Supreme Court: ఆజాద్ విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తారా
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:56 AM
మావోయిస్టు నేత ఆజాద్పై కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తారా అని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒడిసాలో 37 కేసులు పెండింగ్లో ఉన్నట్లు నివేదిక ఇచ్చారు.

ఏపీ సర్కారును ప్రశ్నించిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: మావోయిస్టు కీలక నేత దునా కేశవరావ్ అలియాస్ ఆజాద్ను విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేస్తారా? అని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మావోయిస్టు పార్టీ ఒడిసా నేత అయిన ఆజాద్.. 2011, మే 18న హైదరాబాద్ పోలీసుల ముందు లొంగిపోయి, జైల్లో ఉన్నారు. కొన్నాళ్ల తర్వాత ఒడిసా అభ్యర్థన మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆజాద్ను ఆ రాష్ట్రానికి అప్పగించింది. ఆజాద్పై ఒడిసా పోలీసులు పదుల సంఖ్యలో కేసులు నమోదు చేశారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం తనను అప్పగించడంతోపాటు, ఒడిసా పోలీసులు నమోదు చేసిన కేసులను సవాల్ చేస్తూ ఆజాద్ గత ఏడాది డిసెంబరులో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తాజాగా సోమవారం జరిగిన విచారణలో.. ఆజాద్పై పది కేసులు రద్దు చేశామని, మరో 37 కేసులు పెండింగులో ఉన్నాయని ఒడిసా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆయా కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న ఏపీ తరఫు న్యాయవాది..ఆజాద్పై తమవద్దా కేసులు పెండింగులో ఉన్నాయని తెలిపారు. దీంతోన్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్సింగ్తో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. ఆజాద్ను విచారించేందుకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తారా? అని ఏపీ న్యాయవాదిని ప్రశ్నించింది.