Operation Sindoor: మానవళికి ముప్పుగా మారిన పాక్.. నిప్పులు చెరిగిన ఒవైసీ
ABN , Publish Date - May 17 , 2025 | 05:00 PM
పాకిస్తాన్ తనను తాను ఇస్లామిక్ దేశంగా ప్రచారం చేసుకునే ప్రయత్నాలు చేస్తోందనీ, అయితే ఇండియాలో 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారని, ఈ విషయాన్ని కూడా ప్రపంచ దృష్టికి మనం తీసుకెళ్లాలని ఒవైసీ అన్నారు.

న్యూఢిల్లీ: పాకిస్తాన్ నిరంతరం ఉగ్రవాదానికి చేయూతనిస్తూ మానవాళికే ముప్పుగా పరిణమించిందని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) మండిపడ్డారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం 'ఆపరేషన్ సిందూర్' (Opertaion Sindoor) పేరుతో భారత్ కౌంటర్ ఆపరేషన్ నిర్వహించిన నేపథ్యంలో పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పాకిస్తాన్ వైఖరిని ఒవైసీ తీవ్రంగా ఎండగట్టారు.
Jagdeep Dhankar: బిన్ లాడెన్ను హతమార్చిన ఘటనతో ఆపరేషన్ సిందూర్కు పోలిక
పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిస్టులు చాలాకాలంగా అమాయక ప్రజలను ఊచకోత కోస్తుండటాన్ని ప్రపంచం ముందు ఎండగట్టాలని ఒవైసీ అన్నారు. ''పాకిస్తాన్ పెంచిపోషిస్తున్న ఉగ్రవాద బాధిత దేశాల్లో భారత్ కూడా ఉంది. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ జియా-ఉల్-హక్ సమయం నుంచే ఇది మొదలైంది. ఈ విషయాన్ని ప్రపంచ దేశాలకు మనం తెలియచెప్పాలి. కాందహార్ విమానం హైజాక్, 26/11 ముంబై ఉగ్రదాడి, 2001 పార్లమెంటుపై దాడి, ఉరి, పఠాన్కోట్ ఘటనలు, రియాసి, పహల్గాంలో ఏడుగురు పర్యాటకులను కాల్చిచంపడం వంటివి ఈ కోవలేనివే. ఈ ఉగ్రదాడులు మానవాళికి ముప్పు. వరుసపెట్టి జరుగుతున్న ఈ అమానుష దాడులు ఏళ్లతరబడి ఇండియాను కుదిపేస్తున్నాయి'' అని ఒవైసీ అన్నారు.
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా 26 మంది టూరిస్టులను కాల్చిచంపారు. దీంతో 'ఆపరేషన్ సిందూర్' పేరుతో భారత్ మే 7న ఉగ్రవాదులపై విరుచుకుపడింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రశిబిరాలపై మెరుపుదాడి జరిపి 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇస్లామిక్ దేశం అని చెప్పుకుంటూ పాక్ ఉగ్రదాడులకు దిగుతుండటాన్ని ప్రపంచ దేశాల ముందు ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఒవైసీ అన్నారు. ''పాకిస్తాన్ తనను తాను ఇస్లామిక్ దేశంగా ప్రచారం చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇండియాలో 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. ఈ విషయాన్ని కూడా ప్రపంచ దృష్టికి మనం తీసుకెళ్లాలి'' అని అన్నారు.
పాకిస్తాన్ సిద్ధాంతం ఇదే..
మతపరమైన విభజనలు సృష్టించడం, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం పాకిస్తాన్ అప్రకటిత సిద్ధాంతమని ఒవైసీ వెల్లడించారు. 1947లో జమ్మూకశ్మీర్లోకి గిరిజన ఆక్రమణదారులను పాకిస్తాన్ పంపినప్పుడే ఆ దేశం పన్నాగలను భారత్ కనిపెట్టిందని అన్నారు. అప్పట్నించి పాకిస్తాన్ తమాషా చేస్తూనే ఉందని, రేపటి రోజు కూడా చేయవచ్చని, దీనికి ఫుల్స్టాప్ పెట్టే ఆలోచన దానికి ఎంతమాత్రం లేదని చెప్పారు. అయితే, పహల్గాం ఉగ్రదాడితో భారత్ ఇంకెంతమాత్రం సహించగలిగే పరిస్థితి లేకపోయిందని చెప్పారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ వేదికల దృష్టికి భారత్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. విదేశాలకు పంపించే అఖిల పక్ష ప్రతినిధుల బృందంలో తాను ఉండే విషయం కానీ చైర్పర్సన్ ఎవరనేది కానీ తనకు తెలియదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఒవైసీ చెప్పారు.
ఇవీ చదవండి:
Pak PM Shehbaz Sharif: భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
NIA: ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి