IND vs ENG: గిల్ సేనను భయపెడుతున్న పేస్ పిచ్చోడు.. ఎంట్రీ ఇస్తే దబిడిదిబిడే!
ABN , Publish Date - Jun 24 , 2025 | 07:51 PM
టీమిండియాను భయపెడుతున్నాడో పేస్ పిచ్చోడు. కేఎల్ రాహుల్, శుబ్మన్ గిల్తో కూడిన భారత బ్యాటింగ్ లైనప్ను ముప్పుతిప్పలు పెట్టేందుకు అతడు రెడీ అవుతున్నాడు.

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుకు ఒక బ్యాడ్ న్యూస్. మన టీమ్ బ్యాటర్లను కంట్రోల్ చేసేందుకు ఓ పేస్ పిచ్చోడ్ని బరిలోకి దింపుతోంది ఇంగ్లీష్ టీమ్. ఆ పేస్ రాక్షసుడు మరెవరో కాదు.. జోఫ్రా ఆర్చర్. అవును, ఆర్చర్ వచ్చేస్తున్నాడు. అదేంటి ఫిట్నెస్ సమస్యలతో తడబడే ఈ బౌలర్.. టెస్టులు ఆడటం ఏంటనేగా మీ సందేహం. అయితే గాయాల నుంచి కోలుకున్న ఆర్చర్.. కొన్నాళ్లుగా ఫిట్నెస్ను మెరుగుపర్చుకోవడం మీద పని చేశాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఇంగ్లండ్ దేశవాళీ టోర్నమెంట్ అయిన కౌంటీ చాంపియన్షిప్ డివిజన్ మ్యాచుల్లో పాల్గొన్నాడు.
కమ్బ్యాక్కు రెడీ..
టెస్టులకు 2021 ఫిబ్రవరి నుంచి దూరంగా ఉంటున్నాడు జోఫ్రా ఆర్చర్. కేవలం వన్డేలు, టీ20ల్లోనే ఆడుతూ వస్తున్నాడీ పేసర్. గాయాల బెడద కారణంగా లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లోనూ పూర్తి మేర అందుబాటులో ఉండటం లేదు. అలాంటోడు ఇప్పుడు ఫుల్గా రికవర్ అయ్యాడు. అందుకే 1,501 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల కౌంటీ బరిలోకి దిగి రెడ్ బాల్తో బౌలింగ్ చేశాడు. అతడి ఫిట్నెస్ మెరుగుపడటం, రెడ్ బాల్తో ప్రభావవంతంగా బౌలింగ్ చేస్తుండటంతో భారత్-ఇంగ్లండ్ సిరీస్లో బరిలోకి దించాలని సెలెక్టర్లు భావిస్తున్నారట. అదే జరిగితే గిల్ సేనకు ఆర్చర్కు మధ్య భీకర యుద్ధం తప్పదని విశ్లేషకులు అంటున్నారు. ఇంగ్లీష్ కండీషన్స్లో అతడి యార్కర్లు, బౌన్సర్లు, స్వింగర్లను తట్టుకొని మన బ్యాటర్లు నిలబడటం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. ఆర్చర్ ఏ టెస్ట్లో రీఎంట్రీ ఇస్తాడో చూడాలి.
ఇవీ చదవండి:
లగ్జరీ అపార్ట్మెంట్స్ కొన్న దూబె
కౌంటీల్లో దుమ్మురేపిన తెలుగోడు
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి