Share News

SC Justice Surya Kant: రిజర్వేషన్లు రైలు కంపార్టుమెంట్‌ లాంటివి

ABN , Publish Date - May 07 , 2025 | 05:24 AM

మహారాష్ట్రలో ఓబీసీ రిజర్వేషన్లపై కేసు విచారణలో సుప్రీంకోర్టు జస్టిస్‌ సూర్యకాంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లు రైలు కంపార్టుమెంట్‌లా మారాయని, కొంతమంది మాత్రమే వాటిని ఉపయోగిస్తున్నారని వ్యాఖ్యానించారు.

SC Justice Surya Kant: రిజర్వేషన్లు రైలు కంపార్టుమెంట్‌ లాంటివి

  • ముందు ఎక్కినవారు ఇతరులను అనుమతించరు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, మే 6: కుల ఆధారిత రిజర్వేషన్లు రైలు కంపార్ట్‌మెంట్‌ లాంటివని, ముందుగా కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కినవారు ఇతరులను లోపలకు రానీయరంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలో స్థానిక ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని స్థానిక సంస్థలకు చివరిసారిగా 2016-17లో ఎన్నికలు నిర్వహించారు. ఓబీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో జరుగుతున్న న్యాయపోరాటం కారణంగా అక్కడ ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జనాభా లెక్కల సమయంలో సేకరించిన ఓబీసీల వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, వాటిని ఉపయోగించుకొని స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌ దాఖలైంది. అయితే, రిజర్వేషన్ల అమలుకు ముందుగా ఓబీసీల్లోని రాజకీయంగా, సామాజికంగా వెనుకబడినవారిని గుర్తించడం అవసరమని ప్రభుత్వం తరఫు న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణన్‌ తెలిపారు. ఈ సమయంలో జస్టిస్‌ సూర్యకాంత్‌ జోక్యం చేసుకుంటూ...రైలు కంపార్ట్‌మెంట్‌ను ఉదహరిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని కుటుంబాలు, కొన్ని బృందాలే రిజర్వేషన్‌ ఫలాలను అనుభవిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘సమ్మిళిత సూత్రంపై ఆధారపడి రిజర్వేషన్ల అమలు ఉంటుంది. వాటి పరిధిలోకి రాగల మరిన్ని సమూహాలను గుర్తించడం ప్రభుత్వాల విధి’’ అని వ్యాఖ్యానించారు. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.

Updated Date - May 07 , 2025 | 05:24 AM