BRS: ఆదిలాబాద్ డీసీసీబీ డైరెక్టర్ కిడ్నాప్!
ABN , Publish Date - Jun 16 , 2025 | 05:13 AM
బీఆర్ఎస్ నేత, ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్(డీసీసీబీ) చిక్యాల హరీశ్ కుమార్ను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు.

అర్ధరాత్రి ఆయన కారులోనే అపహరణ
రూ.3 కోట్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు
తూప్రాన్లోని టోల్ ప్లాజా వద్ద తప్పించుకున్న హరీశ్ కుమార్
నిర్మల్ జిల్లాలో తీవ్ర కలకలం
మామడ, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ నేత, ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్(డీసీసీబీ) చిక్యాల హరీశ్ కుమార్ను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆదివారం తెల్లవారు జామున రెండు గంటల సమయంలో నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్లో ఈ ఘటన జరిగింది. హరీశ్ కుమార్ నిర్మల్ జిల్లా మామడ మాజీ ఎంపీపీ కూడా. హరీశ్ కుమార్ వద్ద గతంలో కారు డ్రైవర్గా పనిచేసిన వ్యక్తే ఈ కిడ్నా్పకు సూత్రధారిగా అనుమానిస్తున్నారు. హైదరాబాద్ నుంచి పిలుపించుకున్న మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి ఆ వ్యక్తి.. హరీశ్కుమార్ నివాసానికి వెళ్లి నిద్రపోతున్న ఆయననులేపి, బెదిరించి బలవంతంగా అతని కారులోనే ఎక్కించుకుని హైదరాబాద్ వైపు తీసుకెళ్లారు.
ఈ సమయంలో వారు రూ.3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో హరీశ్ కుమార్ తన సన్నిహితులకు ఫోన్ చేసి కొంత నగదు కావాలని కోరినట్లు సమాచారం. అయితే, హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద ఆగిన సమయంలో హరీశ్ కుమార్ చాకచక్యంగా కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తూప్రాన్ పోలీ్సస్టేషన్ వెళ్లి జరిగిన ఘటన గురించి పోలీసులకు తెలిపారు. కాగా, ఈ ఘటన నిర్మల్ జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. కిడ్నాప్ జరిగిన మాట నిజమేనని తాను ప్రస్తుతం క్షేమంగా ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని హరీశ్ కుమార్ తమ సన్నిహితులకు ఫోన్ చేసి చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని మామడ ఎస్సై అశోక్ తెలిపారు.