Share News

Hardik-Iyer: హార్దిక్-అయ్యర్ జీతాలు కట్.. బీసీసీఐ గట్టి షాక్!

ABN , Publish Date - Jun 02 , 2025 | 11:36 AM

గెలిచిన సంతోషంలో ఉన్న శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఓడిన బాధలో ఉన్న హార్దిక్ పాండ్యాకు గట్టి షాక్ తగిలింది. ఇద్దరి జీతాలు కట్ చేసింది బీసీసీఐ. ఎందుకిలా చేసిందో ఇప్పుడు చూద్దాం..

Hardik-Iyer: హార్దిక్-అయ్యర్ జీతాలు కట్.. బీసీసీఐ గట్టి షాక్!
IPL 2025

స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అదరగొట్టాడు. తాను సారథ్యం వహిస్తున్న పంజాబ్ కింగ్స్‌‌ను ఐపీఎల్-2025 ఫైనల్‌కు చేర్చాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో పంజాబ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు అయ్యర్. 41 బంతుల్లో 87 పరుగుల కెప్టెన్సీ నాక్‌తో మ్యాచ్ ఫలితాన్ని శాసించాడు. అటు ముంబైని ఫైనల్ చేర్చలేకపోయాడు సారథి హార్దిక్ పాండ్యా. ఎంతగా పోరాడినా అతడి జట్టుకు విజయం దక్కలేదు. ఈ తరుణంలో సంతోషంగా ఉన్న అయ్యర్‌తో పాటు ఓటమి బాధలో ఉన్న పాండ్యాకు గట్టి షాక్ తగిలింది. వారిద్దరి జీతాలను కట్ చేసింది భారత క్రికెట్ బోర్డు. మరి.. బీసీసీఐ ఎందుకిలా చేసిందో ఇప్పుడు చూద్దాం..


జరిమానా ఎంతంటే..

శ్రేయస్ అయ్యర్-హార్దిక్ పాండ్యాకు జరిమానా విధించింది బీసీసీఐ. ముంబై ఇన్నింగ్స్ సమయంలో పంజాబ్ కింగ్స్ నిర్ణీత టైమ్‌లో ఓవర్లు పూర్తి చేయలేదు. దీంతో అయ్యర్‌కు రూ.24 లక్షల ఫైన్ విధించింది బోర్డు. అతడితో పాటు పంజాబ్ ఆటగాళ్లందరి జీతాల్లోనూ కోత విధించింది. ఆ టీమ్ ప్లేయర్లు చెరో రూ.6 లక్షలు కట్టాలి లేకపోతే మ్యాచ్ ఫీజులో నుంచి 25 శాతాన్ని జరిమానా కింద చెల్లించాలని బోర్డు ఆదేశించింది. అటు ముంబై ఇండియన్స్ సారథి పాండ్యాకు రూ.30 లక్షల ఫైన్ వేసింది బీసీసీఐ. స్లో ఓవర్ రేట్ కింద ఇతర ఎంఐ ప్లేయర్లు తలో రూ.12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో నుంచి 50 శాతం మొత్తాన్ని కట్టాలని స్పష్టం చేసింది. రూ.12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో ఏది తక్కువగా ఉంటే అది చెల్లించాలని బోర్డు తెలిపింది.


పునరాలోచన చేస్తారా..

జరిమానా ద్వారా పంజాబ్ గెలిచిన సంతోషాన్ని బీసీసీఐ ఆవిరి చేసినట్లయింది. అటు ఓడిన ముంబైకి కూడా ఫైన్ విధించడం ద్వారా వాళ్ల బాధను రెట్టింపు చేసినట్లయింది. అయితే కోట్లకు కోట్లు పారితోషికాలు అందుకుంటున్న ప్లేయర్లకు ఈ జరిమానా చిన్న మొత్తంగానే చెప్పాలి. కాగా, ఈ ఐపీఎల్‌లో స్లో ఓవర్‌ రేట్‌లు భారీగా నమోదయ్యాయి. గతంలో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోతే జట్టు సారథికి జరిమానా విధించడమే గాక మ్యాచ్ బ్యాన్ కూడా వేసేది బీసీసీఐ. కానీ ఈసారి నిషేధం ఎత్తేయడంతో కెప్టెన్లు ఊపిరి పీల్చుకున్నారు. అయితే బ్యాన్ చేయరనే ధీమాతో చాలా మ్యాచుల్లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేదు. బౌలింగ్ మార్పులు-ఫీల్డింగ్ పొజిషన్స్ సెట్ చేసేందుకు ఎక్కువ టైమ్ తీసుకున్నారు. దీంతో మ్యాచులు ముగియడానికి అధిక సమయం పడుతోంది. మరి.. ఈ రూల్ విషయంలో తదుపరి సీజన్‌లో బీసీసీఐ పునరాలోచన చేస్తుందేమో చూడాలి.


ఇవీ చదవండి:

ఓటమి బాధ తట్టుకోలేకపోయాడు

ముంబై కొంపముంచిన 5 తప్పులు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 11:36 AM