Rajnath Singh: అనుకున్న లక్ష్యాలను సాధించిన ఆపరేషన్ సిందూర్
ABN , Publish Date - Jun 23 , 2025 | 07:54 PM
కేంద్రం చేపట్టిన ఆపరేష్ సిందూర్ ఉగ్రవాదుల్లో భయం పుట్టించిందని, జాతీయ భద్రతపై భారతదేశానికి ఉన్న కృతనిశ్చయాన్ని బలంగా చాటిచెప్పిందని రాజ్నాథ్ సింగ్ అన్నారు.

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి (Pahalgam terror attack)కి ప్రతిగా మేలో భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అన్ని లక్ష్యాలను సాధించిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) చెప్పారు. ఉగ్రవాదుల్లో భయం పుట్టించిందని, జాతీయ భద్రతపై భారతదేశానికి ఉన్న కృతనిశ్చయాన్ని బలంగా చాటిచెప్పిందని అన్నారు. రాష్ట్రపతి భవన్ కాంప్లెక్స్లో సోమవారంనాడు జరిగిన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బాధ్యతలు చేపట్టిన రెండో సంవత్సరంలో (ఆగస్టు 2023 - జూలై 2024) చేసిన 51 ప్రసంగాలతో కూడిన 'వింగ్స్ టు అవర్ హోప్స్ -వాల్యూమ్ II' (Wings to our Hopes - Volume II)పుస్తకాన్ని ఈ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించారు. దీనితో పాటు హిందీ వెర్షన్ ‘Ashaon Ki Udaan – Khand 2’ను ఈ-వెర్షన్తో సహా ఈ కార్యక్రమంలో అధికారికంగా విడుదల చేశారు. ఈ వ్యాసాల సంకలనాన్ని రాష్ట్రపతి భవన్ చేపట్టగా, కేంద్ర సమాచార, ప్రసార శాఖ సారథ్యంలోని పబ్లికేషన్స్ డివిజన్ ప్రచురించింది.
భారత భవిష్యత్తుకు డాక్యుమెంటు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాయకత్వం, విజన్ను రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా ప్రశంసిస్తూ, ఈ పుస్తకం కేవలం ప్రసంగాల సంకలనం కాదని, భారత భవిష్యత్తును లిపిబద్ధం చేసే డాక్యుమెంట్ అని అన్నారు. గవర్నెన్స్, ఇన్క్ల్యూజివిటీ, జాతీయ ఆకాంక్షలను చాటిచెబుతోందని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యసాధనకు ఒక మార్గదర్శిగా నిలుస్తుందని చెప్పారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణాన్ని ఆవిష్కరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, సహాయ మంత్రి ఎల్ మురుగన్ పాల్గొన్నారు.
సీఎం సారూ.. స్కూలు సీటు కావాలి
గుజరాత్లో బీజేపీ, ఆప్కు చెరో సీటు, కేరళలో కాంగ్రెస్ గెలుపు
For National News And Telugu News