Share News

PM Modi: పటేల్‌ మాట వినుంటే ఉగ్రదాడులు జరిగేవే కాదు

ABN , Publish Date - May 28 , 2025 | 05:33 AM

పటేల్ మాట వినిపిస్తే ఉగ్రదాడులు జరగకుండా ఉంటాయన్నారు ప్రధాని మోదీ. 1947లో దేశ విభజన నిర్ణయంతో పాకిస్తాన్ ఉగ్రవాద పరంపర ప్రారంభమై, కశ్మీరు విషయంపై కఠిన రీతిలో బదులిస్తామని హామీ ఇచ్చారు.

PM Modi: పటేల్‌ మాట వినుంటే ఉగ్రదాడులు జరిగేవే కాదు

  • పీవోకేను స్వాధీనం చేసుకోవాలని చెప్పినా నాటి పాలకులు పట్టించుకోలే

  • 1947లో దేశ విభజన నిర్ణయంతోనే పాక్‌ ఉగ్రవాద పరంపర మొదలైంది

  • అది 75 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది

  • పాక్‌ తీరు మారకపోతే తగిన బదులిస్తాం

  • గుజరాత్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు

  • 1947లో దేశ విభజన నిర్ణయంతోనే పాక్‌ ఉగ్రవాదం పరంపర మొదలైంది

గాంధీనగర్‌, మే 27: దేశ తొలి హోం మంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ మాట విని ఉంటే భారత్‌లో ఉగ్రదాడుల పరంపర కొనసాగేది కాదని ప్రధాని మోదీ అన్నారు. పహల్గాం ఉగ్రదాడికి 1947లో తీసుకున్న దేశ విభజన నిర్ణయమే కారణమని చెప్పారు. భారత మాతను 1947లో రెండు భాగాలుగా విభజించారని, అదే రోజు రాత్రి కశ్మీరులో ముజాహిదీన్‌లు తొలి ఉగ్రదాడికి పాల్పడ్డారని తెలిపారు.

ఆ ఉగ్రవాదుల సాయంతో పాకిస్థాన్‌ భారత భూభాగాన్ని కొంత మేర ఆక్రమించుకుందని గుర్తుచేశారు. పాకిస్థాన్‌ ఆక్రమించుకున్న కశ్మీరు (పీవోకే)ను తిరిగి తీసుకునే వరకూ భారత సైన్యాన్ని ఆపొద్దని సర్దార్‌ పటేల్‌ చెప్పారని.. అయినా అప్పటి పాలకులు ఆయన మాట వినలేదని మోదీ ఆరోపించారు. నాటి నుంచి వారు (పాకిస్థాన్‌, దానికి అండగా నిలుస్తున్న ఉగ్రవాదులు) రక్తం రుచి మరిగారని చెప్పారు. 75 ఏళ్లుగా ఆ ఉగ్రవాదం కొనసాగుతూనే ఉందన్నారు. తాజాగా పహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి కూడా ఆ పరంపరలో భాగమేనని తెలిపారు. మూడుసార్లు జరిగిన యుద్ధాల్లో భారత బలగాలు పాక్‌ను చిత్తుగా ఓడించాయన్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి, భారత్‌పై దాడులకు ఉసిగొల్పడం ద్వారా పరోక్ష యుద్ధానికి తెరతీసిందని ఆరోపించారు. ఉగ్రదాడులతో దేశంలో అమాయక పౌరులు, పర్యాటకులు, యాత్రికుల ప్రాణాలు తీస్తోందని ధ్వజమెత్తారు. ఉగ్రవాదం కేవలం పరోక్ష యుద్ధమే కాదని, పాకిస్థాన్‌ ఉద్దేశపూర్వకంగానే ఎంచుకున్న యుద్ధ వ్యూహమని చెప్పారు. దానికి సరైన రీతిలో భారత్‌ బదులిస్తుందన్నారు.


రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్‌ వెళ్లిన ప్రధాని మోదీ.. మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రస్తావిస్తూ పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వసుదైక కుటుంబం అన్నది మన సంస్కారమని, పొరుగువారు కూడా సంతోషంగా ఉండాలనే కోరుకుంటామని చెప్పారు. మన సత్తాకు సవాలు విసిరితే ఊరుకునే ప్రసక్తే లేదని, భారత్‌ వీరుల గడ్డ అని తెలిపారు. కేవలం 22 నిమిషాల్లోనే 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామని, అది కూడా కెమెరా సాక్షిగా చేశామని చెప్పారు. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా హతమైన ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేసిందని, వారి శవపేటికలపై పాక్‌ జెండాను కప్పారని, పాక్‌ సైన్యం వారికి సెల్యూట్‌ చేసిందని మోదీ గుర్తుచేశారు. వారి తీరు ఇలాగే కొనసాగితే.. అదే రీతిలో తగిన బదులిస్తామని స్పష్టం చేశారు. కాగా, మంగళవారం మాజీ ప్రధాని నెహ్రూ వర్ధంతి సందర్భంగా మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. మరోవైపు ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. దేశ తొలి ప్రధాని నెహ్రూ వర్ధంతి రోజు కూడా ప్రధాని మోదీ ఆయనపై విమర్శలు మానుకోలేదని, సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే దేశ విభజన అంశాన్ని తెరపైకి తెచ్చిందని మండిపడింది.

పహల్గాంలో జమ్మూ-కశ్మీర్‌ మంత్రివర్గ సమావేశం

జమ్మూ-కశ్మీర్‌ ప్రభుత్వం మంగళవారం పహల్గాంలో ప్రత్యేకంగా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించింది. ఉగ్రవాదుల పిరికిపంద చర్యలకు ప్రభుత్వం భయపడబోదంటూ స్పష్టమైన సందేశం పంపడమే ఈ సమావేశం ఉద్దేశమని తెలిపింది. పహల్గాంలో పర్యాటక రంగం మునుపటిలాగానే కొనసాగుతోందన్న సందేశం పంపించడం కూడా ఈ సమావేశం నిర్వహణకు మరో కారణమని పేర్కొంది. ఇటీవల తాను ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసినప్పుడు జమ్మూ-కశ్మీర్‌లో పర్యాటక పరిశ్రమ పరిస్థితిని వివరించానని, ఆయన అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారని కశ్మీర్‌ సీఎం ఒమర్‌ ఈ సందర్భంగా తెలిపారు. పహల్గాంలో ఆయన మంగళవారం సైకిల్‌పై పర్యటించారు.

Updated Date - May 28 , 2025 | 06:03 AM