Share News

Tej Pratap: దేవుడు కంటే మీరే ఎక్కువ.. లాలూ, రబ్రీకి తేజ్ ప్రతాప్ ఎమోషనల్ పోస్ట్

ABN , Publish Date - Jun 01 , 2025 | 04:12 PM

తేజ్ ప్రతాప్ తన పోస్ట్‌లో దురాశాపరులైన జైచంద్ వంటి వారిని పరోక్షంగా ప్రస్తావిస్తూ పార్టీలో ఉంటున్న వారే తనపై కుట్ర చేశారని ఆరోపించారు. తనకు తల్లిదండ్రులే సర్వస్వమని తెలియజేశారు.

Tej Pratap: దేవుడు కంటే మీరే ఎక్కువ.. లాలూ, రబ్రీకి తేజ్ ప్రతాప్ ఎమోషనల్ పోస్ట్

పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నుంచి ఇటీవల బహిష్కరణకు గురైన లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా తన తల్లిదండ్రులకు (Lalu-Rabri) భావోద్వేగ సందేశం పంపారు. 'మమ్మీ-పాపా' అని వారిని సంబోధిస్తూ వారి పట్ల తనకు ఎంతో ప్రేమ, విధేయత ఉన్నాయని తెలియజేశారు. పార్టీలో అంతర్గత ద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ తేజ్‌ప్రతాప్‌ను పార్టీ నుంచి, కుటుంబం నుంచి ఆరేళ్ల పాటు లాలూ ప్రసాద్ ఇటీవల బహిష్కరించారు.


తేజ్ ప్రతాప్ తన పోస్ట్‌లో దురాశాపరులైన జైచంద్ వంటి వారిని పరోక్షంగా ప్రస్తావిస్తూ పార్టీలో ఉంటున్న వారే తనపై కుట్ర చేశారని ఆరోపించారు. 'ప్రియాతి ప్రియమైన అమ్మానాన్నలకు.. మీరే నా ప్రపంచం. నాకు మీరు దేవుడు కంటే ఎక్కువ. మీ ప్రతీ మాట నాకు దేవుని శాసనం. మీరు నాతో ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే. మీ ప్రేమ, నమ్మకం కంటే నేనేమీ కోరుకోను. పాపా.. మీరు లేకపోతే పార్టీనే లేదు. జైచంద్ వంటి కొందరు దురాశాపరులు ఇప్పుడు నాతో రాజకీయాలు చేస్తున్నారు. నేను కోరుకునేది ఒకటే. మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి'' అని తేజ్‌ప్రతాప్ తన సందేశంలో పేర్కొన్నారు.


కృష్ణుడి ఆర్మీని తీసుకెళ్లగలరే కానీ..

తేజ్ ప్రతాప్ మరో ఆసక్తికర పోస్టులో తనను తన సోదరుడి నుంచి ఒంటరిని చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. 'అర్జునుడి (తేజస్వి యాదద్) నుంచి నన్ను వేరు చేయాలని కొందరు కలలు కంటున్నారు. కానీ వారి కుట్రలు ఒక్కనాటికీ విజయవంతం కావు. మీరు కృష్ణ సైన్యాన్ని తీసుకెళ్ల గలరమో కానీ కృష్ణుడిని కాదు. త్వరలోనే ఆ కుట్రలన్నింటినీ బయటపెడతాను. సోదరా.. నాపై విశ్వాసం ఉంచు. ప్రతి సందర్భంలోనూ నేను నీ వెంట ఉంటాను. భౌతికంగా ఇప్పుడు నీకు దూరంగా ఉన్నప్పటికీ నా ఆశీస్సులు ఎల్లప్పుడూ నీతోటే ఉంటాయి. అమ్మానాన్నలను బాగా చూసుకో. జైచంద్ వంటి వాళ్లు ఇంటా బయటా ప్రతిచోటా ఉంటారు'' అని తేజ్‌ప్రతాప్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.


వివాదం ఏమిటంటే..

తేజ్ ప్రతాప్ ఇటీవల తన ఫేస్‌బుక్ ఖాతాలో అనుష్క యాదవ్ అనే మహిళతో ఉన్న ఫొటోను షేర్ చేశారు. తామిద్దరూ 12 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని తెలిపారు. తేజ్ ప్రతాప్‌కు 2018లో ఐశ్వర్య రాయ్‌తో వివాహమైంది. ప్రస్తుతం వారి విడాకుల కేసు నడుస్తోంది. తేజ్ ప్రతాప్ పోస్ట్ అటు పార్టీలోనూ, ఇటు రాష్ట్రంలోనూ చర్చనీయాంశ కావడంతో తేజ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. అయితే, తన సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయిందని, ఫొటోలను తప్పుగా ఎడిట్ చేశారని తేజ్ ప్రతాప్ ఆ తర్వాత వివరణ ఇచ్చారు.


ఇవి కూాడా చదవండి..

పాకిస్థాన్ గూఢచర్యం కేసులో 8 రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు

మావోయిస్టుల కుట్రను భగ్రం చేసిన భద్రతా బలగాలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 01 , 2025 | 06:42 PM