Rahul Gandhi: ఉగ్రవాదంపై పోరులో ఐక్యంగా భారత్
ABN , Publish Date - Apr 26 , 2025 | 05:10 AM
ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ ఐక్యంగా నిలబడాలని రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. పహల్గాం దాడిలో గాయపడిన వారిని పరామర్శించేందుకు శ్రీనగర్ వెళ్లిన ఆయన, లెఫ్టినెంట్ గవర్నర్ మరియు మాజీ సీఎంతో భేటీ అయ్యారు

ప్రతి భారతీయుడు కలిసి రావాలి
కశ్మీర్లో విపక్ష నేత రాహుల్గాంధీ
ఆర్మీ92 బేస్ ఆస్పత్రిలో పహల్గాం క్షతగాత్రుడికి పరామర్శ
ఎల్జీ మనోజ్సిన్హా, సీఎం ఒమర్తో భేటీ
శ్రీనగర్, ఏప్రిల్ 25: ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భారత్ ఐక్యంగా నిలుస్తుందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ఉద్ఘాటించారు. దేశ ప్రజలను విభజించేందుకే జరిగిన ఉగ్రదాడిని తిప్పికొట్టేందుకు ప్రతి భారతీయుడు ఒక్కటిగా కలిసి పోరాడాలన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించడానికి ఆయన శుక్రవారం ఉదయం జమ్మూకశ్మీర్ చేరుకున్నారు. బాదామీబాగ్లోని ఆర్మీ 92 బేస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడిని పరామర్శించిన అనంతరం రాహుల్గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడ జరిగిన ఉగ్రదాడి గురించి తెలుసుకుని సాయపడేందుకు వచ్చానన్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష భేటీలోనూ కేంద్రానికి బాసటగా నిలిచిన ఐక్య విపక్షం ఉగ్రదాడిని ఖండించిందని గుర్తు చేశారు. అటుపై శ్రీనగర్లో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లాలతోనూ రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఉగ్రదాడి, తదనంతర పరిణామాలను ఆయనకు వారు వివరించారు.