Preity Zinta: కోర్టుకెక్కిన ప్రీతి జింటా.. పంజాబ్ కింగ్స్ పరిస్థితేంటి?
ABN , Publish Date - May 23 , 2025 | 03:38 PM
ఐపీఎల్ మ్యాచుల్లో తెగ హల్చల్ చేస్తూ ఉంటుంది పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా. గెలుపోటములతో సంబంధం లేకుండా తన జట్టుకు ఆమె మద్దతుగా నిలుస్తుంది. పంజాబ్ ఆటగాళ్లను వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ఉంటుంది. అందుకే ఆమెను ఇతర జట్ల అభిమానులు కూడా ఇష్టపడతారు. అలాంటి ప్రీతి జింటా ఇప్పుడు కోర్టుకెక్కింది. అదీ ఐపీఎల్ విషయంలోనే కావడం గమనార్హం.

పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా ఎప్పుడూ హుషారుగా ఉంటుంది. తన జట్టు మ్యాచులు ఉంటే చాలు.. మైదానంలో ఆమె వాలిపోతుంది. విజయాలు, పరాభవాలకు అతీతంగా జట్టు ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తుంది. అందుకే ఇతర టీమ్ ఫ్యాన్స్ కూడా ఆమెను ఇష్టపడతారు. అలాంటి ప్రీతి జింటా ఇప్పుడు ఐపీఎల్ విషయంలోనే కోర్టుకెక్కింది. పంజాబ్ ఫ్రాంచైజీలో వివాదం చెలరేగింది. టీమ్ కో-ఓనర్స్ నెస్ వాడియా, మోహిత్ బుర్మాన్ మీద చండీగఢ్ కోర్టులో కేసు వేసింది ప్రీతి. మరి.. ఆమె ఎందుకిలా చేసింది, పంజాబ్ కింగ్స్ జట్టులో అసలేం జరుగుతోంది.. అనేది ఇప్పుడు చూద్దాం..
సమావేశం చెల్లదు!
నిబంధనలకు విరుద్ధంగా సమావేశం నిర్వహిచారంటూ మోహిత్ బుర్మాన్, నెస్ వాడియాపై పిటిషన్ వేసింది ప్రీతి జింటా. కంపెనీ చట్టం 2013 ప్రకారం ఎలాంటి రూల్స్ పాటించకుండానే ఈ మీటింగ్ పెట్టారని తన పిటిషన్లో ఆమె పేర్కొంది. ఈ సమావేశానికి సంబంధించి అభ్యంతరాలను ఏప్రిల్ 10వ తేదీనే ఈమెయిల్ రూపంలో తెలియజేశానని తెలిపింది. అయితే తన అభ్యంతరాలను వాళ్లు పట్టించుకోలేదని ఆమె వాపోయింది. నెస్ వాడియా సపోర్ట్తో మోహిత్ బుర్మాన్ ఈ భేటీ నిర్వహించారని పిటిషన్లో ఆరోపించింది ప్రీతి జింటా. చట్టబద్ధంగా ఈ మీటింగ్ చెల్లదని ప్రకటించాలని కోర్టును ఆమె కోరింది. ఈ భేటీలో మునీశ్ ఖన్నాను డైరెక్టర్గా నియమించడాన్ని ప్రీతి వ్యతిరేకించింది. ఈ నియామకాన్ని నిలిపివేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది.
నో మీటింగ్స్!
ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలు చేయకుండా చూడాలని కోర్టును అభ్యర్థించింది ప్రీతి జింటా. ఈ కేసు కొలిక్కి వచ్చేంత వరకు తాను, కరుణ్పాల్ లేకుండా బోర్డు మీటింగ్స్ నిర్వహించకుండా చూడాలని కోరింది. కాగా, బోర్డు వివాదాలతో కోర్టుకెక్కిన ప్రీతి జింటా.. ఒకవైపు వివాదం కొనసాగుతున్నా మరోవైపు పంజాబ్ కింగ్స్ జట్టుకు మద్దతుగా నిలవడం విశేషం. టీమ్ మ్యాచులకు హాజరై స్టేడియంలో హల్చల్ చేసిందామె. అయ్యర్ సేనకు సపోర్ట్గా నిలిచింది. కాగా, 11 ఏళ్ల తర్వాత ప్లేఆఫ్స్కు చేరుకుంది పంజాబ్ కింగ్స్. ఇప్పుడు టాప్-2లో నిలవడమే లక్ష్యంగా దూసుకెళ్తోంది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి