Share News

Shahbaz Sharif: మళ్లీ యుద్ధానికి దిగితే జాగ్రత్త!

ABN , Publish Date - May 16 , 2025 | 05:22 AM

ఆపరేషన్‌ సిందూర్‌’లో భారత్‌ చేతిలో చావుదెబ్బ తిన్నా పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ యుద్ధ నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఇండియా మరోసారి తమపై యుద్ధానికే దిగితే సర్వస్వం కోల్పోతుందని హెచ్చరించారు.

Shahbaz Sharif: మళ్లీ యుద్ధానికి దిగితే జాగ్రత్త!

  • మోదీకి పాక్‌ ప్రధాని హెచ్చరిక.. ఆపై చర్చలకు ఆహ్వానం

  • కశ్మీరు, సింధు జలాలపై మాట్లాడుకుందామని వ్యాఖ్య

ఇస్లామాబాద్‌, మే 15: ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భారత్‌ చేతిలో చావుదెబ్బ తిన్నా పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ యుద్ధ నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఇండియా మరోసారి తమపై యుద్ధానికే దిగితే సర్వస్వం కోల్పోతుందని హెచ్చరించారు. బుధవారం తమ సియాల్‌కోట్‌ వైమానిక స్థావరానికి వెళ్లి సిబ్బందితో మాట్లాడారు. తాజా ఆపరేషన్‌లో భారత్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి పాక్‌కు చెందిన 11 ఎయిర్‌బే్‌సలను నేలమట్టం చేసినప్పటికీ.. 1971 నాటి ఓటమికి పగతీర్చుకున్నామని షరీఫ్‌ అనడం గమనార్హం. మోదీ పేరెత్తుతూ యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నామని చెప్పారు.


మరోసారి తమపై దాడికి దిగితే అన్నీ కోల్పోతారని బెదిరించారు. అయితే యుద్ధానికి, చర్చలకు కూడా తాము సిద్ధమన్నారు. కశ్మీరు మంటను చల్లార్చుదామని.. అదే సమయంలో సింధు జలాల ఒప్పందంపై చర్చిద్దామని ఆహ్వానించారు. ‘ఏది ఎంచుకుంటారో ఇక మీ ఇష్టం. సింధు జలాలపై మమ్మల్ని ఆదేశించే ప్రయత్నాలు చేయొద్దు. అదే మనకు లక్ష్మణ రేఖ. ఆ నీటిని మళ్లించాలన్న యోచనే వద్దు. నెత్తురు, నీరు కలిసి ప్రవహించలేవన్నది వాస్తవం’ అని ఆయన పేర్కొన్నారు. కాగా.. సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్‌ చేస్తూ భారత్‌ నిర్ణయం తీసుకున్న మూడు వారాల తర్వాత పాక్‌ అధికారికంగా స్పందించింది. ఈ అంశంపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆ దేశ జలవనరుల కార్యదర్శి సయ్యద్‌ ఆలీ ముర్తాజా భారత జలశక్తి కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి లేఖ రాశారు.

Updated Date - May 16 , 2025 | 05:22 AM