Share News

Operation Sindoor Logo: ఆపరేషన్ సిందూర్ లోగోను ఎవరు రూపొందించారో తెలుసా.. ఈ డిజైన్ వెనుక..

ABN , Publish Date - May 28 , 2025 | 09:53 AM

పహల్గామ్‌లో ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం ఆపరేషన్ సిందూర్‎ను చేపట్టింది. ఆ సమయంలో వెలుగులోకి వచ్చిన లోగో (Operation Sindoor Logo) భారతీయ సంస్కృతిలోని సిందూరం భావోద్వేగాన్ని చాటింది. అయితే ఈ లోగో ఎవరు రూపొందించారు, ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Operation Sindoor Logo: ఆపరేషన్ సిందూర్ లోగోను ఎవరు రూపొందించారో తెలుసా.. ఈ డిజైన్ వెనుక..
Operation Sindoor Logo Design

జమ్మూ కశ్మీర్ పహల్గామ్‌లో ఏప్రిల్ 22, 2025న జరిగిన ఉగ్రదాడి మన దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మరణించిన వారిలో అందరూ పురుషులే ఉన్నారు. ఉగ్రవాదులు మహిళలు, చిన్నారులను పక్కన పెట్టి పురుషులనే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది. ఈ దాడికి ప్రతిస్పందనగా, భారత సైన్యం మే 7న ఆపరేషన్ సిందూర్‎ను (Operation Sindoor) ప్రారంభించింది. ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని, భారత సైన్యం దాడులు చేసింది.


ఆపరేషన్ సిందూర్ లోగో

ఈ ఆపరేషన్‌కు సంబంధించి ప్రత్యేక లోగోను (Operation Sindoor Logo) రూపొందించారు. దీని రూపకల్పనలో భారత సైన్యంలోని ఇద్దరు సైనికులు లెఫ్టినెంట్ కల్నల్ హర్ష్ గుప్తా, హవాల్దార్ సురిందర్ సింగ్ కీలక పాత్ర పోషించారు. ఈ లోగోలో సిందూర్ అనే పదం ప్రధానంగా కనిపించేలా తయారు చేశారు. అందులో ఓ అనే అక్షరం ఎరుపు రంగు సిందూరం ఉన్న చిన్న కుంకుమ భరణి మాదిరిగా రూపొందించబడింది. ఇది ప్రధానంగా మహిళలకు గుర్తుగా ఉపయోగించే సిందూరాన్ని సూచిస్తుంది. ఈ లోగో ద్వారా పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల బాధను, ముఖ్యంగా వారి భార్యల విషాదాన్ని ప్రతిబింబించడానికి గుర్తుగా ఉపయోగించారు.


భారతీయ సంస్కృతిలో ప్రత్యేకత

సిందూరం భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యాన్ని కల్గి ఉంది. వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం సిందూరాన్ని నుదిటన పెట్టుకుంటారు. ఈ క్రమంలో సిందూరం కేవలం ఒక అలంకారంగా కాకుండా, ఒక భావోద్వేగంగా, అనేక మంది మహిళల జీవన శైలిగా భావించబడుతుంది. పహల్గామ్ దాడిలో భర్తల ప్రాణాలు కోల్పోయిన వారి భార్యలు సిందూరం లేకుండా కనిపించడం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. దీంతో ఆపరేషన్ సిందూర్ ద్వారా వారి బాధను గుర్తించి, మహిళలకు గౌరవం ఇచ్చేందుకు లోగోలో సిందూరం ప్రత్యేకంగా కనిపించేలా చేశారు.


దేశభక్తికి ప్రతీక

ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక సైనిక ఆపరేషన్ మాత్రమే కాదు. దేశభక్తి, గౌరవం, బాధ, ప్రతీకారం వంటి భావోద్వేగాలకు ప్రతీకగా నిలిచింది. ఈ ఆపరేషన్ ద్వారా, భారత సైన్యం ఉగ్రవాదంపై తన కఠిన వైఖరిని ప్రదర్శించింది. అదే సమయంలో ఈ లోగో దేశవ్యాప్తంగా ప్రజల హృదయాల్లో గౌరవం, ప్రేమ, దేశభక్తిని ప్రేరేపించేలా చేసింది. ఈ లోగో చూసిన అనేక మంది కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు.


ఇవీ చదవండి:

చారిత్రాత్మక ఛేజ్ నమోదు చేసిన బెంగళూరు..

సీక్రెట్ కోడ్ ట్రిక్స్.. సైబర్ నేరాలకు చెక్‌..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 28 , 2025 | 09:58 AM