Share News

Rahul Gandhi: సైన్యం ప్రతిష్ఠను దెబ్బతీయడం వాక్‌స్వాతంత్య్రం కాదు

ABN , Publish Date - Jun 05 , 2025 | 04:23 AM

భారత్‌ జోడో యాత్ర సందర్భంగా భారత సైనికులనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీపై అలహాబాద్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.

Rahul Gandhi: సైన్యం ప్రతిష్ఠను దెబ్బతీయడం వాక్‌స్వాతంత్య్రం కాదు

  • కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీపై అలహాబాద్‌ హైకోర్టు ఆగ్రహం

  • సమన్ల రద్దు పిటిషన్‌ కొట్టివేత

  • భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు

లఖ్‌నవూ, జూన్‌ 4: భారత్‌ జోడో యాత్ర సందర్భంగా భారత సైనికులనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీపై అలహాబాద్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. వాక్‌ స్వాతంత్య్రం అంటే సైన్యం ప్రతిష్ఠను దెబ్బతీయడం కాదని స్పష్టంచేసింది. 2022లో రాజస్థాన్‌లో జోడో యాత్ర సందర్భంగా రాహుల్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘జనం జోడో యాత్ర గురించి, అశోక్‌ గహ్లోత్‌ (నాటి రాజస్థాన్‌ సీఎం), సచిన్‌ పైలట్‌ (కాంగ్రె్‌సలో ఆయన ప్రత్యర్థి) గురించి అక్కడక్కడా అడుగుతుంటారు. కానీ చైనా 2,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించుకుందని గానీ, 20 మంది భారత సైనికులను చంపిందని గానీ, అరుణాచల్‌ ప్రదేశ్‌లో మన జవాన్లను చావబాదుతోందని గానీ అడుగరు. వీటిపై భారతీయ మీడియా ఒక్క ప్రశ్న కూడా వేయదు. నిజమా కాదా’ అని వ్యాఖ్యానించారు. ఆర్మీ పరువుకు భంగం కలిగించేలా రాహుల్‌ పదే పదే మాట్లాడారంటూ సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్‌వో) మాజీ డైరెక్టర్‌ ఉదయశంకర్‌ శ్రీవాస్తవ ఫిర్యాదు చేశారు. దీనిపై లఖ్‌నవూ కోర్టు రాహుల్‌కు సమన్లు జారీచేసింది. ఈ సమన్లను రాహుల్‌ అలహాబాద్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. ‘రాజ్యాంగంలోని 19(1ఏ) అధికర ణ వాక్‌ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ హక్కు ఇస్తోంది. అయితే ఇది సహేతుక ఆంక్షలకు లోబడి ఉంటుంది. భారత సైన్యం ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసే స్వేచ్ఛ ఈ హక్కులో భాగం కాదు’ అని తేల్చిచెప్పింది. ఫిర్యాదుదారు భారత సైన్యంలో అధికారి కాదని.. బాధితుడు కూడా కాదన్న రాహుల్‌ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. లఖ్‌నవూ కోర్టు జారీచేసిన సమన్లను రద్దు చేయాలన్న రాహుల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది.


కశ్మీర్‌పై మా ప్రయత్నాలు విఫలం: భుట్టో

కశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తడానికి తాము చేసిన ప్రయత్నాలకు ఎదురుదెబ్బలు తగిలాయని పాకిస్థాన్‌ మాజీ విదేశాంగ మంత్రి బిలావర్‌ భుట్టో అంగీకరించారు. ఐక్యరాజ్యసమితి వేదికపైనా, బయట కూడా ఈ విషయంలో తమ ప్రయత్నాలేవీ ఫలించలేదని ఆయన తెలిపారు. మరోవైపు, భారత్‌పై విషం చిమ్మాలని ప్రయత్నించి విదేశీగడ్డపై మరోసారి పాకిస్థాన్‌ భంగపడింది. భారత్‌లోని ముస్లిములను దుష్టులుగా చిత్రీకరించడానికి పహల్గాం దాడిని ఆ దేశం రాజకీయ సాధనంగా వాడుకుంటున్నదని బిలావర్‌ భుట్టో వ్యాఖ్యానించారు. అయితే, భారత సైనికాధికారుల్లో ముస్లింలు కూడా ఉన్నారు కదా అంటూ బిలావర్‌ను ఓ అమెరికా జర్నలిస్టు ప్రశ్నించడంతో ఆయన నోరు మూతబడింది. ఆపరేషన్‌ సిందూర్‌పై మిలిటరీ ప్రెస్‌ బృందంలో సోఫియా ఖురేషీ కూడా ఉన్న విషయం పరోక్షంగా గుర్తుచేశారు. దీంతో మాన్పడిపోయిన బిలావర్‌ ఉక్రోషంతో భారత్‌పై అవాకులుచెవాకులు మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో బిలావర్‌ భుట్టో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ ఘటన జరిగింది.


జులై 21 నుంచి పార్లమెంటు

న్యూఢిల్లీ, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి) : జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు బుధవారం ప్రకటించారు. వచ్చే నెల 21న ఉదయం 11 గంటలకు లోక్‌సభ, రాజ్యసభ సమావేశం అవుతాయని ఆయన వెల్లడించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని పార్లమెంట్‌ వ్యవహారాలపై కేబినెట్‌ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. కాగా పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని లోక్‌సభ, రాజ్యసభల్లోని ప్రతిపక్ష నేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధాని మోదీకి లేఖలు రాశారు. కేంద్రం దీనికి సానుకూలంగా స్పందించలేదు. మరోవైపు మంగళవారమే ఢిల్లీలో విపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, శివసేన(యూబీటీ) తదితర ప్రతిపక్ష పార్టీలు ప్రధాని నరేంద్ర మోదీకి సంయుక్తంగా లేఖ రాశాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌పై పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆ లేఖలో డిమాండ్‌ చేశాయి. ఆ పార్టీలు లేఖ రాసిన మరుసటి రోజే జూలై 21 నుంచి వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ సమావేశాల్లో ప్రధానంగా పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌, కాల్పుల విరమణపై ట్రంప్‌ ప్రకటన, జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు, జనగణన, కులగణన తదితర అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తే అవకాశం ఉంది.


ఇవీ చదవండి:

రైల్వే టిక్కెట్ల వెనుక బిగ్ స్కాం.. మోసపోయిన లక్షల మంది..

జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 05 , 2025 | 04:24 AM