Tata Group: మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం
ABN , Publish Date - Jun 13 , 2025 | 05:31 AM
అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు టాటా గ్రూపు రూ.కోటి చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. గాయపడినవారికి ఉచిత వైద్య సహాయం అందిస్తామని తెలిపింది.

బీజే వైద్య కళాశాల హాస్టల్ భవనాన్ని పునర్నిర్మించి ఇస్తాం: టాటా గ్రూపు
న్యూఢిల్లీ/ముంబై, జూన్ 12: అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు టాటా గ్రూపు రూ.కోటి చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. గాయపడినవారికి ఉచిత వైద్య సహాయం అందిస్తామని తెలిపింది. విమానం కూలడంతో ధ్వంసమైన బీజే వైద్య కళాశాల హాస్టల్ భవనాన్ని పునర్నిర్మించి ఇస్తామని పేర్కొంది. ఈ మేరకు టాటా సన్స్ చైర్పర్సన్ చంద్రశేఖరన్ ప్రకటన విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వారికి సహాయం అందించడంపై దృష్టి కేంద్రీకరించామని, ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించామన్నారు. ఘటనా స్థలంలో సహాయ బృందాలతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. పెను విషాదంతో ఎయిరిండియా ఎంతో వేదనను అనుభవిస్తోందని ఆ సంస్థ సీఈవో, ఎండీ క్యాంప్బెల్ విల్సన్ పేర్కొన్నారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తమ సంస్థ తరపు నుంచి ప్రత్యేక బృందాలు అహ్మదాబాద్ చేరుకున్నాయని తెలిపారు.