Cabinet Meet in Pahalgam: పహల్గాంలో క్యాబినెట్ మీట్.. ఉగ్రదాడిని ఖండిస్తూ ఒమర్ పోస్ట్
ABN , Publish Date - May 27 , 2025 | 06:10 PM
కశ్మీర్కు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పర్యాటక రంగంపై పహల్గాం ఉగ్రదాడి ప్రభావం తీవ్రంగా పడిందని, ఈ నేపథ్యంలో పర్యాటకంపై ఆధారపడిన ప్రజలకు సంఘీభావంగా క్యాబినెట్ సమావేశాన్ని పహల్గాంలో ఏర్పాటు చేశామని ఒమర్ అబ్దుల్లా తెలిపారు.

జమ్మూ: పహల్గాం ఉగ్రదాడి యావద్దేశాన్ని కుదిపేసింది. 26 మంది టూరిస్టులను పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమానుషంగా కాల్చిచంపిన ఘటనను కేంద్రం, జమ్మూకశ్మీర్ ప్రభుత్వంతో సహా యావద్దేశం తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదుల చర్యకు ప్రతిగా ఆపరేషన్ సిందూర్తో పాక్లోని ఉగ్ర సంస్థలు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్కు భారత బలగాలు గట్టి గుణపాఠం చెప్పాయి. ఈ క్రమంలో ఉగ్రవాదుల పిరికిపంద చర్యలను ఏమాత్రం ఖాతరు చేసేదిలేదనే సందేశాన్ని పంపుతూ ఘటన జరిగిన ప్రాంతంలోనే (Pahalgam) జమ్మూకశ్మీర్ ప్రభుత్వం మంగళవారంనాడు ప్రత్యేక క్యాబినెట్ సమావేశం జరిపింది. వేసవి రాజధాని శ్రీనగర్, శీతాకాల రాజధాని జమ్మూకు వెలుపల తొలిసారి పహల్గాం కన్వెన్షన్ సెంటర్లో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఈ మంత్రివర్గ సమావేశం జరిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ఆయన వెల్లడించారు.
కశ్మీర్కు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పర్యాటక రంగంపై పహల్గాం ఉగ్రదాడి ప్రభావం తీవ్రంగా పడింది. ఈ నేపథ్యంలో పర్యాటకంపై ఆధారపడిన ప్రజలకు సంఘీభావంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు ఒమర్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
పర్యాటకం తమకు ప్రధాన ఆర్థిక వనరుగా ఉందని, యావత్ ప్రపంచాన్ని జమ్మూకశ్మీర్ పర్యాటకం వైపు ఆకర్షించాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. ఇందుకోసం ఎంతో అప్రమత్తతతో తగిన చర్యలు తీసుకుంటున్నామని, కశ్మీర్ లోయలో సాధ్యమైనంత త్వరలో తిరిగి పర్యాటకుల రాకపోకలు పునరుద్ధరించాలని అనుకుంటున్నామని తెలిపారు. గత ఐదారు వారాలుగా దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొందని, జమ్మూకశ్మీర్ భారీ మూల్యం చెల్లించుకుందని చెప్పారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అవసరమైన అన్ని చర్యలు తమ ప్రభుత్వం తీసుకుంటోందని అన్నారు. ఉగ్రవాదుల పరికిపంద చర్యలకు భయపడేది లేదని స్పష్టంగా చెప్పేందుకు తాము ఇక్కడకు వచ్చామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పాక్ ఆర్మీ పోస్టులపై విరుచుకుపడిన భారత బలగాలు.. బీఎస్ఎఫ్ కొత్త వీడియో రిలీజ్
ఆ ఉగ్రవాద ముల్లును తొలగించాల్సిన సమయం వచ్చింది..
ఇంకోసారి మా జోలికొస్తే అంతకంత అనుభవిస్తారు.. పాక్కు శశి థరూర్ స్ట్రాంగ్ వార్నింగ్..
Read Latest National News and Telugu News