AUS vs SA: 20 ఏళ్ల రికార్డు.. కప్పు కష్టమే.. అంతా ఆ ఒక్కడి వల్లే!
ABN , Publish Date - Jun 13 , 2025 | 09:48 AM
ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ రసకందాయంలో పడింది. ఇరు జట్లు ఢీ అంటే ఢీ అంటూ పోటీపడుతుండటంతో మ్యాచ్ సెషన్ సెషన్కూ మారిపోతోంది.

ఊహించిన దాని కంటే మరింత ఆసక్తికరంగా సాగుతోంది వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్. ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్లు నువ్వానేనా అంటూ పోటీపడుతుండటంతో సెషన్ సెషన్కు ఆధిపత్యం చేతులు మారుతోంది. ఆట రెండో రోజు పలు అనూహ్య ఘటనలు జరిగాయి. ఆసీస్ స్కోరుకు దగ్గరగా వస్తుందనుకున్న ప్రొటీస్ కాస్తా 138 పరుగులకే కుప్పకూలింది. కంగారూ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 6 వికెట్లతో బవుమా సేన నడ్డి విరిచాడు. డేవిడ్ బెడింగ్హామ్ (45) తప్పితే మిగతా సౌతాఫ్రికా బ్యాటర్లంతా ఫెయిల్ అయ్యారు. అయితే డే-2 హీరో మాత్రం అలెక్స్ కేరీ అనే చెప్పాలి. అతడు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.
ఫైటింగ్ ఇన్నింగ్స్..
ప్రొటీస్ ఆలౌట్ అయ్యాక రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. 73 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో ఒక ఎండ్లో స్తంభంలా పాతుకుపోయాడు అలెక్స్ కేరీ. 50 బంతుల్లో 5 బౌండరీల సాయంతో 43 విలువైన పరుగులు చేశాడతను. డబుల్ డిజిట్కు చేరడమే గొప్పగా మారిన పరిస్థితుల్లో అతడు ఒక ఎండ్ను కాపాడుతూ స్ట్రైక్ రొటేషన్ కొనసాగిస్తూ 43 పరుగులు చేశాడు. మిచెల్ స్టార్క్ (16)తో కలసి ఎనిమిదో వికెట్కు 60 పరుగులు జోడించాడు.
రికార్డులు ఆసీస్ వైపే..
అలెక్స్ కేరీ గనుక ఫైటింగ్ నాక్ ఆడకపోయి ఉంటే ఆసీస్ జట్టు 218 పరుగుల ఆధిక్యంలో ఉండేది కాదు. లీడ్ను డబుల్ సెంచరీ దాటించాక పెవిలియన్ చేరాడు కేరీ. రెండో రోజు ఆట ముగిసేసరికి ఆసీస్ 8 వికెట్లకు 144 పరుగులతో ఉంది. ఆ టీమ్ మరో 15 నుంచి 20 పరుగులు చేసినా టార్గెట్ 240 పరుగుల వరకు చేరుకుంటుంది. పేసర్ల పెత్తనం నడుస్తున్న లార్డ్స్ పిచ్ మీద 150 స్కోర్ చేయడమే కష్టం. అలాంటిది అంత స్కోరు చేజ్ చేయడం అసాధ్యంగా కనిపిస్తోంది. రికార్డులు కూడా అదే చెబుతున్నాయి. 2005 నుంచి గత 20 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే లార్డ్స్ మైదానంలో 200 పైచిలుకు లక్ష్యాన్ని చేజ్ చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఆసీస్ గెలుపు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ టీమ్ ఆధిపత్యంలో ఉండటానికి అలెక్స్ కేరీ ఇన్నింగ్సే కారణమని.. కంగారూలు విజయం సాధిస్తే అతడికి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు.
ఇవీ చదవండి:
వింబుల్డన్ ప్రైజ్మనీ రూ 625 కోట్లు
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి