Chandrababu Naidu: రెండు రాష్ట్రాలూ నాకు సమానమే
ABN , Publish Date - May 29 , 2025 | 04:59 AM
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండూ తనకు సమానమేనని.. రెండూ అభివృద్ధి చెందాలన్నదే తన ఆశ అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులు కడితే తామెప్పుడూ అభ్యంతరం చెప్పలేదని ఆయన గుర్తుచేశారు.

తెలంగాణ ప్రాజెక్టులకు మేం అభ్యంతరం చెప్పలేదు
సముద్రంలోకి పోయే నీటిని వాడుకుంటే తెలంగాణకూ లాభమే
2027కి పోలవరం పూర్తి.. టీడీపీకి ధర్మకర్తను మాత్రమే!
భావి నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్నాం: మహానాడులో చంద్రబాబు
తెలంగాణలో ముక్కోడు, ఏపీలో తిక్కోడు పోయారు: నన్నూరి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్): ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండూ తనకు సమానమేనని.. రెండూ అభివృద్ధి చెందాలన్నదే తన ఆశ అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులు కడితే తామెప్పుడూ అభ్యంతరం చెప్పలేదని ఆయన గుర్తుచేశారు. ‘‘పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా ఏపీలోని అన్ని ప్రాంతాలకూ నీరిచ్చేలా కార్యాచరణ రూపొందించాం. పోలవరం నుంచి కృష్ణానదికి.. అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కు.. అక్కడి నుంచి బనకచర్లకు నీటిని తరలిస్తాం. ఈ అనుసంధానం పూర్తయితే ఏపీ ముఖచిత్రమే మారిపోతుంది. సముద్రంలోకి వృథాగా పోయే నీటిని వాడుకుంటే తెలంగాణకూ లాభమే. బీఆర్ఎస్ దీనిపై లేనిపోని విమర్శలు చేస్తోంది’’ అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసింది.. సైబరాబాద్ను సృష్టించింది తెలుగుదేశమేనని... దేశంలో ఎక్కువ ఆదాయం వచ్చేలా హైదరాబాద్ను తీర్చిదిద్దింది కూడా టీడీపీయేనని చంద్రబాబు గుర్తుచేశారు. కడప మహానాడులో రెండో రోజు బుధవారం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన ముగింపు ప్రసంగం చేశారు. ప్రపంచంలో తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెట్టే శక్తిసామర్థ్యాలు ఒక్క టీడీపీకే ఉన్నాయన్నారు. ఏపీలో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదన్నారు. గంజాయి, డ్రగ్స్ రాజ్యమేలాయని.. ఏజెన్సీలో గంజాయి సాగు గ్రామస్థాయి పరిశ్రమగా మారిందని చెప్పారు. నేరాలను వ్యవస్థీకృతంగా మార్చేశారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలోని అధినేతే సొంత బాబాయిని చంపి ఆ నిందను తనపై వేశారని అన్నారు. రాయలసీమ సుభిక్షానికి ప్రాజెక్టులు చేపట్టామన్న బాబు.. సీమను కరువుసీమ, ఎడారి సీమ కానివ్వబోనని హామీ ఇచ్చారు. 2027 డిసెంబరుకు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు.
అదే సంకల్పం..
తెలుగుదేశం పార్టీకి తాను ధర్మకర్తను మాత్రమేనని.. ఎన్టీఆర్ ఇచ్చిన వారసత్వాన్ని కాపాడుకుంటూ.. మళ్లీ భవిష్యత్ నాయకత్వాన్ని సిద్ధం చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి తెలుగుజాతిని ప్రపంచంలోనే నంబర్ వన్ చేయాలన్నదే సంకల్పమని, దీని కోసం రాబోయే 40 ఏళ్లకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నామని తెలిపారు. 43 ఏళ్లుగా టీడీపీ జెండా రెపరెపలాడుతోందంటే దానికి కారణం కార్యకర్తల త్యాగాలేనని.. వారి సంక్షేమం కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు. ‘‘రాజకీయ, పాలనా అంశాల్లో రాష్ట్రం ఫస్ట్. పార్టీ విషయంలో కార్యకర్తే ఫస్ట్. కార్యకర్తే అధినేత. ప్రాంతీయ పార్టీగా పుట్టిన టీడీపీలో సభ్యత్వాల సంఖ్య నేడు కోటికి చేరింది. ఇదీ మన బలం’’ అని సగర్వంగా ప్రకటించారు. కరడుగట్టిన నేరస్థులతో రాజకీయం చేస్తున్నామని.. కాబట్టి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలను హెచ్చరించారు. కాగా.. