CM Revanth Reddy: కాళేశ్వరానికి మాస్టర్ ప్లాన్
ABN , Publish Date - May 16 , 2025 | 02:59 AM
దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వరం అభివృద్ధికి ఎంత ఖర్చయినా నిధులు మంజూరు చేస్తామని, వెంటనే మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

ఆలయ అభివృద్ధికి రూ.200 కోట్లు.. గోదావరి పుష్కరాల్లో శాశ్వత పనులు
సరస్వతీ పుష్కరాల్లో సీఎం రేవంత్
పుష్కర స్నానమాచరించి ముక్తీశ్వరుడికి పూజలు
వైభవంగా సరస్వతీ పుష్కరాలు ప్రారంభం
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్): దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వరం అభివృద్ధికి ఎంత ఖర్చయినా నిధులు మంజూరు చేస్తామని, వెంటనే మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణీ సంగమం వద్ద గురువారం ప్రారంభమైన సరస్వతీ నదీ పుష్కరాలకు సీఎం హాజరయ్యారు. పుష్కర స్నానమాచరించి, ముక్తీశ్వరస్వామికి అభిషేకం చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ కాళేశ్వరం అభివృద్ధికి వెంటనే మాస్టర్ ప్లాన్ తయారుచేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కాళేశ్వరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడం కోసం మంత్రి శ్రీధర్బాబు రూ.100 కోట్లు అడిగారని, రూ.200 కోట్లు అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, ఇక్కడ గోదావరి పుష్కరాల పనుల్లో భాగంగా ఆలయానికి సంబంధించి శాశ్వత అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. గోదావరి నది ఈ ప్రాంతానికి ఆశీర్వాదం లాంటిదన్నారు.
పుష్కరాల్లో స్నానం చేయడం అంటే చేసిన తప్పులు కడుక్కోవడమేనని, తప్పులు చేసినా, చేయకున్నా పుష్కర స్నానం చేసి మంచి తపనతో ముందుకు వెళ్లాలన్నారు. ఒకప్పుడు దేశ ఆర్థిక గతిని మార్చడంలో కీలక పాత్ర పోషించిన పీవీ నరసింహారావులాగే ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధి కోసం పెట్టుబడులు తేవడంలో తనకు చేదోడు వాదోడుగా ఉంటున్న మంత్రి శ్రీధర్బాబు ఈ ప్రాంతం వ్యక్తి కావడం అదృష్టమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధికి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తేవడంలో శ్రీధర్బాబు తనకు చేదోడు వాదోడుగా ఉన్నారని చెప్పారు. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివా్సరెడ్డి, శ్రీధర్బాబు కూడా మాట్లాడారు. గురువారం సాయంత్రం 4.14 గంటలకు హెలికాప్టర్లో కాళేశ్వరం చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... నేరుగా ప్రధాన ఘాట్కు చేరుకుని 15 అడుగుల సరస్వతీ మాత ఏకశిలా విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొత్తగా నిర్మించిన జ్ఞాన సరస్వతీ ఘాట్ను ప్రారంభించారు. వీఐపీ ఘాట్కు సరస్వతీ ఘాట్గా నామకరణం చేశారు. అనంతరం పుష్కర స్నానమాచరించి, సరస్వతీ మాతకు ప్రభుత్వం తరఫున చీర, సారెను సమర్పించారు. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో మహాదేవుని దర్శించుకుని, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. సరస్వతి నదీ ఒడ్డుకు చేరుకుని మహానదీహారతిలో పాల్గొన్నారు.
సరస్వతీ పుష్కరాలకు వచ్చిన తొలి సీఎం రేవంత్
సరస్వతీ నది పుష్కర చరిత్రలో సీఎం పాల్గొనడం ఇదే తొలిసారి. 2013లో ఈ పుష్కరాల కోసం నాటి ప్రభుత్వం కేవలం రూ.14 లక్షలే కేటాయించింది. ప్రస్తుత పుష్కరాల కోసం సీఎం రేవంత్ 37 కోట్లు కేటాయించటంతో పాటు సరస్వతీమాత ఏకశిలా విగ్రహం, పుస్తక ఆకృతి విగ్రహాన్ని గోదావరి నది ఒడ్డున ఏర్పాటు చేశారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని పుష్కర ఘాట్లను భారీ హంగులతో నిర్మించారు.
వైభవంగా సరస్వతీ పుష్కరాలు ప్రారంభం
సరస్వతీ నది పుష్కర సంరంభానికి గురువారం అంకురార్పణ జరిగింది. స్వామీ మాధవానంద సరస్వతి తెల్లవారుజామున 5.44 గంటలకు శ్రీకారం చుట్టారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య సరస్వతీ నదికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, చీర, సారె, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, పంచామృతాలు సమర్పించారు. నదిలో పుణ్యస్నానమాచరించారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఆయన సతీమణి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ పూజలు నిర్వహించారు. పుష్కరాల్లో తొలిరోజు సుమారు 20 వేలకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని అంచనా. 600 మంది వేద పండితులు పాల్గొన్నారు. గురువారం రాత్రి 8 గంటలకు కాశీ పండితులు నవరత్న హారతిని వైభవోపేతంగా నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ఉదయం కాళేశ్వరం రానున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Rahul Gandhi: రాహుల్పై చర్యలకు రంగం సిద్ధం..
Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్ను భారత్కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..
Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్కు చుక్కెదురు
For Telangana News And Telugu News