Share News

రూ. 5 పార్లే-జీ బిస్కెట్‌ ప్యాకెట్‌ గాజాలో రూ.2,400

ABN , Publish Date - Jun 07 , 2025 | 05:42 AM

యుద్ధ వాతావరణం నేపథ్యంలో గాజాలో తీవ్ర ఆహార కొరత నెలకొంది. నిత్యావసరాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. మన దేశంలో రూ. 5కు దొరికే పార్లే-జి బిస్కెట్‌.. గాజాలో సుమారు రూ. 2,400కు అమ్ముతున్నారు.

రూ. 5 పార్లే-జీ బిస్కెట్‌ ప్యాకెట్‌ గాజాలో రూ.2,400

  • తీవ్ర ఆహార కొరతతో చుక్కలను తాకుతున్న నిత్యావసరాల ధరలు

  • నూనె, చక్కెర కిలో 4 వేలకు పైనే..

న్యూఢిల్లీ, జూన్‌ 6: యుద్ధ వాతావరణం నేపథ్యంలో గాజాలో తీవ్ర ఆహార కొరత నెలకొంది. నిత్యావసరాల ధరలు చుక్కలను తాకుతున్నాయి. మన దేశంలో రూ. 5కు దొరికే పార్లే-జి బిస్కెట్‌.. గాజాలో సుమారు రూ. 2,400కు అమ్ముతున్నారు. ఇది అక్కడి తీవ్ర ఆహార కొరతకు, ధరల మంటకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. దీనికి సంబంధించి గాజాకు చెందిన ఓ వ్యక్తి సోషల్‌మీడియాలో ఇటీవల పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. ‘‘చాలా కాలం ఎదురు చూసిన తర్వాత ఎట్టకేలకు ఈ రోజు కుమార్తె రఫీ్‌ఫకు ఇష్టమైన పార్లే-జి బిస్కెట్లు కొన్నాను. గతంలో 1.5(రూ. 147) యూరోలు ఉండే దీని రేటు 24(రూ. 2,345)యూరోలకు పెరిగినా, ఆమెకు ఇష్టమైన దానిని కాదనలేకపోయాను’’ అంటూ ఆ పోస్టులో ఆ వ్యక్తి పేర్కొన్నాడు.


ఇక 2023 అక్టోబర్‌ నుంచి ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత నుంచి ఇజ్రాయెల్‌ గాజాకు ఆహార సరఫరాను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. ఈ ఏడాది మార్చి 2 నుంచి మే 19 మధ్య అయితే పూర్తిగా నిలిపివేసింది. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో సహాయక సామగ్రితో కూడిన కొన్ని ట్రక్కులకు మాత్రమే అనుమతి ఇస్తోంది. ఒక్క బిస్కెట్ల ప్యాకెట్లే కాకుండా నిత్యావసర సరుకుల ధరలు కూడా మండిపోతున్నాయని ఎన్‌డీటీవీ కథనం తెలిపింది. ఉత్తర గాజాలో కిలో చక్కెర రూ. 4,914, కిలో వంట నూనె రూ. 4,177, కిలో బంగాళాదుంపలు రూ. 1,965, కిలో ఉల్లిపాయలు రూ.4,423, కప్పు కాఫీ రూ.1,800కు అమ్ముతున్నారని వెల్లడించింది.

Updated Date - Jun 07 , 2025 | 05:42 AM