PM Modi: సైప్రస్, కెనడా, క్రొయేషియాలో మోదీ పర్యటన
ABN , Publish Date - Jun 14 , 2025 | 04:54 PM
సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి మోదీ ఈనెల 15, 16 తేదీల్లో ఆ దేశంలో అధికారిక పర్యటన జరుపుతారు. రెండు దశాబ్దాలుగా ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే ప్రథమం.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆదివారం నాడు మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 15, 16 తేదీల్లో సైప్రస్ (Cyprus) లో ఆయన పర్యటిస్తారు. 16, 17 తేదీల్లో కెనడా(Canada)లో నిర్వహించే జీ-7 సదస్సులో పాల్గొంటారు. అనంతరం 18న క్రొయేషియా (Croatia)లో పర్యటిస్తారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ శనివారం నాడు వివరాలు వెల్లడించింది.
ఎంఈఏ వివరాల ప్రకారం, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి మోదీ ఈనెల 15-16 తేదీల్లో ఆ దేశంలో అధికారిక పర్యటన జరుపుతారు. రెండు దశాబ్దాలుగా ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే ప్రథమం. అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్తో చర్చల అనంతరం లిమాసోల్లో వ్యాపార దిగ్గజాలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతకు ప్రధాని పర్యటన దోహదం కానుంది. ఆ తర్వాత కెనడాకు ప్రధాని మోదీ బయలుదేరుతారు. కెనడా ప్రధాని మార్క్ కార్నే ఆహ్వానం మేరకు జూన్ 16-17 తేదీల్లో జరిగే జీ-7 సదస్సులో ఆయన పాల్గొంటారు. జీ-7 సదస్సులో మోదీ పాల్గొనడం వరుసగా ఇది ఆరోసారి. సదస్సు సందర్భంగా పలు ద్వైపాక్షిక సమావేశాల్లోనూ ప్రధాని మోదీ పాల్గొంటారు.
ప్రధాని తన పర్యటన చివర్లో క్రొయేషియాలో పర్యటిస్తారు. క్రొయేషియా ప్రధాని ఆండ్రెజ్ ప్లెంకోవిక్ ఆహ్వానం మేరకు జూన్ 18న ఆ దేశంలో అధికారిక పర్యటన జరుపుతారు. క్రొయేషియాలో భారతదేశ ప్రధానమంత్రి ఒకరు పర్యటించనుండటం ఇదే మొదటిసారి. ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రధాని పర్యటన మైలురాయి కానుంది. ప్రధాని ప్లెంకోవిక్, అధ్యక్షుడు జోరన్ మిలనోవిక్తో మోదీ సమావేశమవుతారు. యూరోపియన్ యూనియన్ భాగస్వాములతో మరింత పటిష్ట బంధాల గురించి చర్చిస్తారు.
ఇవి కూడా చదవండి..
అయోధ్య ఆలయంలో రామదర్బార్ సందర్శన షురూ
15 ఏళ్ల తర్వాత కలిశారు.. విమానం విషాదం మిగిల్చింది..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి