CM Revanth Reddy: 50 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా అలైన్మెంట్లు
ABN , Publish Date - May 07 , 2025 | 03:50 AM
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆర్ఆర్ఆర్ దక్షిణభాగం అలైన్మెంట్పై జాగ్రత్తలు తీసుకోవాలని, రేడియల్ రోడ్లు, పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అనుగుణంగా రూపకల్పన చేయాలని సూచించారు. తద్వారా 50 ఏళ్ల అవసరాలకు తగిన విధంగా రోడ్ల నిర్మాణం చేయాలి.

ఆర్ఆర్ఆర్ దక్షిణభాగానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
రేడియల్ రోడ్ల పనుల ప్రక్రియను వేగవంతం చేయాలి
శాటిలైట్ టౌన్షిప్లు, పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అనుగుణంగా రేడియల్ రోడ్లు ఉండాలి
ట్రాఫిక్ సిగ్నళ్లు లేకుండా రోడ్డు దాటే ఏర్పాట్లుండాలి
ఆర్అండ్బీ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్రెడి
హైదరాబాద్, మే 6 (ఆంధ్రజ్యోతి): రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణభాగం అలైన్మెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాట్లకు తావివ్వొద్దని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. ఈ మార్గంలో అటవీ ప్రాంతం, జల వనరులు, మండల కేంద్రాలు, గ్రా మాల విషయంలో ముందుగానే లైడార్ సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వచ్చే 50 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్లు, ఇతర రహదారుల నిర్మాణం, వాటికి సంబంధించి జంక్షన్లు, అనుసంధానం ఉండాలని సూచించారు. శాటిలైట్ టౌన్షి్పలు, పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అనుగుణంగా రేడియల్ రోడ్లకు రూపకల్పన చేయాలన్నారు. మంగళవారం ఆర్ఆర్ఆర్ దక్షిణభాగం, రేడియల్ రోడ్లు, ఇతర రహదారుల నిర్మాణాలపై జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రేడియల్ రోడ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారులు ఆర్ఆర్ఆర్ బయటకు వెళ్లే ప్రాంతంలో అవసరమైన స్థాయిలో ట్రంపెట్లు నిర్మించాలని, ఎటువంటి గందరగోళానికి తావులేకుండా, ట్రాఫిక్ సిగ్నళ్లు లేకుండా రోడ్డు దాటేలా ఉండాలని సూచించారు. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ను పరిశీలించి పలు మార్పులు సూచించారు.
హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిలో ఎలివేటెడ్ కారిడార్ నూతన అలైన్మెంట్కు సంబంధించి కూడా సీఎం పలు సూచనలు చేశారు. రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా ఓఆర్ఆర్ నుంచి మంచిర్యాల వరకు నూతన రహదారి నిర్మాణానికి ప్రత్యామ్నాయ అలైన్మెంట్ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆ మార్గంలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను పరిశీలించాలని సూచించారు. ఈ కొత్త రహదారులకు సంబంధించి జాతీయ రహదారుల విభాగం అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలన్నారు. సమీక్షలో ఆర్అండ్బీ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్, ప్రత్యేక కార్యదర్శి హరిచందన, పురపాలక, పట్టణాభివృద్థి శాఖ కార్యదర్శి ఇలంబర్తి, హెచ్ఎండీ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.