Microsoft AI: ఏఐతో ఏడాదిలో మైక్రోసాఫ్ట్కు రూ.4,285 కోట్లు ఆదా.. వారికి మాత్రం షాకింగ్ న్యూస్..
ABN , Publish Date - Jul 10 , 2025 | 03:57 PM
ఒకప్పుడు మనుషులు నిర్వహించిన పనులను ఇప్పుడు ఏఐ వేగంగా, కచ్చితత్వంతో చేస్తుంది. దీంతో అనేక సంస్థలు పలు రకాల కార్యకలాపాల్లో ఏఐని ఉపయోగిస్తున్నాయి. ఇదే సమయంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా ఈ మార్పుల్లో భాగంగా AIని (Microsoft AI) వినియోగిస్తోంది. దీని వల్ల ఇటీవల వచ్చిన మార్పులను ఓసారి చూద్దాం.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వచ్చిన తర్వాత అనేక సంస్థలు ఉద్యోగాల విషయంలో కీలక మార్పులు చేశాయి. కాల్ సెంటర్ సహా పలు ఉద్యోగాలను ఏఐచే భర్తీ చేశాయి. ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ కూడా ఇదే విధానాన్ని పాటించింది. కృత్రిమ మేధస్సు (Microsoft AI)ని తన వ్యాపారంలో అనేక పనుల కోసం ఉపయోగిస్తూ, ఉత్పాదకతను పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో దాదాపు 9 వేల మంది ఉద్యోగాలను తొలగించారు.
ఏఐతో భారీ ఆదా
ఈ క్రమంలో గత ఏడాది కాల్ సెంటర్ కార్యకలాపాల్లో ఏఐ ద్వారా సంస్థ దాదాపు రూ.4,285 కోట్లు (సుమారు $500 మిలియన్లు) ఆదా చేసినట్లు మైక్రోసాఫ్ట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ జడ్సన్ ఆల్తాఫ్ తెలిపారు. ఇదే సమయంలో కస్టమర్ సంతృప్తిని పెంచడంతో పాటు అంతర్గత ఉత్పాదకతను కూడా మెరుగుపరిచినట్లు వెల్లడించారు. ఏఐ టూల్స్ పునరావృతమయ్యే పనులను ఈజీగా చేస్తూ కస్టమర్ల సేవలను మెరుగుపరుస్తున్నాయని అన్నారు.
సంభాషణతో మొదలుకుని..
మైక్రోసాఫ్ట్ తన కోపైలట్ ఏఐ అసిస్టెంట్ను సేల్స్ టీమ్ల కోసం ఉపయోగిస్తోంది. ఈ టూల్ సేల్స్ బృందాలకు మరిన్ని లీడ్స్ సృష్టించడం, ఒప్పందాలను వేగంగా ముగించడం, ఆదాయాన్ని 9 శాతం వరకు పెంచడంలో సహాయపడుతోంది. అంతేకాదు కొత్త ఉత్పత్తుల కోసం 35 శాతం కోడ్ను కూడా ఏఐ రాస్తోంది. ఇది ఉత్పత్తుల లాంచ్ సమయాన్ని కూడా వేగవంతం చేస్తోంది. మైక్రోసాఫ్ట్ గిట్హబ్ కోపైలట్, ఒక ఏఐ ఆధారిత కోడింగ్ టూల్. ఇది ప్రపంచవ్యాప్తంగా 1.5 కోట్ల మంది యూజర్లను చేరింది. చిన్న కస్టమర్లతో ఏఐ ద్వారా జరిగే సంభాషణతో కూడా రూ.100 కోట్లకు పైగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.
ఉద్యోగులపై ఏఐ ప్రభావం
ఏఐ ద్వారా సాధించిన ఈ విజయాలు ఓవైపు ఉంటే, మరోవైపు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు (Microsoft AI) ఇది ఆందోళన కలిగిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల సంస్థ దాదాపు 9,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది దీని గ్లోబల్ స్టాఫ్లో దాదాపు 4 శాతం. 2023లో 10,000 ఉద్యోగాలను తగ్గించిన తర్వాత ఇది మూడో పెద్ద తొలగింపు. ఈ కోతలు సంస్థాగత మార్పులలో భాగమని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి తెలిపారు. టీమ్లను సులభతరం చేయడం, కొత్త సాంకేతికతలతో ఉత్పాదకతను పెంచడానికి తీసుకున్న నిర్ణయాలని వెల్లడించారు.
ఉద్యోగుల ఆందోళన
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఈ ఏడాది ప్రారంభంలో కంపెనీ కోడ్లో 20–30 శాతం ఏఐ ద్వారా రాయబడుతోందన్నారు. ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఏఐ వాడకాన్ని సూచిస్తుంది. సేల్స్ఫోర్స్, మెటా, ఆల్ఫాబెట్ వంటి ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఖర్చులను తగ్గించడానికి, ఉత్పాదకతను పెంచడానికి ఏఐ, ఆటోమేషన్ను ఉపయోగిస్తున్నాయి. ఈ కంపెనీలు ఉద్యోగ నియామక అవసరాలను తిరిగి పరిశీలిస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి. దీంతో ఏఐ ద్వారా జాబ్స్ కోల్పోతున్న అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
యూట్యూబ్లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి