరాబాద్‌/న్యూఢిల్లీ/నల్లగొండ/ములుగు, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠకు తెర పడింది. అయితే అనూహ్యంగా పార్టీ ఫైర్‌ బ్రాండ్‌ విజయశాంతి పేరు తెరపైకి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్‌, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, సుదీర్ఘకాలంగా డీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న కేతావత్‌ శంకర్‌నాయక్‌, మాజీ ఎంపీ విజయశాంతి పేర్లను పార్టీ అధిష్ఠానం ఆదివారం ప్రకటించింది. ఒక సీటును మిత్రపక్షం సీపీఐకి కేటాయించింది. ఈ మేరకు ప్రతిపాదనను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ (సంస్థాగత వ్యవహారాలు) ప్రకటించారు. మొత్తం ఐదు సీట్లకు ఎన్నికలు జరుగుతుండగా.. పార్టీకి ఉన్న సంఖ్యాబలాన్ని బట్టి నాలుగు సీట్లలో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌.. అందులో ఒకటి మిత్రపక్షం సీపీఐకి కేటాయించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మిత్రధర్మంలో భాగంగా ఆ పార్టీకి ఇచ్చింది. మొత్తంగా ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయానికి కాంగ్రెస్‌ పెద్దపీట వేసింది. ఎస్సీ, ఎస్టీతోపాటు ఒక మహిళకు అవకాశం కల్పించింది.


రేవంత్‌రెడ్డి సూచించిన అభ్యర్థులకే!

ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా తనకు కావాల్సిన వారికి దక్కించుకున్నారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. అద్దంకి దయాకర్‌కు సరైన సమయంలో అవకాశం కల్పిస్తామని రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో ప్రస్తావించారు. మిగిలిన ఇద్దరు అభ్యర్థుల ఎంపికలోనూ ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారని అంటున్నారు. వాస్తవానికి అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ఉదయమే ఢిల్లీకి రావాల్సి ఉంది. అయితే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ అందుబాటులో లేకపోవడంతో చివరి నిమిషంలో వారు పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆన్‌లైన్‌లోనే అభ్యర్థుల ఖరారుకు సంబంధించిన చర్చలు జరిపారు. ఆ మేరకే కాంగ్రెస్‌ అధిష్టానం అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కాగా, ఈ దఫా ఓసీలకు సీటు కేటాయించొద్దని అధిష్ఠానం నిర్ణయించడంతో ఎమ్మెల్సీ సీటుపై ఆశలు పెట్టుకున్న ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి నిరాశ ఎదురైంది. ఆయనతోపాటు రేసులో చివరిదాకా ఉన్న ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీనియర్‌ నేత జెట్టి కుసుమ్‌కుమార్‌కూ నిరాశే ఎదురైంది.


ఎట్టకేలకు అద్దంకికి అవకాశం..

తెలంగాణ ఏర్పడిన దగ్గర్నుంచీ అద్దంకి దయాకర్‌ను ఊరిస్తూ వస్తున్న చట్టసభల్లో ప్రాతినిథ్యం.. ఎట్టకేలకు దక్కనుంది. 2014, 2018 ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన దయాకర్‌ స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2023 ఎన్నికల్లో తుంగతుర్తి సీటును మందుల సామేలుకు ఇచ్చిన అధిష్ఠానం.. అద్దంకికి ఎమ్మెల్సీ సీటు హామీ ఇచ్చింది. ఇటీవల రెండు సీట్లకు జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటును తొలుత అద్దంకి దయాకర్‌కు ఖరారు చేసినా.. చివరి క్షణంలో అభ్యర్థిని మార్చేసింది. ఈ దఫా ఎమ్మెల్సీ సీటు కూడా చివరి వరకూ సస్పెన్స్‌గానే నిలిచింది. ఈ సీటును మాదిగకు కేటాయించాలా.. లేక మాలకు కేటాయించాలా అన్న తర్జన భర్జన నడిచింది. ఒక దశలో మాదిగ, మాల సామాజిక వర్గాలకు చెరోటి కేటాయించాలన్న అంశంపైనా చర్చ నడిచింది. అయితే సీపీఐకి ఒక సీటు కేటాయించడంతో రెండు సామాజిక వర్గాల్లో ఒక దానికే సీటు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆదివారం సీఎం రేవంత్‌, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి ఉత్తమ్‌తో ఫోన్‌ ద్వారా చర్చలు జరిపిన అధిష్ఠానం.. చివరికి అద్దంకి దయాకర్‌ పేరును ఖరారు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి పట్టుదలతోనే అద్దంకి దయాకర్‌కు అభ్యర్థిత్వం లభించిందని పార్టీ వర్గాలు తెలిపాయి. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్‌) మండలం నెమ్మికల్‌కు చెందిన దయాకర్‌ అద్దంకి దయాకర్‌ విద్యార్థి దశ నుంచి సామాజిక, విద్యార్థి ఉద్యమాల్లో పనిచేశారు.


