Share News

PM Modi: ఈ వినాశనం బాధాకరం

ABN , Publish Date - Jun 14 , 2025 | 05:49 AM

విమాన ప్రమాద స్థలంలో జరిగిన వినాశనం బాధాకరమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ విషాద ఘటనలో తమవారిని కోల్పోయిన బాధితులకు అండగా నిలుస్తామని చెప్పారు.

PM Modi: ఈ వినాశనం బాధాకరం

  • బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తాం: నరేంద్ర మోదీ

  • అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిన ప్రాంతాన్ని పరిశీలించిన ప్రధాని

అహ్మదాబాద్‌, జూన్‌ 13: విమాన ప్రమాద స్థలంలో జరిగిన వినాశనం బాధాకరమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ విషాద ఘటనలో తమవారిని కోల్పోయిన బాధితులకు అండగా నిలుస్తామని చెప్పారు. అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిపోయిన ప్రాంతాన్ని ప్రధాని శుక్రవారం పరిశీలించారు. పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు, గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌, ఆ రాష్ట్ర హోం మంత్రి హర్ష్‌ సంఘవిలతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లారు. సుమారు 20 నిమిషాలు అక్కడే ఉండి.. ప్రమాద స్థలంలో పరిస్థితి, సహాయక చర్యల వివరాలను తెలుసుకున్నారు. బీజే వైద్య కళాశాల హాస్టల్‌ భవనంలోకి విమానం దూసుకెళ్లిన తీరును అధికారులు వారికి తెలిపారు. అనంతరం మోదీ నగరంలోని ప్రభు త్వ ఆస్పత్రికి వెళ్లారు. విమాన ప్రయాణికుల్లో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి విశ్వాస్‌ కుమార్‌ రమేశ్‌ను, విమానం కూలిన భవనంలో గాయపడి చికిత్స పొందుతున్న 25మంది మెడికోలు, ఇతరులను పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్స వివరాలపై ఆరా తీశారు. తర్వాత అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలోని గుజరాత్‌ సెయిల్‌ కార్యాలయంలో ఆ రాష్ట్ర అధికారులు, పౌర విమానయాన అధికారులతో ప్రమాద ఘటనపై సమీక్షించారు. సహాయక చర్యల తీరు, మృతదేహాల గుర్తింపు వంటి అంశాలపై ఆరా తీశారు. బాధిత కుటుంబాలకు తగు సహాయసహకారాలు అందించాలని ఆదేశించారు. తర్వాత ప్రధాని ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ‘‘అహ్మదాబాద్‌లో విమానం కూలిన ప్రాంతాన్ని పరిశీలించాను. అక్కడ జరిగిన వినాశనం బాధాకరం. సహాయక చర్యలుచేపట్టిన అధికారులు, బృందాలతో సమావేశమై పరిస్థితిని తెలుసుకున్నాను. ఈ విషాదకర ఘటనలో తమవారిని కోల్పోయిన బాధితులకు తోడుగా నిలుస్తాం’’అని పేర్కొన్నారు.


విజయ్‌భాయ్‌ ఇకలేరని నమ్మలేకపోతున్నా..

విమాన ప్రమాదంలో కన్నుమూసిన గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపాణీ కుటుంబసభ్యులను ప్రధాని మోదీ పరామర్శించారు. అహ్మదాబాద్‌లోని విజయ్‌ రూపాణీ నివాసానికి వెళ్లి.. ఆయన భార్య అంజలి, ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. ‘‘విజయ్‌ భాయ్‌తో ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేశాను. గుజరాత్‌ అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన ఇక లేరన్న విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను’’ అని ప్రధాని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. విమానం కుప్పకూలిన ఘటనలో మరణించిన వారి కుటుంబసభ్యులు, బంధువుల కోసం ఎయిరిండియా శుక్రవారం 4 సహాయక కేంద్రాలను ఏర్పా టు చేసింది. అహ్మదాబాద్‌, ముంబై, ఢిల్లీ, లండన్‌లోని గట్విక్‌ ఎయిర్‌పోర్టులలో ఈ సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశామని... మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అహ్మదాబాద్‌కు చేరుకునేందుకు అవసరమైన సహకారం అందిస్తాయని ప్రకటించింది.


పరిమళించిన మానవత్వం

  • 200 మంది వలంటీర్లు..900 యూనిట్ల రక్త దానం

  • విమాన ప్రమాద బాధితులను ఆదుకునేందుకు క్యూకట్టిన వైనం

అహ్మదాబాద్‌, జూన్‌ 13: మానవత్వం పరిమళించే మంచి మనిషులు క్యూ కట్టారు. అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాద ఘటనలో గాయపడిన వారికి రక్తదానం చేసేందుకు వందల సంఖ్యలో కదలివచ్చారు. గంటల వ్యవధిలోనే రక్త దానం చేస్తామంటూ.. వందల కొద్దీ పౌరులు మానవత్వాన్ని చాటుకున్నారు. స్వచ్ఛంద సంస్థ ‘సహాయ్‌’ నేతృత్వంలో రెడ్‌ క్రాస్‌ అహ్మదాబాద్‌ చాప్టర్‌ ప్రారంభించిన రక్త దాన శిబిరానికి 200మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 900యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. ఈ శిబిరం శుక్రవారం కూడా కొనసాగింది. ‘‘ప్రమాదం జరిగిన గంట వ్యవధిలోనే బాధితులకు రక్త దానం చేసి వారి ప్రాణాలను నిలపాలని తలపోశాం. ఆ వెంటనే రెడ్‌క్రాస్‌ కార్యాలయాన్ని సంప్రదించాం. బీజే మెడికల్‌ కాలేజీ ప్రాంగణంలో ఓ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మేం ఊహించనంతగా స్పందన వచ్చింది. రక్త దానం చేస్తామంటూ 200మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. విమాన ప్రమాద ఘటనలో బాధితులకు ప్రాణం నిలపాలన్న ఆతృతే వారి లో కనిపించింది. గురువారం రాత్రి 11గంటల వరకు 900 యూని ట్ల రక్తాన్ని సేకరించాం’’అని ‘సహాయ్‌’ సభ్యుడు సాగర్‌ తెలిపారు.

Updated Date - Jun 14 , 2025 | 05:49 AM