Bengaluru: ఆ ఇద్దరి మధ్య బాగానే ముదురుతున్నట్లుందిగా.. విషయం ఏంటంటే..
ABN , Publish Date - May 30 , 2025 | 01:06 PM
ఆ ఇద్దరి మధ్య వివాదం బాగానే ముదురుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే నివురుగప్పిన నిప్పులా వారి మధ్య ఉన్న విభేదాలు ఓ విషయంతో మరోసారి బహిర్గతమయ్యాయి. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య మరోసారి వివాదం రాజుకుంది. అయితే.. ఈ విభేదాలు ఎటు దారితీస్తాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వివరాలిలా ఉన్నాయి.

- సీఎం సిఫారసులపై మండిపడ్డ డీసీఎం డీకే
- జలవనరులశాఖ చీఫ్ ఇంజనీర్ల బదిలీలపై ఆగ్రహం
- ఉత్తర్వులు రద్దు చేయాలని సీఎస్ కు లేఖ
బెంగళూరు: సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ మధ్య మరోసారి వివాదం రాజుకుంది. జలవనరుల శాఖకు చెందిన ఐదుగురు చీఫ్ ఇంజనీర్లను బదిలీ చేయడంపై డీసీఎం డీకే శివకుమార్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య సిఫారసు మేరకే బదిలీలు చేపట్టారు. విషయం తెలిసిన తర్వాత డీసీఎం డీకే శివకుమార్ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. తన శాఖలో తన ప్రమేయం లేకుండానే చీఫ్ ఇంజనీర్లను ఎలా బదిలీ చేస్తారని సన్నిహితుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
ఈనెల 13న నేరుగా ఛీఫ్ సెక్రటరీకి లేఖ రాసిన డీసీఎం బదిలీన రద్దు చేసి ఇంజనీర్లను యథావిధి స్థానాలకు పంపాలని కోరారు. ఇదే విషయమై చీఫ్ సెక్రటరీకి నేరుగాను సూచించినట్లు సమాచారం. డీపీఎఆర్ శాఖ ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నారని సిఫారసు చేసిన మేరకే ఉత్తర్వులు జారీ చేసినట్లు చీఫ్ సెక్రటరీ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
కాగా తన శాఖకు సంబంధించిన ఉద్యోగుల బదిలీలు, నియామకాల విషయంలో తన ప్రమేయంలేకుండా చేయరాదని రెండేళ్ల క్రితం మంత్రిగా బాధ్యతలు స్వీకరించినపుడే సర్కులర్ జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జలవనరుల విభాగంలో కొందరు ఇంజనీర్లకు కీలకమైన పనులు అప్పగించిన వేళ బదిలీలు చేస్తే ఎలాగని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వివాదం ఎక్కడి దాకా వెళుతుందో అనే ఉత్కంఠ పార్టీలో నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates In India on May 30: నేడూ స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
Fee Reimbursement: ఫీజు రీయింబర్స్మెంట్కు 75 శాతం హాజరు తప్పనిసరి
Read Latest Telangana News and National News