Neeraj Chopra-PM Modi: నీరజ్ చోప్రాపై మోదీ ప్రశంసలు.. ప్రధాని ఏమన్నారంటే..
ABN , Publish Date - May 17 , 2025 | 11:51 AM
Doha Diamond League 2025: బల్లెం వీరుడు నీరజ్ చోప్రాపై ప్రశంసల జల్లులు కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. అదరగొట్టావ్ అంటూ అతడ్ని మెచ్చుకున్నారు. మోదీ ఇంకా ఏమన్నారంటే..

భారత టాప్ అథ్లెట్, జావెలిన్ త్రో హీరో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. కెరీర్లో మొదటిసారిగా 90 మీటర్ల మార్క్ను అందుకున్నాడు. దోహా డైమండ్ లీగ్-2025 జావెలిన్ త్రో కాంపిటీషన్లో తన బల్లేన్ని 90.23 మీటర్ల దూరం విసిరాడు. తద్వారా తన వ్యక్తిగత రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. దీంతో అన్ని వైపుల నుంచి అతడిపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. నువ్వు సూపర్ నీరజ్.. అంటూ ఈ ఒలింపిక్ హీరోను అంతా మెచ్చుకుంటున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ బల్లెం వీరుడ్ని అభినందించారు. అద్భుతమైన ఫీట్.. అదరగొట్టావ్ అంటూ అతడ్ని ప్రశంసల్లో ముంచెత్తారు ప్రధాని. ఆయన ఇంకా ఏమన్నారో ఇప్పుడు చూద్దాం..
అంత చేసినా..
దోహా డైమండ్ లీగ్-2025లో 90 మీటర్ల మార్క్ను అధిగమించినందుకు, వ్యక్తిగత అత్యుత్తమ త్రోను సాధించినందుకు నీరజ్ చోప్రాకు అభినందనలు తెలిపారు ప్రధాని మోదీ. ఇది అకుంఠిత దీక్ష, క్రమశిక్షణ, అంకితభావానికి దక్కిన ఫలితం అని తెలిపారు. నీరజ్ను చూసి దేశం గర్విస్తోందని.. అతడి ప్రదర్శన అద్భుతమని ట్విట్టర్లో పెట్టిన పోస్ట్లో ప్రశంసల జల్లులు కురిపించారు మోదీ. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రధానితో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు, క్రీడాకారులు, అభిమానులు ఈ బల్లెం వీరుడ్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. కాగా, నీరజ్ గతంలో ఎంతో అద్భుతంగా బల్లేన్ని విసిరినా.. 90 మీటర్ల మార్క్ను మాత్రం టచ్ చేయలేకపోయాడు. అతడి గత అత్యుత్తమ ప్రదర్శన 88.94 మీటర్లు. అయితే తాజాగా డైమండ్ లీగ్లో మాత్రం 90.23 మీటర్లు త్రో చేసి ఔరా అనిపించాడు. అయినా విజేతగా నిలవలేకపోయాడు. జర్మనీకి చెందిన జులియన్ వెబర్ 91.06 మీటర్ల ప్రదర్శనతో చాంపియన్గా నిలిచాడు. విజేతగా నిలవకపోయినా వ్యక్తిగత అత్యుత్తమ త్రోను విసరడం, రెండో స్థానంలో నిలవడంతో నీరజ్పై అభినందనల వెల్లువ కురుస్తోంది.
ఇవీ చదవండి:
కోహ్లీ టెన్త్ మార్క్ షీట్ వైరల్
ఆర్సీబీ మోసం చేసింది: పాటిదార్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి