Jaggareddy: నెహ్రూ, ఇందిర స్వాతంత్ర్యానికి ముందు పుట్టినోళ్లు
ABN , Publish Date - May 31 , 2025 | 04:42 AM
ఇందిరాగాంధీ, నెహ్రూల చరిత్ర తెలియని బీజేపీ నేతలు.. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు.

మోదీ, కిషన్రెడ్డి, సంజయ్ ఆజాదీ తర్వాత పుట్టారు .. చరిత్ర తెలియక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు
బీజేపీకి నాయకుడు లేక పటేల్ పేరు వాడుకుంటోంది
గాంధీ కుటుంబంపై కమలం నేతల చిల్లర మాటలు
మీడియాలో ఫోకస్ కోసమే రాహుల్ను విమర్శస్తున్నారు
గాంధీభవన్లో అటెండర్ పోస్టు ఇచ్చినా చేస్తా: జగ్గారెడ్డి
హైదరాబాద్, మే 30(ఆంధ్రజ్యోతి): ఇందిరాగాంధీ, నెహ్రూల చరిత్ర తెలియని బీజేపీ నేతలు.. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. మోతీలాల్, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ స్వాతంత్రానికి ముందు పుడితే.. మోదీ, కిషన్రెడ్డి, బండి సంజయ్, రఘునందన్రావు ఆ తర్వాత పుట్టారని అన్నారు. వీరికి కాంగ్రెస్ చరిత్ర తెలియాలంటే ఆదిత్య 369 సినిమాలో చూపించినట్లుగా టైం మెషీన్లో 145 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాలన్నారు. కాంగ్రెస్ పుట్టి 145 ఏళ్లు అయితే.. బీజేపీ పుట్టి 45 సంవత్సరాలే అయిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ చరిత్రలకు వందేళ్ల అంతరం ఉందన్నారు. బీజేపీది కాంగ్రెస్ పార్టీ మునిమనవడి వయసని అన్నారు. శుక్రవారం గాంధీభవన్లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. కిషన్రెడ్డి మొట్టికాయలకు రఘునందన్రావు మైండ్ బ్లాంక్ అయిందని, అందుకే ఆయన చరిత్ర వక్రీకరించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రఘునందన్రావుది రాహుల్గాంధీని విమర్శించే స్థాయినా..? అని ప్రశ్నించారు. దేశాన్ని గాంధీ కుటుంబం పరిపాలించిన రోజున.. ఇవాళ వారిని విమర్శిస్తున్న బీజేపీ నాయకులు పుట్టనే లేదని అన్నారు. తమ నేతగా చెప్పుకోడానికి బీజేపీకి ఎవరూ దిక్కు లేక.. కాంగ్రెస్ నాయకుడు సర్దార్ పటేల్ పేరును వాడుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ సముద్రంలోని ఒక బిందెడు నీళ్లను తీసుకుని జీవిస్తున్నారని ఎద్దేవా చేశారు.
గాంధీ కుటుంబం చరిత్రను కొత్త తరం తెలుసుకోవాలి
నెహ్రూ ప్రధాని అయ్యాక.. 543 సంస్థానాలను భారత్లో విలీనం చేశారని జగ్గారెడ్డి తెలిపారు. కశ్మీర్.. భారత్ నుంచి విడిపోకుండా కాపాడిన ఘనత నెహ్రూదేనని చెప్పారు. కశ్మీర్ ప్రజల కోసం ప్రత్యేక చట్టాన్ని తెచ్చి.. ఆ సమస్యను సున్నితంగా పరిష్కరించారని వెల్లడించారు. రాహుల్ తాత ముత్తాతల చరిత్రను కొత్త తరం తెలుసుకోవాలని, అప్పుడు వారికి బీజేపీ నిజ స్వరూపం తెలుస్తుందన్నారు. చరిత్ర తెలుసుకోకుండా బీజేపీ నేతలు హోదాలను మరచి గాంధీ కుటుంబంపై చిల్లరగా మాట్లాడుతున్నారని విమర్శించారు. వారు పద్థతి మార్చుకోకుంటే తానూ చిల్లరగా మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు. మీడియాలో ఫోకస్ కోసమే రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పాలోడిని పాలోడనే అంటారని.. రేవంత్ మాటల్లో తప్పేముందని ప్రశ్నించారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షీ నటరాజన్ డాక్టర్ డ్యూటీ చేస్తోందని, అందరి సమస్యలూ పరిష్కారమవుతాయని తెలిపారు. కొత్త కమిటీల కూర్పు అద్భుతంగా ఉందని, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. అయితే పీఏసీ కమిటీలో మంత్రి వెంకట్రెడ్డి పేరు చేర్చితే బాగుండేదని అన్నారు. ఆయన పేరును చేర్చాలని అధిష్ఠానాన్ని కోరారు. టీపీసీసీ అడ్వయిజరీ కమిటీలో తనను చేర్చడం సంతోషమేనన్నారు. జానారెడ్డి వంటి సీనియర్ ఉన్న కమిటీలో తనకు అవకాశం ఇచ్చారంటే ప్రమోషన్ ఇచ్చినట్లేనని తెలిపారు. తనకు గాంధీభవన్ అటెండర్ పోస్టు ఇచ్చినా సంతోషంగానే పనిచేస్తానని జగ్గారెడ్డి అన్నారు.
ఇవి కూడా చదవండి
ఆర్సీబీ ఓడిపోతే భర్తకు విడాకులు ఇస్తుందట.. ఇదేం పిచ్చి..
ఐఎన్ఎస్ విక్రాంత్ పైనుంచి పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ వార్నింగ్