CM Revanth Reddy: ప్రగతే మా పథం
ABN , Publish Date - Jun 03 , 2025 | 03:35 AM
దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చే లక్ష్యంతో పని చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు.

రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతాం
2047కి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం
న్యూయార్క్, టోక్యోతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీ
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో సీఎం రేవంత్రెడ్డి
9 మంది ప్రముఖులకు నగదు పురస్కారాలు
రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని, అమిత్ షా, ఖర్గే, రాహుల్
హైదరాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ ఎకానమీగా మార్చే లక్ష్యంతో పని చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. పారదర్శక పరిపాలనతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని కోరారు. 2047 నాటికి తెలంగాణను నంబర్వన్ స్థానంలో నిలిపే దిశగా ప్రజా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించి.. సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి జపాన్లోని కిటాక్యుషు నగర మేయర్ కజుహిసా టకేచీ.. అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలనుద్దేశించి సీఎం మాట్లాడుతూ.. తెలంగాణను అభివృద్ధి పథం వైపు నడిపించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న ప్రణాళికలను వివరించారు. ‘‘2047 నాటికి తెలంగాణను దేశంలో అగ్రభాగాన నిలపాలని ప్రయత్నిస్తున్నాం. ఆ దిశగానే ‘తెలంగాణ రైజింగ్-2047’ భవిష్యత్తు ప్రణాళికను సిద్థం చేస్తోంది. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. వాటిని నెరవేర్చే ప్రయత్నాలకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రజల ఆలోచనలే ఆచరణగా ముందుకెళుతున్నాం’’ అని సీఎం రేవంత్ అన్నారు. సామాజిక తెలంగాణ కోసం బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ, ఇందిరమ్మ ఇండ్లు, ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం వంటి నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.
పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తాం..
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణను, ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దడానికి పలు చర్యలు చేపట్టినట్లు సీఎం రేవంత్ చెప్పారు. మూసీ పునరుజ్జీవ పథకం, ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, మెట్రో రైలు విస్తరణ ప్రణాళికలు, విమానాశ్రయాలు, రీజినల్ రింగ్ రోడ్డు వంటి అంశాలను వివరించారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రికి పూర్వ వైభవం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని, ఇందుకోసం 27 ఎకరాల్లో రూ.2,700 కోట్లతో కొత్త భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని చెప్పారు. యువత మన భవిష్యత్తు అని, అందుకే తమ ప్రభుత్వం 16 నెలల్లోనే 60 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి, నియామక పత్రాలు అందించిందని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి అమలు చేస్తున్నామని, సివిల్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నామని అన్నారు. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
న్యూయార్క్, టోక్యోకు దీటుగా ఫ్యూచర్ సిటీ...
న్యూయార్క్, టోక్యో నగరాలతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో తెలంగాణ ప్రపంచ పెట్టుబడులకు కేంద్రంగా మారుతుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో, 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నామని అన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉన్నప్పుడే రాష్ట్ర అభివృద్ధి, నిర్దేశిత లక్ష్యాలు సాధ్యమవుతాయని సీఎం అన్నారు. ఆ లక్ష్యంతోనే పోలీసు యంత్రాంగాన్ని పటిష్టపరచడం, మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ వేదికగా మారుస్తూ భారత్ సమ్మిట్ను నిర్వహించామని, ‘తెలంగాణ జరూర్ ఆనా’ నినాదంతో మన సంస్కృతి, చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటాలన్న లక్ష్యంతో ‘మిస్ వరల్డ్’ పోటీలు నిర్వహించామని చెప్పారు. ఇక రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకెళుతోందని సీఎం అన్నారు. మహిళల అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన కోసం చేపట్టిన పలు పథకాలను వివరించారు. స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు క్యూఆర్ కోడ్తో కూడిన ప్రత్యేక కార్డులు అందజేయాలని నిర్ణయించామని, వారికి ప్రతి సంవత్సరం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ వివరాలతోపాటు పూర్తి వివరాలను ఆ కార్డులో పొందుపరుస్తామని తెలిపారు.
వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు..
రాష్ట్రానికి వెన్నెముక రైతేనని, వారికి ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎనిమిది నెలల్లోనే 25,35,964 మంది రైతులకు రూ.20,617 కోట్లు రుణమాఫీ చేసి.. అన్నదాతల రుణం తీర్చుకున్నామని తెలిపారు. ‘‘రూ.15,333 కోట్లతో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.12 వేలకు పెంచాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంతో భూమిలేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు అందిస్తున్నాం. వరి ధాన్యానికి మద్దతు ధరతోపాటు సన్నవడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నాం. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూ భారతి-2025 చట్టాన్ని తీసుకువచ్చాం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నాం’’ అని సీఎం వివరించారు. ఇక రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల్లో ప్రక్షాళనకు విప్లవాత్మక చర్యలు తీసుకున్నామన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రీ స్కూల్ విధానం తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నామని ప్రకటించారు.
ఉద్యమకారులకు నగదు పురస్కారాలు..
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మంది ప్రముఖులకు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున నగదు పురస్కారాన్ని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రోజు ఈ పురస్కారాలను సీఎం ప్రకటించారు. పురస్కారాలు అందుకున్న వారిలో ఎక్కా యాదగిరిరావు, అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ, జయరాజ్, పాశం యాదగిరి ఉన్నారు. దివంగత గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరికి సంబంధించి నగదు పురస్కారాన్ని వారి కుటుంబ సభ్యులు అందుకున్నారు. విదేశీ పర్యటనలో ఉన్న గోరేటి వెంకన్న తరఫున ఆయన కూతురు పురస్కారాన్ని స్వీకరించారు. కాగా, బహుబాషా సాహితీవేత్త నలిమెల భాస్కర్కు కాళోజీ పురస్కారాన్ని సీఎం ప్రదానం చేశారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 19 మంది పోలీస్ అధికారులకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు సీఎం రేవంత్రెడ్డి.. గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి
బేకరీలో దారుణం.. అందురూ చూస్తుండగానే..
చుండ్రు సమస్యకు సింపుల్ చిట్కాలు..
Read Latest Telangana News And Telugu News