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవిలో రెండేళ్లు కొనసాగుతారు. మరోవైపు.. చంద్రబాబు కుమారుడు లోకేశ్కు కీలక బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. బుధవారం మహానాడు వేదిక నుంచే పలువురు సీనియర్ నేతలు ఆయనకు కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని కోరారు. ఇక.. మహానాడులో రెండోరోజు ప్రవేశపెట్టిన అత్యంత కీలకమైన రాజకీయ తీర్మానాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రతిపాదించారు. జననేత చంద్రబాబును అరెస్ట్ చేయడం ద్వారా వైసీపీ సర్కారు చేయకూడని తప్పు చేసిందని, దాని ఫలితాన్ని కూడా ఆ పార్టీ అనుభవించిందని పేర్కొన్నారు. 43 ఏళ్ల పార్టీ.. చంద్రబాబు, లోకేశ్ నాయకత్వంలో మరో 40 ఏళ్ల ప్రయాణానికి సిద్ధమవుతోందన్నారు. లోకేశ్ ప్రజలు మెచ్చిన నాయకుడే కాదు.. ప్రధాని మోదీ మెచ్చిన నాయకుడని చెప్పారు. ఆయన రూపొందించిన ఆరు శాసనాలే ఆరు ఆయుధాలుగా పార్టీ భవిష్యత్ కోసం పనిచేద్దామని పిలుపిచ్చారు. ఇక.. ‘మా తెలంగాణలో ముక్కోడు, మీ ఏపీలో మీకు తిక్కోడు పోయారు’’ అంటూ తెలంగాణ టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి ఎప్పట్లాగానే మహానాడులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘‘పార్లమెంటులో ప్రధాన భూమిక పోషించే స్థాయి, సత్తా టీడీపీకి ఉందని నిరూపించిన ఘనత అన్న ఎన్టీఆర్ది. అన్న ఎన్టీఆర్ పేదలకు కిలో రెండు రూపాయలకే బియ్యం తెస్తే, 20 ఏళ్ల తర్వాత భారత ప్రభుత్వం దానిని ఆహార భద్రత చట్టంగా చేసింది. టీడీపీ నేడు చేసే ఆలోచన, దేశానికి 20 ఏళ్ల తర్వాత మార్గదర్శకంగా నిలుస్తుంది’’ అని ఆయన కొనియాడారు. కాగా.. మహానాడులో రెండో రోజు బుధవారం దాదాపు లక్ష మందికి భోజన వసతి కల్పించారు. రాయలసీమ రుచులతో పాటు, ఎన్టీఆర్కు ఇష్టమైన నేతి మిఠాయిలు, చక్కెర పొంగలి, వెజ్ పలావ్, చికెన్, మటన్ ఐటమ్స్తో భోజనాలు ఏర్పాటు చేశారు.
మహానాడులో తెలంగాణపై తీర్మానాలు
తెలంగాణ వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులపై మహానాడులో చర్చను తెలంగాణ నేత నెల్లూరు దుర్గాప్రసాద్ ప్రతిపాదించారు. ‘‘చంద్రబాబు హయాంలో మహబూబ్నగర్, దక్షిణ తెలంగాణలో 90 శాతం ప్రాజెక్టులు పూర్తి చేశారు, మిగతా పనులు పూర్తి చేయాలి. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు. కృష్ణ, గోదావరి అనుసంధానంతో రైతులకు మేలు జరుగుతుంది. తెలంగాణలో ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలి’ అని అందులో ఆయన ప్రతిపాదించారు.
5 లక్షల మందితో నేడే టీడీపీ సభ
మహానాడు చివరి రోజు గురువారం కడపలోనే నిర్వహించే బహిరంగ సభను చంద్రబాబు, లోకేశ్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. 5 లక్షల మందితో ‘నభూతో’ అనే తరహాలో సభ జరిపి.. జగన్ సొంత జిల్లాలో పసుపు సైన్యం సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు మహానాడు వేదిక వద్దే ఈ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు కడప సహా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేస్తున్నారు. ఒక్క ఉమ్మడి కడప జిల్లా నుంచే 2.10 లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలు మొత్తం 5 వేల వాహనాలను ఇందుకు వినియోగించనున్నారు.
ప్రజాభిమానాన్ని చూరగొన్న నేత ఎన్టీఆర్: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, మే 28(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. ‘పేదల, నిమ్న వర్గాల అభ్యున్నతి దిశగా చేసిన కృషికి ఎన్టీఆర్ఎంతగానో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. ఆయన నటించిన సినిమాలు నేటికీ అలరిస్తున్నాయి. ఆయన మనందరికీ ఎనలేని స్ఫూర్తిని అందించారు. నా మిత్రుడు చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీయే ప్రభుత్వం ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేస్తోంది’ అని మోదీ పేర్కొన్నారు.
Also Read:
తెలంగాణ హైకోర్టు కొత్త సీజే ఎవరంటే
For More Telangana News and Telugu News..