Karnataka Home Minister: బెంగళూరులో పాకిస్థానీయులను గుర్తిస్తాం
ABN , Publish Date - Apr 26 , 2025 | 03:58 AM
బెంగళూరులో ఉన్న అనధికారిక పాకిస్థానీయులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోం మంత్రి పరమేశ్వర్ తెలిపారు. జాతీయ భద్రతపై మరిన్ని కఠిన నిర్ణయాలు అవసరమని ఆయన పేర్కొన్నారు

హోం మంత్రి పరమేశ్వర్
బెంగళూరు, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): బెంగళూరులో అధికారికంగా, అనధికారికంగా నివసిస్తున్న పాకిస్థానీయులను గుర్తిస్తామని కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పాకిస్థానీలను వెనక్కు పంపే విషయంలో వివాదం లేదని, ఇప్పటికే వీసాలు రద్దు చేశారని వివరించారు. బెంగాళూరులో అనధికారికంగా ఉంటున్న పాకిస్థానీల కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. జాతీయ భద్రత విషయంలో ఇంకా కఠినమైన నిర్ణయాలు రావాల్సి ఉందని పరమేశ్వర్ అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, పహల్గామ్లో ప్రభుత్వం ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ప్రశ్నించిన సీనియర్ జర్నలిస్టుపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. జమ్మూ-కశ్మీర్లోని కథువాలో బీజేపీ కార్యకర్తలు పహల్గామ్ దాడికి నిరసనగా ధర్నా చేశారు. అయితే అక్కడ భద్రతపరమైన లోపాలు ఎందుకు ఉన్నాయని దైనిక్ భాస్కర్ రిపోర్టర్ రాకేశ్ శర్మ, మరికొందరు విలేకరులు వారిని ప్రశ్నించారు. ఇలాంటి ప్రశ్నలు వేసి, వేర్పాటువాదుల భాష మాట్లాడుతావా అంటూ బీజేపీ కార్యకర్తలు ఆయనపై దాడి చేశారు.