Hyderabad: ఆక్రమించుకున్నవారికే హైడ్రా అంటే భయం
ABN , Publish Date - May 09 , 2025 | 02:49 AM
మూసీ పరీవాహకాన్ని, చెరువులను ఆక్రమించుకున్న వారికే హైడ్రా అంటే భయం, కోపం ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వం ముందుకెళ్లకుండా కుట్రలు
హైడ్రా పీఎస్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి
మూసీ పరీవాహకం ప్రజలతో త్వరలో ఆత్మీయ సమ్మేళనం
యూనివర్సిటీ భూములు తీసుకోలేదు
ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా ప్రజలకు మేలు జరగకుండా కుట్రలు
హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్రెడ్డి
ప్రత్యేక వాహనాలు, వెబ్సైట్ ఆవిష్కరణ
హైదరాబాద్ సిటీ, మే8 (ఆంధ్రజ్యోతి): మూసీ పరీవాహకాన్ని, చెరువులను ఆక్రమించుకున్న వారికే హైడ్రా అంటే భయం, కోపం ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. సరైన సమయంలో ఆలోచన చేయకపోవడం, నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా వంటి నగరాలు నివాసయోగ్యం కాకుండా పోతున్నాయని.. గుణపాఠం నేర్చుకోకపోతే భవిష్యత్తులో హైదరాబాద్లో అదే పరిస్థితి నెలకొంటుందన్నారు. అందుకే ఎవరెన్ని విమర్శలు చేసినా ఆక్రమణ నియంత్రణ, నిర్మూలన కోసం హైడ్రాను ఏర్పాటు చేశామని స్పష్టంచేశారు. గురువారం బుద్ధభవన్లో హైడ్రా పోలీసుస్టేషన్ను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. 85హైడ్రా ప్రత్యేక వాహనాలు, 37 ద్విచక్ర వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. హైడ్రా వెబ్సైట్ను ఆవిష్కరించారు. తర్వాత సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. నగరంలో మునిసిపల్, విద్యుత్, ఇరిగేషన్, పోలీసు తదితర శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ఏదైనా సమస్య ఏర్పడితే ముందు ఎవరు వెళ్లాలనే విషయంలో ఇబ్బందులున్నాయని, అందుకే హైడ్రా కు రూపకల్పన చేశామని చెప్పారు.
హైడ్రా కేవలం కూలగొట్టడానికి కాదు..
హైడ్రా అంటే పేదోళ్ల ఇళ్లు కూలగొట్టేందుకే అన్నట్టుగా కొందరు చిత్రీకరిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. ‘‘హైడ్రా కేవలం కూలగొట్టడానికి కాదు.. నిర్మాణాలు చేయడానికి, ఎంతటి గొప్పవారు ఆక్రమణలకు పాల్పడినా చట్టం ముందు సమానులే అని నిరూపించడానికి తీసుకొచ్చాం. దీనిలో విపత్తుల సహాయక చర్యలూ భాగమే. అకాల వర్షాలు, గాలి దుమారానికి చెట్లు, స్తంభాలు విరిగిపడుతున్నాయి. బస్తీల రోడ్లకు గోడలు అడ్డంగా కట్టి ఇబ్బందులు కలిగిస్తున్నారు. వీటన్నింటినీ పరిష్కరించడానికి హైడ్రా ముందుకొచ్చింది’’అని సీఎం చెప్పారు. హైడ్రా అధికారులు మానవీయకోణంలో వ్యవహరించాలని... పేదల పట్ల సానుభూతితో, పెద్దల పట్ల కఠినంగా ఉండాలని సూచించారు. ‘‘విలాసవంతమైన లేక్వ్యూ పేరుతో అపార్ట్మెంట్లను చెరువుల్లో కడుతున్నారు. గండిపేట, హిమాయత్సాగర్లో ఫామ్హౌజ్లు కట్టినవారు వాళ్ల డ్రైనేజీ తీసుకెళ్లి తాగునీటిలో కలుపుతున్నారు. నియంత్రించాల్సిన బాధ్యతలేదా? ప్రముఖులు హైటెక్సిటీ ప్రాంతంలో చెరువులు ఆక్రమించుకుంటే పునరుద్ధరిస్తున్నాం’’ అని రేవంత్ తెలిపారు. మూసీ మురికికూపంలో బతుకుతున్న పేదలకు మంచి జీవితం అందజేద్దామనుకుంటే విపక్షాలు కలిసిరావడంలేదని సీఎం మండిపడ్డారు. ‘‘మీరేమో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, జన్వాడ, ఎర్రవల్లి ఫామ్హౌ్సలలో విశాలమైన భవంతుల్లో బతుకుతారు.
