PM Modi: విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మోదీ..
ABN , Publish Date - Jun 13 , 2025 | 10:37 AM
PM Modi: అహ్మదాబాద్ సమీపంలో విమాన ప్రమాద ఘటన స్థలాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం పరిశీలించారు. అనంతరం సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అలాగే ధ్వంసమైన మెడికల్ కాలేజ్ భవనాన్ని కూడా పరిశీలించారు.

Ahmedabad: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శుక్రవారం అహ్మదాబాద్ పర్యటనకు (Ahmedabad Visit) వెళ్లారు. విమాన ప్రమాద ఘటన ( Air India Plane Crash) స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రధాని మోదీ పరామర్శించారు. ప్రధాని వెంట కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) ఉన్నారు. ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో విమానంలో 230 మంది ప్రయాణీకులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. 11 మంది చిన్నారులు, ఇద్దరు శిశువులు ఉన్నారు.
ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక వ్యక్తి..
అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిరిండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ విమాన ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది కూడా దుర్మరణం పాలయ్యారు. కాగా వైద్య కళాశాల భవనంపై విమానం పడిపోవడంతో అందులో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. వారు సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విమాన ప్రమాదంలో ధ్వంసమైన మెడికల్ కాలేజ్ భవనాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. అయితే విమానం ప్రమాదంలో ఒకే ఒక వ్యక్తి రమేష్ విశ్వాస్ కుమార్ ప్రాణాలతో బయటపడ్డారు. అతను మృత్యుంజయుడుగా నిలిచారు. విమానం నేల కూలిన వెంటనే బయటకు వచ్చిన రమేష్ ప్రాణభయంతో ఘటనా స్థలం నుంచి దూరంగా వెళుతుండగా చుట్టుపక్కలవాళ్లు వీడియో తీశారు.
చుట్టూ మృత దేహాలే..
విమానంలో 11 ఏ సీట్లో కూర్చున్న రమేష్.. విమానం టేకాఫ్ అయిన 30 సెకండ్లకు పెద్ద శబ్ధం వచ్చిందని ఆ వెంటనే విమానం కూలిపోయిందని చెప్పారు. కళ్లు తెరిచి చూసేసరికి తన చుట్టూ మృత దేహాలే ఉన్నాయని.. వెంటనే పైకి లేచి పరిగెత్తానని చెప్పారు. ప్రమాదంలో రమేష్ గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన బ్రిటన్ పౌరుడు.
ప్రధాని మోదీ ట్వీట్..
‘అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.. బాధపెట్టింది. ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారకం. ఈ విషాద సమయంలో తాను ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నానని.. బాధితులకు సహాయం చేయడానికి కృషి చేస్తున్న మంత్రులు.. అధికారులతో నేను సంప్రదిస్తున్నాను’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
విమాన ప్రమాదంపై మృత్యుంజయుడు ఏమన్నారంటే..
తీవ్రంగా కలత చెందా..: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
For More AP News and Telugu News