Share News

Delhi High Court: భర్త ఆదాయాన్ని భార్య తెలుసుకోవచ్చు

ABN , Publish Date - Aug 04 , 2025 | 04:23 PM

తన భర్త వాస్తవ ఆర్థిక పరిస్థితిని బ్యాంకు అధికారుల ద్వారా భార్య తెలుసుకోవచ్చునని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు జస్టిస్ రవీంద్ర దుడేజా 11 పేజీల తీర్పును వెలువరించారు.

Delhi High Court: భర్త ఆదాయాన్ని భార్య తెలుసుకోవచ్చు
Delhi High Court

న్యూఢిల్లీ, ఆగస్ట్ 04: తన భర్త వాస్తవ ఆర్థిక పరిస్థితిని బ్యాంకు అధికారుల ద్వారా భార్య తెలుసుకోవచ్చునని ఢిల్లీ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఈ మేరకు జస్టిస్ రవీంద్ర దుడేజా 11 పేజీల తీర్పును ఇచ్చారు. క్రిమినల్ ప్రోసిజర్ కోడ్ 311 అనుసరించి ఆయనపైవిధంగా తీర్పు ఇచ్చారు. గతంలో ఇదే అంశంపై ఆమె ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే ఆమె అభ్యర్థనను ఫ్యామిలీ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఢిల్లీ హైకోర్టును ఆమె ఆశ్రయించారు.


ఈ కేసులో తీర్పుపై జస్టిస్ రవీంద్ర దుడేజా స్పందిస్తూ.. పిటిషనర్ కోరిన సాక్ష్యాలు, పత్రాలు చూపక పోవడం అసంబద్ధమైన అంశమని వ్యాఖ్యానించారు. ఇవి భార్య భరణానికి సంబంధించి.. ప్రత్యక్ష ప్రభావాన్ని నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. భర్తలు తరచుగా తమ వాస్తవ ఆదాయాలను భార్యల వద్ద గోప్యంగా ఉంచి.. భరణ బాధ్యతలను ఎగవేస్తుంటారని అభిప్రాయపడ్డారు. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నప్పుడు.. చాలా సార్లు భర్తలు తమ వాస్తవ ఆదాయాన్ని చూపించకుండా ఉంటారని వివరించారు.


తన భార్యకు చట్టబద్దమైన బకాయలు చెల్లించకుండా ఉండటానికి వారి ఆస్తులను సైతం బదిలీ చేస్తుంటారని సోదాహరణగా పేర్కొన్నారు. 2012, ఫిబ్రవరి 16వ తేదీన పిటిషనర్ భార్య, ప్రతివాది భర్త వివాహం చేసుకున్నారు. తన వివాహం తర్వాత భర్తతోపాటు అతడి కుటుంబ సభ్యులు కట్నం కోసం తనపై గృహ హింసకు పాల్పడ్డారని ఆమె ఆరోపించింది.


ఆ క్రమంలో అత్తింటి వారిపై ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. వివాహం సందర్భంగా తన కుటుంబం చెల్లించిన నగదు, నగలు తిరిగి ఇవ్వకుండా తనను వదిలించుకున్నారని తెలిపారు. భర్త ఆదాయాన్ని బహిర్గతం చేయాలని.. అతడి ఆస్తులకు సంబంధించిన పత్రాలను కోర్టు ఎదుట ఉంచాలని ఈ సందర్భంగా తన పిటిషన్‌లో ఆమె స్పష్టం చేసింది.


మరోవైపు తన భర్త పేరుతో ఉన్న ఆస్తులను అతడి తల్లికి బదిలీ చేశారంటూ ఆ పిటిషన్‌లో వివరించింది. అంటే తన భర్త.. తన ఆస్తులను వెల్లడించకుండా ఉండేందుకు ఈ విధంగా వ్యవహరించారని తన పిటిషన్‌లో ఆమె స్పష్టం చేసింది. అలాగే ఆమె భర్త తరఫున న్యాయవాదులు సైతం కోర్టులో తమ వాదనలు వినిపించారు. ఈ వాదనలు, ప్రతివాదనలు అనంతరం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి పైవిధంగా తీర్పును వెలువరించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

లక్షలాది భారతీయుల ఖాతాలపై కీలక నిర్ణయం

రఘురామ కేసులో మరో కీలక పరిణామం

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Aug 04 , 2025 | 05:44 PM