పేదలు మురికిలోనే మునిగిచావాలా? గుజరాత్లో మోదీ సబర్మతిని కట్టుకోవచ్చు. ఉత్తరప్రదేశ్లో యోగి గంగానదిని పునరుద్ధరించుకోవచ్చు. తెలంగాణలో మూసీ ప్రక్షాళన చేయొద్దా? మోదీ చేస్తే గొప్ప ఎట్లా? తెలంగాణ ప్రభుత్వం చేస్తే తప్పు ఎట్లా?’’ అని ప్రశ్నించారు. త్వరలో అధికారులు, ప్రజాప్రతినిధులను పంపి.. మూసీ పరీవాహక ప్రాంతాల్లో ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తామని చెప్పారు. అక్కడి పేదల జీవితాలకు వెలుగునిస్తామని, అవసరమైతే ఫ్యూచర్ సిటీలో ఇళ్ల పట్టాలు ఇస్తామని తెలిపారు. లేకుంటే ఆ ప్రాంతాల్లోనే ప్రతి 5 కిలోమీటర్లకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి, ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ అపార్ట్మెంట్ కట్టి ఫ్లాట్లు ఇస్తామన్నారు. చెరువులు, నాలాల ఆక్రమణలు తొలగిస్తే నగరం శోభ పెరుగుతుందని, ఇలా ప్రకృతిని కాపాడుతామంటే కొందరికి దుఃఖం వస్తోందని సీఎం విమర్శించారు. ‘‘యూనివర్సిటీ భూములు 400 ఎకరాలను ఎవరో ప్రైవేటు కంపెనీకి కట్టబెడితే.. 20ఏళ్ల తర్వాత కొట్లాడి వెనక్కి తీసుకొచ్చి అందులో పెద్ద ఐటీ పార్కును అభివృద్ధి చేద్దామనుకుంటే అడ్డుకున్నారు. చెరువులను కాపాడి, మూసీని ప్రక్షాళన చేసి, నాలా లు, రోడ్ల ఆక్రమణలు తొలగిస్తే ప్రకృతిని కాపాడినట్లుకాదా? అలాచేస్తే రియల్టీ పడిపోతుందంటారు. ఈ 400ఎకరాల్లో ఐటీ పార్కు ఏర్పాటు చేద్దామంటే ప్రకృతి పడిపోతుందంటారు. కడుపు నిండా విషం నింపుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకెళ్లనివ్వొద్దన్న ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది’’అని అన్నారు.
నేడు బెంగళూరుకు సీఎం
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం ఉదయం బెంగళూరుకు వెళ్లనున్నారు. అక్కడ ఓ ఆంగ్ల పత్రిక నిర్వహించే ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2.15 గంటల నుంచి 2.45 గంటల వరకు ఆ కార్యక్రమంలో పాల్గొని సామాజిక న్యాయం అనే అంశంపై మాట్లాడతారు. తిరిగి సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారు. ఆ కార్యక్రమంలో సీఎం రేవంత్, మరికొన్ని రాష్ట్రాల సీఎంలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.
సామాజిక బాధ్యతతో హైడ్రా ముందుకు..: కమిషనర్ ఏవీ రంగనాథ్
ఇరిగేషన్, రెవెన్యూ, మునిసిపల్, పోలీస్శాఖల అధికారాలను హైడ్రాకు పోలీస్ ేస్టషన్ ద్వారా కల్పించారని, చాలా సందర్భాల్లో ఈ అధికారాలు తమకు ఉపయోగకరంగా ఉంటాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. సామాజిక బాధ్యతతో హైడ్రా ముందుకు వెళ్తుందన్నారు. భూముల ఆక్రమణలు, మోసాలు, ఫోర్జరీలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకునే అవకాశం దక్కిందన్నారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నూతన మేయర్గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక
హరిరామ్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
For More AP News and Telugu News