Sachin Tendulkar: మనసులు గెలుచుకున్న సచిన్.. ఏం చేశాడో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!
ABN , Publish Date - Jun 17 , 2025 | 04:54 PM
భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరోమారు తన మంచి మనసును చాటుకున్నాడు. ఒక్క పనితో వివాదాలకు చెక్ పెట్టేశాడు. ఇంతకీ మాస్టర్ బ్లాస్టర్ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్కు సమయం దగ్గర పడుతోంది. మరో మూడ్రోజుల్లో ఈ మెగా సిరీస్ మొదలవనుంది. ఇరు జట్లు ప్రాక్టీస్తో పాటు గెలుపు కోసం వ్యూహాలు పన్నడంలో బిజీ అయిపోయాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజాలు లేనందున ఆతిథ్య ఇంగ్లండ్ను భారత కుర్రాళ్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఒకవైపు సిరీస్లో ఎవరెలా ఆడతారు? ఎవరు నెగ్గుతారు? లాంటి చర్చలు జరుగుతున్న సమయంలోనే మరోవైపు ట్రోఫీ పేరు మార్పు అంశం వివాదాస్పదంగా మారింది. అయితే ఒక్క పనితో ఈ కాంట్రవర్సీకి ఫుల్స్టాప్ పెట్టాడు బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్. అసలేం జరిగిందంటే..
విమర్శలు రావడంతో..
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే టెస్ట్ సిరీస్కు పటౌడీ ట్రోఫీగా 2007లో నామకరణం చేశారు. టీమిండియా లెజెండ్స్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, ఆయన తండ్రి ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ గౌరవంగా పటౌడీ ట్రోఫీ అనే పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డును ఒప్పించింది బీసీసీఐ. అయితే ఇన్నాళ్లూ కొనసాగిన ఈ పేరును ఇప్పుడు మార్చాలని ఈసీబీ పట్టుబట్టింది. లెజెండరీ పేసర్ జేమ్స్ అండర్సర్, భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేర్ల మీదుగా ఈ సిరీస్కు అండర్సన్-టెండూల్కర్ అనే కొత్త పేరును సూచించింది ఇంగ్లండ్ బోర్డు. దీనికి బీసీసీఐ కూడా ఓకే చెప్పడంతో ఇదే పేరుతో సిరీస్ నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయి. ఈ తరుణంలో అభిమానుల నుంచి విమర్శలు మొదలయ్యాయి.
సచిన్ ఎంట్రీతో..
పటౌడీ పేరును తొలగించడం సరికాదని, ఇది భారత క్రికెట్కు ఆ కుటుంబం చేసిన సేవల్ని అవమానించడమేనంటూ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత వచ్చింది. ట్రోఫీ పేరు మార్పు అంశం కాస్తా వివాదానికి దారితీయడంతో సచిన్ రంగంలోకి దిగాడు. భారత్-ఇంగ్లండ్ సిరీస్కు పటౌడీ కనెక్షన్ కొనసాగాలని బీసీసీఐ-ఈసీబీని మాస్టర్ బ్లాస్టర్ కోరాడని తెలిసింది. దీంతో ట్రోఫీ పేరు అండర్సన్-టెండూల్కర్గా కొనసాగుతుందని.. అయితే సిరీస్ గెలిచిన జట్టు సారథికి పటౌడీ పేరు మీద స్పెషల్ మెడల్ ఇవ్వాలని ఇరు దేశాల బోర్డులు నిర్ణయించాయని సమాచారం. దీంతో ట్రోఫీతో పటౌడీ పేరుకు లింక్ తెగిపోకుండా చూశాడని.. సచిన్ గ్రేట్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మంచి పనితో మనసులు దోచుకున్నాడంటూ ఆయన్ను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి