Share News

WTC Final 2025: నేటి నుంచే డబ్ల్యూటీసీ ఫైనల్‌.. ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే..?

ABN , Publish Date - Jun 11 , 2025 | 10:15 AM

నేటి నుంచి ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టెస్ట్ గద కోసం ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. దీంతో ఈసారి ఎవరు టైటిల్ గెలుస్తారా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.

WTC Final 2025: నేటి నుంచే డబ్ల్యూటీసీ ఫైనల్‌.. ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే..?
WTC Final-2025

క్రికెట్‌లో సంప్రదాయ ఫార్మాట్‌ అయిన టెస్టుల్లో అత్యున్నత పోరైన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అంతా రెడీ అయింది. ఇన్నాళ్లూ ఐపీఎల్‌తో పాటు ఇతర టీ20 లీగ్‌ల మాయలో మునిగితేలిన క్రికెట్ లవర్స్ ఇప్పుడు సుదీర్ఘ ఫార్మాట్ పంచే వినోదాన్ని ఆస్వాదించేందుకు సిద్ధమవయ్యారు. గత రెండుసార్లు ఫైనల్ ఆడిన భారత జట్టు ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు అర్హత సాధించలేదు. ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య టైటిల్ ఫైట్ జరగనుంది. మరో కప్పు కొట్టాలని కంగారూలు, తొలి ఐసీసీ ట్రోఫీ కోసం దశాబ్దాల ఎదురుచూపులకు తెరదించాలని ప్రొటీస్ పట్టుదలతో ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌ ఒకవేళ డ్రా అయితే పరిస్థితి ఏంటి? ఎవర్ని విజేతగా ప్రకటిస్తారు? అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.


వర్షం పడితే..

టెస్టుల్లో డ్రాలు సర్వసాధారణం అనే చెప్పాలి. అందునా రెండు పెద్ద జట్లు తలపడుతున్నప్పుడు, అదీ తటస్థ వేదిక మీద అయితే డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువ. దీంతో డ్రా అయితే టెస్ట్ గద దక్కేదెవరికి? అని అభిమానులు ఆలోచనల్లో పడ్డారు. ఒకవేళ ఈ మ్యాచ్ గనుక డ్రా అయితే ఇరు జట్లు ట్రోఫీని పంచుకుంటాయి. సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. అయితే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఫైనల్ మ్యాచ్ కూడా డ్రా అవ్వలేదు. ఒకవేళ వాన లేదా ఏ ఇతర కారణం వల్ల గానీ పూర్తి మ్యాచ్ సాధ్యం కాకపోతే ఆటను రిజర్వ్ డే నాడు ఆడిస్తారు.

wtc-final-2025.jpg


గెలవాల్సిందే..

ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఇంగ్లండ్‌లో వేసవి కాలం మొదలైంది. వరుణుడు మ్యాచ్‌కు ఆటంకం కలిగించే అవకాశాలు లేవు. కాబట్టి మ్యాచ్‌లో ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, గత డబ్ల్యూటీసీ ఫైనల్-2023లో భారత్‌ను ఓడించి చాంపియన్‌గా అవతరించింది ఆసీస్. ఈసారి కూడా ఫైనల్స్‌కు వచ్చిన కంగారూ జట్టు.. మరోసారి ట్రోఫీని ఎగరేసుకుపోవాలని చూస్తోంది. ఇటీవల కాలంలో టీ20 వరల్డ్ కప్‌-2024తో పాటు చాంపియన్స్ ట్రోఫీ-2025లోనూ ఖాళీ చేతులతో ఇంటిదారి పట్టినందున.. టెస్ట్ గదనైనా దక్కించుకోవాలని కమిన్స్ సేన భావిస్తోంది. అటు తెంబా బవుమా నేతృత్వంలోని సౌతాఫ్రికా జట్టు ఎలాగైనా గెలిచి ఐసీసీ కప్పు కల నెరవేర్చుకోవాలని అనుకుంటోంది.


ఇవీ చదవండి:

ఫైనల్‌కు అయ్యర్ టీమ్

టెస్టు గద దక్కేదెవరికో

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 11 , 2025 | 10:24 AM