Share News

Prithvi Shaw: పృథ్వీ షా సంచలన బ్యాటింగ్.. ఇది కదా కావాల్సింది!

ABN , Publish Date - Jun 09 , 2025 | 11:59 AM

టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా మళ్లీ ఫామ్ అందుకున్నాడు. భీకర షాట్లతో ప్రత్యర్థి బౌలర్లపై అతడు విరుచుకుపడ్డాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో తాను ఉన్నానని సెలెక్టర్లకు గుర్తుచేశాడు.

Prithvi Shaw: పృథ్వీ షా సంచలన బ్యాటింగ్.. ఇది కదా కావాల్సింది!
Prithvi Shaw

క్రికెట్‌లో రాణించాలంటే ప్రతిభ మాత్రమే ఉంటే సరిపోదు. దానికి తోడు ఆట మీద అంకితభావం, రాణించాలనే కసి, దేశానికి ఆడాలనే పట్టుదల, క్రమశిక్షణ, కాసింత అదృష్టం.. ఇలా అన్నీ తోడవ్వాలి. కేవలం టాలెంట్‌నే నమ్ముకుంటే సరిపోదని ఎక్స్‌పర్ట్స్ అంటుంటారు. ఎంత బాగా ఆడే ఆటగాళ్లయినా క్రమశిక్షణ, పట్టుదల లేకపోతే ముందుకు సాగడం కష్టమేనని చెబుతుంటారు. టీమిండియా యువ బ్యాటర్ పృథ్వీ షా విషయంలో ఇదే జరిగింది. రాకెట్ వేగంతో భారత జట్టులోకి దూసుకొచ్చిన ఈ యువ తరంగం.. అంతే త్వరగా టీమ్‌కు దూరమయ్యాడు. అధిక బరువు, క్రమశిక్షణ లోపించడం, లేనిపోని వివాదాలు, ఫామ్ కోల్పోవడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలూ అతడ్ని పట్టించుకోవట్లేదు. ఈ తరుణంలో తాను ఉన్నానంటూ ఒక విధ్వంసక ఇన్నింగ్స్‌తో స్టేట్‌మెంట్ ఇచ్చాడు షా.


వరుసగా 6 ఫోర్లు..

ముంబై టీ20 లీగ్-2025లో రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తున్నాడు పృథ్వీ షా. నార్త్ ముంబై పాంథర్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్న యంగ్ బ్యాటర్.. హాఫ్ సెంచరీతో మెరిశాడు. 34 బంతుల్లోనే 75 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు షా. ఇందులో 12 బౌండరీలతో పాటు 3 భారీ సిక్సులు ఉన్నాయి. ఫోర్లు, సిక్సుల రూపంలో 66 పరుగులు పిండుకున్నాడు. దీంతో నార్త్ ముంబై 6 వికెట్లకు 207 పరుగుల భారీ లక్ష్యాన్ని సెట్ చేసింది. పేసర్లు, స్పిన్నర్లు అనే తేడాల్లేకుండా బౌలర్లందర్నీ దంచికొట్టాడు షా. ఫీల్డర్ల మధ్య గ్యాప్స్‌ను టార్గెట్ చేసుకొని ఫోర్ల మీద ఫోర్లు బాదాడు. ఒక ఓవర్‌లోనైతే ఏకంగా 26 పరుగులు రాబట్టాడు. ఓవర్‌లోని అన్ని బంతుల్ని బౌండరీ లైన్ దాటించాడు షా.


ఈ జోరు కొనసాగనీ..

పృథ్వీ షా బ్యాటింగ్ చూసిన నెటిజన్స్.. ఈ పనేదో ముందే చేసి ఉంటే ఐపీఎల్‌లో ఆడే అవకాశం దక్కేది కదా అని అంటున్నారు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు.. ఇలాగే నిలకడగా పరుగుల వర్షం కురిపించాలని సూచిస్తున్నారు. బ్యాటింగ్‌‌ను మెరుగుపర్చుకోవడంతో పాటు క్రమశిక్షణను అలవర్చుకుంటే షా మళ్లీ టీమిండియాకు ఆడగలడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే సాగిపో.. అంటూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. కాగా, క్రమశిక్షణ లోపించడం, ఫామ్ కోల్పోవడం లాంటి సమస్యలతో భారత జట్టుకు దూరమైన పృథ్వీ షా.. ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ ఆడలేదు. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఈ బ్యాటర్‌ను ఈసారి వేలంలో ఎవరూ తీసుకోలేదు. దీంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు.


ఇవీ చదవండి:

కోహ్లీ-రొనాల్డో సేమ్ టు సేమ్

బామ్మ కోసం సిక్స్ బాదాడు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 09 , 2025 | 12:38 PM