అధిష్ఠానం ఆశీర్వాదంతో విజయశాంతి

తొలుత వెండితెరపై, ఆ తర్వాత రాజకీయాల్లోనూ ఫైర్‌బ్రాండ్‌గా కొనసాగిన విజయశాంతి.. ఎమ్మెల్సీ అభ్యర్థుల రేసులో అనూహ్యంగా తెరపైకి వచ్చారు. ఇటీవల ఆమె అధిష్ఠానం పెద్దలను కలిసి తన అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు చేసుకున్నారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సోనియా సమక్షంలో బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలో చేరిన విజయశాంతి.. 2018 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు. అయితే ఆ పార్టీ రాజకీయాల్లో ఇమడలేక 2023 ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఆమె చేరే సమయంలోనే పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ సీటు ఇస్తామని అప్పటి రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే హామీ ఇచ్చారు. అధిష్ఠానాన్ని కలిసిన విజయశాంతి ఈ హామీని గుర్తు చేసినట్లు చెబుతున్నారు. ఈ హామీతోపాటు బీసీ మహిళ కోటాలో విజయశాంతిని అభ్యర్థిగా అధిష్ఠానం నిర్ణయించింది. అయితే విజయశాంతిని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆమె మూలాలకు సంబంధించిన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 2005లో తల్లి తెలంగాణపార్టీని స్థాపించిన తొలిరోజుల్లో తన స్వస్థలం ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలం రామన్నగూడెంగా విజయశాంతి ప్రకటించుకున్న సంగతి తెలిసిందే.


సామాన్య కార్యకర్త నుంచి ఎదిగిన శంకర్‌నాయక్‌

కేతావత్‌ శంకర్‌నాయక్‌.. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ఎదిగారు. ప్రస్తుతం నల్లగొండ డీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న శంకర్‌నాయక్‌.. జానారెడ్డికి సన్నిహితుడిగా పేరుంది. దీనికితోడు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌, మంత్రి ఉత్తమ్‌ ఆయన అభ్యర్థిత్వానికి మద్దతుగా నిలిచారు. పార్టీలో 30ఏళ్ల సీనియారిటీ ఉండడం కూడా శంకర్‌నాయక్‌కు కలిసొచ్చింది. శంకర్‌నాయక్‌ స్వగ్రామం నల్లగొండ జిల్లాలోని కేతావత్‌ తండా. డిగ్రీ పూర్తయిన వెంటనే యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడిగా ప్రస్థానం ప్రారంభించిన శంకర్‌నాయక్‌ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించేవారు. సొంత మండలం దామరచర్ల నుంచి రెండు పర్యాయాలు జడ్పీటీసీ సభ్యుడిగా, ఒక పర్యాయం ఎంపీపీగా ఎన్నికయ్యారు. మూడు పర్యాయాలూ జనరల్‌ స్థానం నుంచే శంకర్‌నాయక్‌ ఎన్నికవడం రాజకీయాల్లో అప్పట్లో విశేషంగా చెప్పుకొన్నారు.


నామినేషన్ల దాఖలుకు నేడే ఆఖరు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు తుది గడువు సోమవారం సాయంత్రం 3 గంటలకు ముగియనుంది. ఇప్పటి దాకా 4 నామినేషన్లు దాఖలైనా.. వాటిలో ఒక్కటీ ప్రధాన పార్టీల నుంచి వచ్చినవి కావు. ఈ నామినేషన్లు.. స్ర్కూటినీలో తిరస్కరణకు గురికావడం లాంఛనమే. కాంగ్రెస్‌, సీపీఐ, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. బీజేపీ, ఎంఐఎం పార్టీలకు అభ్యర్థులను ప్రతిపాదించేంత సంఖ్యలో ఎమ్మెల్యేలు లేకపోవడంతో ఆ రెండు పార్టీలూ తమ అభ్యర్థులను రంగంలోకి దింపే అవకాశం లేదు. బీజేపీ.. తన అభ్యర్థిని రంగంలోకి దించాలంటే బీఆర్‌ఎస్‌ మద్దతు తీసుకోవడం ఒక్కటే మార్గం. అయితే బీఆర్‌ఎస్‌ మద్దతు తీసుకునే ప్రసక్తే ఉండదంటూ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇక ఎంఐఎం తన అభ్యర్థిని రంగంలోకి దింపాలంటే.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల్లో ఒకరి మద్దతు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులను ప్రకటించి, ఒకటి సీపీఐకి ఇవ్వడంతో ఆ పార్టీ మద్దతు ఎంఐఎంకు లభించే అవకాశం లేదు.


ఇవి కూడా చదవండి

BRS:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ పేరు పరిశీలన..

TG Assembly: 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..

AICC: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఎలా అంటే..

మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Read More Latest Telugu News Click Here

Updated Date - Mar 10 , 2025 | 03:10 AM