Share News

Bengaluru: ఆర్సీబీపై కేసు

ABN , Publish Date - Jun 06 , 2025 | 04:16 AM

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద 11 మందిని బలిగొన్న తొక్కిసలాట ఘటనలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్లపై కేసు నమోదైంది.

Bengaluru: ఆర్సీబీపై కేసు

  • తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సుమోటోగా నమోదుచేసిన పోలీసులు

  • కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌పైనా..

  • బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ సస్పెండ్‌

  • ఏసీపీ, డీసీపీలపైనా వేటు వేసిన సర్కారు

  • ఘటనపై ప్రభుత్వాన్ని తప్పుబట్టిన హైకోర్టు

  • సమగ్ర వివరాలతో నివేదికకు ఆదేశం

బెంగళూరు, జూన్‌ 5(ఆంధ్రజ్యోతి): బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద 11 మందిని బలిగొన్న తొక్కిసలాట ఘటనలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్లపై కేసు నమోదైంది. ఈ ఘటనపై బెంగళూరు పోలీసులు సుమోటోగా ఫిర్యాదును నమోదుచేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎ్‌స)లోని సెక్షన్‌ 105 సహా ఐదు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వదిలిపెట్టేది లేదని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. బెంగళూరు పోలీస్‌ కమిషనర్‌ బి.దయానందను సస్పెండ్‌ చేసింది. అడిషనల్‌ పోలీస్‌ కమిషనర్‌ వికాశ్‌ కుమార్‌, డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ శేఖర్‌పైనా వేటుపడింది. కబ్బన్‌ పార్క్‌ అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌ సి. బాలకృష్ణ, కబ్బన్‌ పార్క్‌ సీఐ ఏకే గిరీశ్‌లను సస్పెండ్‌ చేసింది. ఈ కేసును సీఐడీకి ఇవ్వాలని సీఎం సిద్దరామయ్య నేతృత్వంలో జరిగిన క్యాబినెట్‌ సమావేశం నిర్ణయించింది. ఈ వివరాలను ముఖ్యమంత్రి మీడియాకు తెలిపారు.


సుమోటోగా స్వీకరించిన హైకోర్టు

తొక్కిసలాట ఘటనను కర్ణాటక హైకోర్టు ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ వి.కామేశ్వరరావ్‌, జస్టిస్‌ సీఎం జోషిల ద్విస భ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. ఐపీఎల్‌ విజేత ఆర్‌సీబీ సభ్యులతో రెండుచోట్ల ఎందుకు సంబరాలు నిర్వహించారని ప్రశ్నించింది. స్టేడియం వద్ద ఎలాంటి బందోబస్తు ఏర్పాటుచేశారు? క్రికెటర్‌ అభిమానుల నియంత్రణకు తీసుకున్న చర్యలు ఏమిటని సర్కారును నిలదీసింది. క్రీడాకారులు ఏ దేశానికి ఆడారని సన్మానం చేయదలచారని ప్రశ్నించిది. అడ్వకేట్‌ జనరల్‌ శశికరణ శెట్టి స్పందిస్తూ, ఘటనపై న్యాయ విచారణకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. దీంతో విచారణను బెంచ్‌ ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తూ, సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Updated Date - Jun 06 , 2025 | 04:16 AM